నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు.. కొంపలు ముంచుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు..
భౌగోళిక-రాజకీయ ఆందోళనలు, అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో మంగళవారం నాటి భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రోజంతా చాలా ఇరుకైన పరిధిలోనే (Narrow range) మందకొడిగా సాగిన ట్రేడింగ్, చివరకు అమ్మకాల ఒత్తిడికి లోనై భారీ నష్టాలతో ముగిసింది. వ్యాపార సమయం ముగిసే సమయానికి నిఫ్టీ50 సూచీ కీలకమైన 24,500 స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, అమెరికా-ఇరాన్ నడుమ పెరిగిన యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
సాధారణ ట్రేడింగ్ ముగిసిన తర్వాత క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) ద్వారా లెక్కించిన తుది గణాంకాల ప్రకారం.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 388 పాయింట్లు పడిపోయి 78,154 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 112 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా మార్కెట్కు మద్దతు ఇవ్వలేక 241 పాయింట్లు కోల్పోయి 57,446 వద్ద ముగిసింది. అయితే విస్తృత మార్కెట్లో మిడ్క్యాప్ స్టాక్స్ అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాయి. దీంతో నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ కేవలం 12 పాయింట్లు మాత్రమే తగ్గి 63,843 వద్ద ముగియడం.. మార్కెట్లో పెద్ద ఎత్తున సొమ్ము బయటకు పోలేదని స్పష్టం చేస్తోంది.

ఒకవైపు ప్రధాన సూచీలు పతనమైనప్పటికీ.. ఫలితాలు, కార్పొరేట్ వార్తల మద్దతుతో పలు రంగాలు, కంపెనీల స్టాక్లలో కొనుగోళ్ల వేడుక కనిపిస్తోంది. మొదటి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను సాధించడంతో జైడస్ లైఫ్ షేరు ఏకంగా ఏడు శాతానికి పైగా దూసుకెళ్లింది. అలాగే ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, రిఫైనింగ్ మార్జిన్ల అంచనాలతో చెన్నై పెట్రోలియం, ఎంఆర్పీఎల్ షేర్లు 15 శాతం వరకు రికార్డు స్థాయిలో పెరిగాయి.
కోల్టే పాటిల్ 12 శాతం లాభపడగా, బోష్, సిమెన్స్ షేర్లు ఆకట్టుకునే ఫలితాలతో భారీగా పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లకు (FPI) వ్యవసాయేతర వస్తువుల్లో ట్రేడింగ్ అవకాశాలు కల్పించే యోచనలో సెబీ ఉందన్న వార్తలతో ఎంసీఎక్స్ షేరు 4 శాతం లాభపడగా, ఎఫ్ అండ్ ఓ నిషేధం నుండి ఉపశమనం లభించడంతో ఎల్ఐసి 3 శాతం పెరిగింది.
మరొకవైపు, ఆరోగ్య సంరక్షణ సేవలు, ఆసుపత్రి బిల్లుల ధరలపై గరిష్ట పరిమితి విధించే అవకాశం ఉందంటూ పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సుల వార్తలతో మాక్స్ హెల్త్కేర్, అపోలో హాస్పిటల్స్ వంటి ఆసుపత్రి రంగానికి చెందిన స్టాక్లు ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే ఆయిల్, స్టీల్ విభాగాల్లో రూ. 2,000 నుండి 3,000 కోట్ల నిధుల సమీకరణ కోసం వాటాల విక్రయం జరగవచ్చనే ప్రచారంతో వేదాంత గ్రూప్ షేర్లు చివరి గంటలో క్షీణించాయి.
అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ హత్యాయత్నం బెదిరింపుల నేపథ్యంలో ఆయనను టర్కీ నుండి అత్యంత రహస్యంగా సీ-32ఏ మిలిటరీ జెట్లో తరలించినట్లు వార్తలు రావడం గ్లోబల్ మార్కెట్లలో కంగారు పుట్టించింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. మార్కెట్ నుండి నిధులు పూర్తిగా అదృశ్యం కాలేదని, కేవలం ఒక రంగానికి చెందిన స్టాక్ నుండి మరో వైపునకు మారాయని అర్థమవుతోంది. సూచీల నష్టాలను చూసి ఆందోళన చెందకుండా.. బలమైన వ్యాపార ఫలితాలు సాధిస్తున్న కంపెనీలపై దృష్ట పెట్టడమే ప్రస్తుత మార్కెట్ ఇన్వెస్టర్లకు సరైన వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
