వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసా.. ఇరాన్ యుద్ద భయాల మధ్య ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే..
అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనపడటంతో గత రెండు వారాలుగా సాగుతున్న లాభాల పరంపరకు తెరపడి.. దేశీయ సూచీలు ఈ వారాన్ని తీవ్ర నష్టాలతో ముగించాయి.
మొదటి త్రైమాసికంలో పలు కంపెనీల ఆదాయాలు నిలకడగా నమోదైనప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిష్టంభన, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల వల్ల అధిక స్థాయిలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. దీనితో పాటు అంతర్జాతీయ బాహ్య ప్రతికూలతలు తోడవడంతో మార్కెట్ తన నిలకడైన వృద్ధి వేగాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది.

వారమంతా నిఫ్టీ అత్యంత పరిమిత శ్రేణిలోనే కదలాడింది. ఇన్వెస్టర్లు అవాంఛనీయ రిస్క్లు తీసుకోవడానికి సిద్ధంగా లేరని, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన షేర్లకే ప్రాధాన్యత ఇచ్చారని ఇది స్పష్టం చేస్తోంది. దేశీయంగా ఆర్థిక మూలాలు బలంగా ఉన్నప్పటికీ.. బాహ్య వాతావరణంలో అనిశ్చితి రాజ్యమేలడంతో సూచీలు నష్టాల బాట పట్టక తప్పలేదు.
ఈ వారం వ్యవధిలో బెంచ్మార్క్ సూచీ అయిన సెన్సెక్స్ 0.62 శాతం క్షీణించి 78,009.25 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ-50 సూచీ 0.83 శాతం పడిపోయి 24,366 వద్ద క్లోజ్ అయింది. విభిన్న విభాగాల విషయానికొస్తే.. మిడ్క్యాప్ సూచీ 0.50 శాతం లాభంతో సానుకూల ప్రదర్శన చేయగా.. స్మాల్క్యాప్ సూచీ 0.66 శాతం పతనమైంది.
రాబోయే వారం మార్కెట్ సరళిపై నిపుణులు కీలక అంచనాలను వెలువరించారు. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ ప్రకారం.. చమురు ధరల మంటలు, ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలు ట్రేడింగ్పై ఒత్తిడి తెచ్చాయి. అమెరికా కార్మిక మార్కెట్ డేటా బలహీనంగా రావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపుపై ఆశలు చిగురించినప్పటికీ.. చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం ద్రవ్యోల్బణ భయాలను పునరుద్ధరించింది.
అయితే, నిఫ్టీ 50 కంపెనీల కార్పొరేట్ ఆర్జనలు అంచనాలను మించి రాణించడం మార్కెట్కు పెద్ద ఊరటగా నిలిచింది. రంగాల వారీగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, పిఎస్యు బ్యాంకింగ్ షేర్లు బలమైన డిమాండ్ను కనబరచగా, మెటల్స్, ఆటో, ఎఫ్ఎంసిజి విభాగాలు తీవ్ర లాభాల స్వీకరణను ఎదుర్కొన్నాయి.
ముందున్న రోజుల్లో క్రూడ్ ఆయిల్ కదలికలు, యుఎస్ రిటైల్ సేల్స్, ఎఫ్ఓఎమ్సి సమావేశ వివరాలు, చైనా ఆర్థిక డేటా ఆధారంగా మార్కెట్ దిశ నిర్దేశించబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రెలిగేర్ బ్రోకింగ్ నిపుణుడు అజిత్ మిశ్రా ప్రకారం.. ట్రేడర్లు కొత్తగా బయ్యింగ్ పొజిషన్లు తీసుకునేటప్పుడు విడతల వారీగా వ్యవహరించడం శ్రేయస్కరం.
సాంకేతిక సంకేతాలను పరిశీలిస్తే సెన్సెక్స్కు 77,700-77,500 వద్ద తక్షణ మద్దతు లభిస్తుండగా, 78,500 కంటే పైకి లేస్తేనే మళ్లీ కొనుగోళ్ల జోరు కనిపిస్తుంది. అలాగే నిఫ్టీకి 24,250, 24,000 వద్ద ప్రధాన సపోర్ట్ లభిస్తోందని, 24,600 స్థాయిని దాటితేనే కొత్త రికార్డుల వైపు అడుగులు పడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
