వచ్చేవారం స్టాక్ మార్కెట్ కొంపలు ముంచబోయేది ఇదే.. పెట్టుబడిదారులు అలర్ట్ కావాలంటున్న నిపుణులు..
Stock Market Outlook Next Week: బుల్లిష్ ర్యాలీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం చేదు అనుభవమే మిగిలింది. మధ్యప్రాచ్యంలో రగులుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న ముడి చమురు ధరలు దేశీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీని ఫలితంగా దేశీవాళీ ప్రామాణిక సూచీలైన నిఫ్టీ 50, బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా రెండో వారం కూడా నష్టాల బాటలోనే పయనించాయి.
శుక్రవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ స్వల్పంగా 20.15 పాయింట్లు (0.1%) లాభపడి 24,252 వద్ద స్థిరపడింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ ఎలాంటి మార్పు లేకుండా 77,540.83 వద్ద ఫ్లాట్గా ముగిసింది. మొత్తం వారాన్ని పరిశీలిస్తే నిఫ్టీ 0.5 శాతం, సెన్సెక్స్ 0.6 శాతం మేర నష్టపోయాయి. అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ ఒక ఇరుకైన పరిధిలోనే కదలాడిందని ఎస్బీఐ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ సన్నీ అగర్వాల్ విశ్లేషించారు. అయితే, ప్రస్తుత కార్పొరేట్ ఫలితాల సీజన్ అంచనాలను మించి ఉండటం మార్కెట్కు కాస్త ఊరటనిచ్చింది. పలు దిగ్గజ కంపెనీలు తమ ఆదాయం, నికర లాభాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం.

రాబోయే కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్కు ముడి చమురు ధరలే అతిపెద్ద సవాలుగా మారనున్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా శుక్రవారం సాయంత్రానికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ఏకంగా 94 డాలర్లను అధిగమించింది. ఈ వారం పొడవునా ఇది 90 డాలర్లకు పైనే కొనసాగడం గమనార్హం. అధిక ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోయడంతో పాటు కార్పొరేట్ కంపెనీల నిర్వహణ వ్యయాలను పెంచుతాయని.. ఇది దేశీయ మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ రుచిత్ జైన్ పేర్కొన్నారు. ఒకవేళ ముడి చమురు ధరలు తగ్గితే.. నిఫ్టీ బలపడి త్వరలోనే 24,500-24,600 నిరోధక స్థాయిలను దాటే అవకాశం ఉందన్నారు.
సాంకేతికపరంగా చూస్తే.. నిఫ్టీకి 24,000-24,500 శ్రేణి అత్యంత కీలకంగా మారింది. వారాంతంలో ఏదైనా సానుకూల వార్త రాకపోతే నిఫ్టీ ఇదే శ్రేణిలో కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, వరుసగా 12 రోజులు గరిష్ట స్థాయిలను దాటలేకపోయిన నిఫ్టీ, 24,000 వద్ద బలమైన మద్దతును నిలబెట్టుకోవడం సానుకూల పరిణామం. మార్చి నెల నుంచి నిఫ్టీ పడిపోయినప్పుడల్లా 'హయ్యర్ బాటమ్' (మునుపటి కంటే అధిక కనిష్ట స్థాయి) నమోదు చేస్తుండటం మార్కెట్ బలాన్ని సూచిస్తోంది.
మార్కెట్లో అనిశ్చితిని సూచించే 'వోలటిలిటీ ఇండెక్స్ (VIX)' శుక్రవారం 4.1% పెరిగి 11.2కి చేరడం ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళనకు అద్దం పడుతోంది. అలాగే, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) శుక్రవారం ₹543 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) ₹2,124 కోట్లను కొనుగోలు చేసి మార్కెట్కు అండగా నిలిచారు. బ్రాడర్ మార్కెట్లో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు స్వల్ప లాభాలతో ముగియడం కొంత ఊరటనిచ్చే అంశం. ఆసియా మార్కెట్లలో జపాన్ నష్టపోగా, చైనా స్థిరంగా, తైవాన్, హాంకాంగ్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
