నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..ఇన్వెస్టర్ల కొంపలు ముంచుతున్న ముడిచమురు ధరల పెరుగుదల..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నాడు రోజంతా స్వల్ప శ్రేణిలోనే ట్రేడ్ అవుతూ అంతిమంగా నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్యారెల్ ముడి చమురు ధర భగ్గుమనడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి, బిఎస్ఈ సెన్సెక్స్ 67.56 పాయింట్లు లేదా 0.09 శాతం పడిపోయి 74,696.67 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 22.05 పాయింట్లు (0.09 శాతం) క్షీణించి 23,409.45 వద్ద ముగిసింది.
ప్రామాణిక సూచీలతో పాటు విస్తృత మార్కెట్లోనూ నష్టాల తీవ్రత కనిపించింది. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.36 శాతం మరియు నిఫ్టీ స్మాల్క్యాప్ సూచీ 0.03 శాతం నష్టంతో ట్రేడయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ రగం 1 శాతానికి పైగా లాభపడి అత్యుత్తమ పనితీరుతో మార్కెట్కు మద్దతుగా నిలవగా, మరోవైపు మహీంద్రా & మహీంద్రా, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియల్టీ రంగాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.

అంతర్జాతీయంగా ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్లో బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు $102 డాలర్లకు చేరుకోవడం మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నింపింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ బ్యారెల్కు $101.22 వద్ద కొనసాగాయి. పశ్చిమాసియా ప్రాంతంలో సరఫరా సమస్యలు తలెత్తుతాయన్న భయాలే ఇందుకు కారణం. ముడి చమురు మంటలతో పాటు, బులియన్ మార్కెట్లోనూ స్వల్ప క్షీణత నమోదైంది. బంగారం ఫ్యూచర్లు 0.12 శాతం, వెండి ఫ్యూచర్లు 0.99 శాతం మేర నష్టపోయాయి.
మార్కెట్ సాంకేతిక గమనంపై యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా విశ్లేషిస్తూ, నిఫ్టీ50 రాబోయే రోజుల్లోనూ ఒత్తిడిలోనే ఉండవచ్చని తెలిపారు. బ్రెంట్ క్రూడ్ $100 మార్కును దాటడం, అమెరికా-ఇరాన్ సంక్షోభం ముదిరిపోవడం ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై మళ్లీ మబ్బులు కమ్ముకునేలా చేస్తున్నాయని చెప్పారు. సాంకేతికంగా నిఫ్టీకి 23,600 స్థాయి బలమైన నిరోధకంగా మారగా, తక్షణ మద్దతు స్థాయి 23,350గా ఉందని, ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే సూచీ 23,150 స్థాయికి జారవచ్చని పేర్కొన్నారు. చమురు ధరలు లేదా ఉద్రిక్తతలు తగ్గితేనే మార్కెట్కు ఉపశమనం లభిస్తుందని, ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని సూచించారు.
ఈ అస్థిరతల మధ్య ప్రాథమిక వాటా విపణి (IPO) విభాగం మాత్రం అత్యంత రద్దీగా సాగింది. గురువారం నాడు వీగాలాండ్ డెవలపర్స్, మహారాజా & స్పీడెక్స్, ఓం గెలాక్సీ, రక్షణ్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు పంచత్వ భారత్ కంపెనీల ఐపీఓలు సబ్స్క్రిప్షన్ కోసం కొత్తగా ప్రారంభమయ్యాయి. మెయిన్బోర్డ్ విభాగంలో రెంట్మోజో, అసెట్ రీకన్స్ట్రక్షన్, మణిపాల్ పేమెంట్ & ఐడెంటిటీ సొల్యూషన్స్, స్టీమ్హౌస్ ఇండియా, ఎల్సిసి ప్రాజెక్ట్స్ మరియు కరమ్తారా ఇంజనీరింగ్ ఐపీఓలు రెండవ రోజు బిడ్డింగ్ పూర్తి చేసుకున్నాయి. అలాగే ఎస్ఎమ్ఈ (SME) విభాగంలో ఇన్ఫ్రాక్స్ రెన్యూవబుల్, వినోద్ టెక్స్వరల్డ్, ఆమ్టెక్ ఎస్టర్స్ ఐపీఓలు రెండవ రోజు పబ్లిక్ ఆఫరింగ్ జరుపుకోగా, కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్, గ్లాస్ వాల్ సిస్టమ్స్ ఐపీఓలు నేటితో చివరి రోజు సబ్స్క్రిప్షన్ను ముగించుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $101.50 దాటి $102 పైన నిలవడం, డబ్ల్యూటీఐ క్రూడ్ $96-97 స్థాయికి చేరుకోవడం మార్కెట్లను కలవరపెడుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న తీవ్రమైన ఘర్షణలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థకు పెద్ద ముప్పుగా పరిణమించాయి. తమ ముడి చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడే భారతదేశానికి ఈ ధరల పెరుగుదల పెద్ద పీడకలగా మారింది.
దిగుమతి బిల్లులు పెరగడం వల్ల భారత రూపాయి మారకం విలువ బలహీనపడటంతో పాటు, దేశీయంగా పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తీవ్రమవుతాయి. ఇది కంపెనీల కార్పొరేట్ నిర్వహణ వ్యయాలను పెంచి, వారి త్రైమాసిక లాభాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ ఆందోళనల నడుమ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం ₹583 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 1,509 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి పతనాన్ని కొంతవరకే పరిమితం చేయగలిగారు.
ప్రపంచవ్యాప్తంగా వాల్ స్ట్రీట్, యూరోపియన్ మార్కెట్లలో నమోదైన నష్టాల ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ప్రారంభ ట్రేడింగ్లోనే జపాన్ నిక్కీ 225, దక్షిణ కొరియా కోస్పి సూచీలు 1 శాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు రాబోయే యుఎస్ ద్రవ్యోల్బణ డేటా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదుకావచ్చని, దాంతో వడ్డీ రేట్లు మరికొంత కాలం అధిక స్థాయిలోనే కొనసాగుతాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా 10-సంవత్సరాల బాండ్ల రాబడులు పెరగడంతో పాటు, బాండ్ మార్కెట్ ఆందోళనను సూచించే MOVE ఇండెక్స్ కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటం భారత మార్కెట్లకు ప్రతికూల సంకేతంగా మారింది.


Click it and Unblock the Notifications
