స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. 24,000 దిగువకు నిఫ్టీ.. మార్కెట్లను ముంచెత్తిన 3 ప్రధాన కారణాలు ఇవే..
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం నాటి ట్రేడింగ్లో అమ్మకాల తుఫాను చెలరేగింది. ట్రేడింగ్ సమయంలో పెట్టుబడిదారులు భారీగా విక్రయాలకు పాల్పడటంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ అత్యంత కీలకమైన 24,000 పాయింట్ల మానసిక మద్దతు స్థాయి దిగువకు జారిపోయింది. ఈ కీలక స్థాయి పతనం కావడంతో ట్రేడర్లలో ఆందోళన తీవ్రతరమైంది.
అమ్మకాలు ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా విపణి వ్యాప్తంగా విస్తరించడం గమనార్హం. నిఫ్టీ-50 సూచీలోని 50 ప్రధాన షేర్లలో ఏకంగా 44 షేర్లు నష్టాల్లోనే ప్రారంభం అయ్యాయి. నేటి ట్రేడింగ్లో ఎన్ఎస్ఈ పరిధిలో 1,841 షేర్లు నష్టపోగా.. కేవలం 966 షేర్లు మాత్రమే లాభపడగలిగాయి. ముఖ్యంగా మెటల్, రియల్టీ, ఐటీ రంగాల స్టాక్స్ తీవ్ర నష్టాలను చవిచూశాయి.

మార్కెట్లను ముంచెత్తిన 3 ప్రధాన కారణాలు : అంతర్జాతీయ, దేశీయ విపణి పరిణామాలు భారత మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి
మొదటిది.. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 2.5 శాతం పెరిగి బ్యారెల్కు 90 డాలర్ల వద్దకు చేరింది. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నందున, క్రూడ్ ధరల పెంపు దేశీయ ద్రవ్యోల్బణాన్ని, దిగుమతి బిల్లును పెంచి రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి తెస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. దీని ప్రభావంతో మిగిలిన ఆసియా మార్కెట్లు కూడా 0.7 శాతం మేర నష్టపోయాయి.
రెండవది.. ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు తప్పవని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ సంకేతాలు ఇవ్వడం సెప్టెంబర్లో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలను బలపరిచింది. ఫలితంగా అమెరికా బాండ్ రాబడులు పెరిగాయి. బాండ్లలో ఆకర్షణీయమైన రాబడులు లభిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల నుండి నిధులను ఉపసంహరించి, సురక్షిత ఆస్తుల వైపు మళ్లించారు.
మూడవది.. ప్రాధాన్య రంగాలు తీవ్రంగా దెబ్బతినడం. నిఫ్టీ మెటల్ సూచీ దాదాపు 2 శాతం పడిపోగా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండిగో షేర్లు దాదాపు 2 శాతం మేర పడిపోయాయి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు 2 శాతం పెరగడం మార్కెట్లను మరింత పెద్ద పతనం నుండి కొంతవరకు కాపాడింది.
మార్కెట్ పతనం మధ్యలోనే కొన్ని దిగ్గజ కంపెనీల పరిణామాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా అమెరికా శ్వాసకోశ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. ఆస్తమా చికిత్సకు వాడే 'అడ్వైర్ డిస్కస్' జెనరిక్ వెర్షన్ను యూఎస్ మార్కెట్లో విడుదల చేయడంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యంపై నమ్మకం పెరిగింది. సాంకేతికంగా సంక్లిష్టమైన ఈ విభాగంలో పోటీ తక్కువగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో కంపెనీకి బహుళ బిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ నుండి మంచి ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నియామకంపై నిపుణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులోని అంతర్గత అధికారిని నియమించడమే సరైన నిర్ణయమని ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్. ముంద్రా పేర్కొనగా.. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ క్యాపిటల్ భిన్నంగా స్పందించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిటైల్ రుణ వృద్ధి సమస్యను అధిగమించాలంటే బయటి నుండి అనుభవజ్ఞుడైన వ్యక్తినే సీఈఓగా నియమించడం ఉత్తమమని.. ఒకవేళ అంతర్గత నియామకం జరిగితే స్టాక్ పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతుందని మాక్వారీ హెచ్చరించింది. బ్యాంక్ బోర్డు, ఆర్బిఐ తీసుకునే తుది నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications
