స్టాక్ మార్కెట్లో అమ్మకాల సెగ.. కుప్పకూలిన సూచీలు..భోరుమంటున్న ఇన్వెస్టర్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఆగస్టు 14, శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (FII) నిరంతర నిధుల తరలింపు, ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలపై తీవ్ర ప్రభావం చూపాయి. విదేశీ అమ్మకాల ఒత్తిడితో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు నష్టాల్లోనే లావాదేవీలను ప్రారంభించి పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ బిఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) ఒకానొక దశలో 300 పాయింట్లకు పైగా క్షీణించి 77,760 పాయింట్ల స్థాయికి పడిపోయింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (NSE Nifty 50) కూడా సుమారు 74 పాయింట్లు కోల్పోయి.. 24,320 వద్ద కీలకమైన సపోర్ట్ స్థాయి దగ్గర ట్రేడ్ అయింది. ఇక బ్యాంకింగ్ రంగానికి చెందిన బ్యాంక్ నిఫ్టీ కూడా 95 పాయింట్ల నష్టంతో 57,539 వద్ద లావాదేవీలు కొనసాగించగా.. రంగానికి చెందిన నిఫ్టీ ఆటో 0.76 శాతం, నిఫ్టీ మెటల్ 1.17 శాతం నష్టపోవడం సూచీల పతనానికి కారణమైంది.

మార్కెట్లో లాభపడిన, నష్టపోయిన ప్రధాన షేర్ల వివరాలను పరిశీలిస్తే.. ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని రంగాలు లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 50 లోని ప్రముఖ కంపెనీలైన అపోలో హాస్పిటల్స్, బాజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి షేర్లు లాభాల జాబితాలో నిలిచాయి. మరోవైపు హిందాల్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాక్స్ హెల్త్కేర్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టాల బాటలో పయనిస్తూ మార్కెట్ పతనానికి ప్రధాన కారకాలుగా మారాయి.
ఈ రోజు మార్కెట్ క్షీణతకు ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణమయ్యాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న గందరగోళ పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో బ్రెంట్ ముడి చమురు ధరలు మళ్లీ బ్యారెల్కు 80 డాలర్ల పైకి చేరుకోవడం వర్ధమాన మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు గురువారం నాటి ట్రేడింగ్లో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 510.69 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడం కూడా దేశీయ సెంటిమెంట్ను దెబ్బతీసింది.
ఆసియా మార్కెట్లలో మిశ్రమ వాతావరణం నెలకొనగా, అమెరికా వాల్ స్ట్రీట్ సూచీలు సానుకూలంగా ముగిసినప్పటికీ.. రూపాయి క్షీణత, విదేశీ నిధుల వైదొలగుదల కారణంగా భారత మార్కెట్లు కోలుకోలేకపోయాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. నిఫ్టీకి 24,300 - 24,350 స్థాయి అత్యంత కీలకమైన సపోర్ట్గా పనిచేస్తుండగా, ఇది గనుక దిగువకు పడిపోతే మరిన్ని అమ్మకాలు ఎదురయ్యే అవకాశం ఉందని టెక్నికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. అస్థిరత అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications
