స్టాక్ మార్కెట్ దెబ్బేసిందా.. షేర్లు అమ్ముకుని ఎగ్జిట్ అవుతున్న ఇన్వెస్టర్లు.. కారణమేమిటంటే..
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లలోకి ఆగస్టు నెలలో కొత్త స్టాక్ సరఫరా భారీగా వచ్చి పడింది. ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించి నగదుగా మార్చుకోవడంతో పాటు ప్రభుత్వ ఎల్ఐసీ ఆఫర్ ఫర్ సేల్ వంటి భారీ ఇష్యూలు మార్కెట్లోకి రావడం వల్ల దాదాపు 58,000 కోట్ల రూపాయల విలువైన షేర్ల ప్రవాహం మార్కెట్ను ముంచెత్తింది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల షాక్ నుండి కోలుకుంటున్న నిఫ్టీ 500 సూచీ ఆగస్టులో వరుసగా మూడో నెల లాభాలను నమోదు చేసినప్పటికీ.. ఈ స్థాయిలో నిరంతరం వస్తున్న స్టాక్ సరఫరా ఇప్పటికే రద్దీగా ఉన్న ఇష్యూయెన్స్ పైప్లైన్, సెకండరీ మార్కెట్ ద్రవ్య లభ్యతపై తీవ్ర ఒత్తిడి తెస్తుందనే ఆందోళనలను పెంచుతోంది.
ఆగస్టు నెలలో జరిగిన మొత్తం షేర్ల విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ప్రమోటర్లు.. పీఈ ఇన్వెస్టర్ల నిష్క్రమణ వేగవంతమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు 1 నుండి ఆగస్టు 25 మధ్య కాలంలో ప్రమోటర్లు రూ. 12,439.77 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడిదారులు ఏకంగా రూ. 18,095.72 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్ పరిమాణం రూ. 31,445.84 కోట్లుగా నమోదైంది. అల్ట్రాటెక్ సిమెంట్, కెఫిన్ టెక్నాలజీస్ లావాదేవీల్లో ప్రమోటర్, పీఈ నిష్క్రమణలు రెండింటి కింద నమోదైన అతివ్యాప్తిని సర్దుబాటు చేసిన తర్వాత.. నెట్ డీ-డూప్లికేటెడ్ షేర్ల విక్రయాల విలువ రూ. 57,685.08 కోట్లుగా తేలింది.

ముఖ్యంగా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ల అమ్మకాల జోరు జూలై నెలలో ఉన్న రూ. 3,456.83 కోట్ల నుండి ఆగస్టు నాటికి ఐదు రెట్లు పెరిగి రూ. 18,095.72 కోట్లకు చేరుకోవడం గమనార్హం. 2026 క్యాలెండర్ సంవత్సరంలోనే ఇది అత్యధిక నెలవారీ గణాంకం కావడమే కాకుండా.. 2025 జూన్ తర్వాత నమోదైన రెండవ అత్యధిక నిష్క్రమణగా నిలిచింది.
మీషో సంస్థలో జరిగిన రూ. 2,918.92 కోట్ల లావాదేవీ పీఈ నిష్క్రమణల్లో అగ్రస్థానంలో నిలవగా.. దాని తదుపరి స్థానాల్లో అల్ట్రాటెక్ సిమెంట్, లెన్స్కార్ట్ సొల్యూషన్స్, వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎమ్) మరియు డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ నిలిచాయి. ఈ ఐదు కంపెనీల వాటానే ఆగస్టు పీఈ నిష్క్రమణల్లో సుమారు 70 శాతంగా ఉంది. అలాగే ప్రమోటర్ల విక్రయాలలో టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పవర్ సంస్థలు ప్రధానంగా నిలిచాయి.
ప్రైమ్ డేటాబేస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హల్డియా ప్రకారం.. మ్యూచువల్ ఫండ్లలోకి క్రమం తప్పకుండా వస్తున్న నెలవారీ సిప్ నిధులు దేశీయ సంస్థాగత ద్రవ్యతకు బలాన్నిచ్చాయని, దీనివల్ల పెరుగుతున్న షేర్ల సరఫరాను తట్టుకోగలిగే డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ప్రధాన సూచీలు పరిమిత శ్రేణిలోనే ఉన్నప్పటికీ, స్మాల్, మిడ్-క్యాప్ విభాగాలలో నమోదైన లాభాల వల్ల వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారడంతో ప్రమోటర్లు, పీఈ ఫండ్లు తమ లాభాలను స్వీకరించేందుకు మొగ్గు చూపారని ఆయన వివరించారు.
అయితే ఐపీఓలు, ఓఎఫ్ఎస్లు, క్యూఐపీల ప్రవాహం ఇలాగే కొనసాగితే సెకండరీ మార్కెట్కు అందుబాటులో ఉన్న మూలధనంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని సామ్కో మ్యూచువల్ ఫండ్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ల ద్వారా వచ్చే రిటైల్ ఇన్వెస్టర్ల నిధులు ప్రాథమిక మార్కెట్ ఐపీఓల్లోకి మళ్లిపోతున్న సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తిరిగి మార్కెట్లోకి రాకపోతే, నికరంగా లిక్విడిటీ ప్రతికూలంగా మారి స్టాక్ ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. భారీ ఇష్యూల నిరంతర రాక సెకండరీ మార్కెట్ నిలకడను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
