భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు.. కారణం ఏంటంటే..
బుధవారం నాటి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 520 పాయింట్లు పడిపోయి 74,681 స్థాయికి చేరగా, నిఫ్టీ 50 కూడా 150 పాయింట్లకు పైగా నష్టపోయి 23,464 మార్కు వద్ద కదలాడింది.
Stock మార్కెట్లో ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బిఐ వంటి ప్రముఖ బ్యాంకింగ్ షేర్లు, అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్టిఐ మైండ్ట్రీ వంటి ఐటీ షేర్లు క్షీణతను నమోదు చేశాయి.
అయితే ట్రేడింగ్ సాగుతుండగా టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు స్వల్ప లాభాల్లోకి మారాయి. వీటితో పాటు ఆటో, ఫైనాన్షియల్ స్టాక్స్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మారుతి, మహీంద్రా & మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ వంటి షేర్లు అగ్ర నష్టాల్లో నిలవగా, బీఈఎల్, ఎటర్నల్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయాయి.

ఈ మార్కెట్ పతనానికి అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల యూఎస్ బాండ్ల రాబడులు గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది పెట్టుబడిదారులలో రిస్క్ తీసుకునే ధోరణిని తగ్గించడంతో ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. జపాన్ నిక్కీ 1.29 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.93 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
అంతకుముందు మంగళవారం అమెరికా మార్కెట్లు కూడా బలహీనంగా ముగిశాయి; డౌ జోన్స్ 0.65 శాతం, ఎస్&పీ 500 0.67 శాతం, నాస్డాక్ 0.84 శాతం చొప్పున పడిపోయాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మే నెల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్కు $111.01 వద్ద స్వల్పంగా తగ్గగా.. బంగారం ధరలు కూడా కాస్త బలహీనపడ్డాయి. అయితే వెండి ఫ్యూచర్స్ మాత్రం సుమారు 0.64 శాతం మేర లాభపడ్డాయి.
ఇలాంటి ఉత్కంఠభరిత మార్కెట్ పరిస్థితుల మధ్య ఈరోజు పలు కార్పొరేట్ కంపెనీలు తమ నాల్గవ త్రైమాసిక (క్యూ4) ఫలితాలను విడుదల చేయనున్నాయి. అపోలో హాస్పిటల్స్, బాష్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జూబిలెంట్ ఫుడ్వర్క్స్, మెట్రో బ్రాండ్స్, టీమ్లీజ్ సర్వీసెస్, సంవర్ధన మోథర్సన్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, హనీవెల్ ఆటోమేషన్, మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్, ప్రోటీన్ ఇ-గవ్ టెక్నాలజీస్ మరియు షేర్ ఇండియా సెక్యూరిటీస్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
మరోవైపు ఐపీఓ మార్కెట్ కూడా నేడు చురుకుగా సాగుతోంది. సుమారు రూ. 24.53 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎన్ఎఫ్పి సంపూర్ణ ఫుడ్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్కు ఈరోజే చివరి రోజు. అలాగే రూ. 50.15 కోట్ల విలువైన టీమ్టెక్ ఫార్మ్వర్క్ సొల్యూషన్స్ ఐపీఓ నేడు రెండో రోజుకు చేరింది. వీటితో పాటు వేగోరామ పంజాబీ అంగీతి ఐపీఓ, హరికంత ఓవర్సీస్ ఐపీఓలు కూడా పెట్టుబడిదారుల కోసం ఈరోజే మార్కెట్లో ప్రారంభమయ్యాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
