ఈ కంపెనీల షేర్లపై బిగ్ అలర్ట్.. ఒక్క వారంలో రూ. 1.13 లక్షల కోట్ల నష్టం..టాప్ లిస్ట్ ఇదే..
Stock Market Cap Wipeout: భారత ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న బేరిష్ ట్రెండ్కు అనుగుణంగా..దేశంలోనే అత్యంత విలువైన టాప్-10 కంపెనీలలో ఏడు సంస్థల సంయుక్త మార్కెట్ విలువ గత వారంలో భారీగా క్షీణించింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఆ ఏడు కంపెనీల మార్కెట్ విలువ రూ. 1.13 లక్షల కోట్లు హరించుకుపోగా.. ప్రధానంగా భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అత్యధికంగా నష్టపోయి జాబితాలో చివరి స్థానాల్లో నిలిచాయి.
గత వారంలో ట్రేడింగ్ సరళిని పరిశీలిస్తే.. బీఎస్ఈ బెంచ్మార్క్ సూచీ సెన్సెక్స్ 276.32 పాయింట్లు (0.35 శాతం) క్షీణించగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.35 పాయింట్లు (0.31 శాతం) నష్టపోయింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పై నెలకొన్న ఆందోళనలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, నూతన ముగింపు వేలం సెషన్ల హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ టెక్నాలజీ రంగంలో సానుకూల ధోరణి కారణంగా ఐటీ స్టాక్లలో కొనుగోళ్ల మద్దతు లభించి శుక్రవారం మార్కెట్లు కోలుకున్నప్పటికీ.. ప్రధాన సూచీలు వరుసగా మూడో వారం కూడా ఒత్తిడిలోనే ముగిశాయి.

టాప్-10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 40,056.32 కోట్లు క్షీణించి రూ. 17,38,119.27 కోట్లకు పడిపోయింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 11,558.35 కోట్లు తగ్గి రూ. 11,09,600.70 కోట్లకు చేరగా, బజాజ్ ఫైనాన్స్ విలువ రూ. 10,086.05 కోట్లు పడిపోయి రూ. 6,70,535.57 కోట్లకు పరిమితమైంది. వీరితో పాటు లార్సెన్ & టూబ్రో రూ. 6,473.45 కోట్లు (ప్రస్తుతం రూ. 5,55,987.49 కోట్లు), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రూ. 3,162.5 కోట్లు (ప్రస్తుతం రూ. 5,32,817.81 కోట్లు), మరియు హిందుస్థాన్ యూనిలివర్ రూ. 1,550.73 కోట్లు (ప్రస్తుతం రూ. 4,72,361.83 కోట్లు) మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.
అయితే ఈ మార్కెట్ ప్రతికూలతల మధ్య కూడా ఐటీ, బ్యాంకింగ్ దిగ్గజాలు లాభాలను నమోదు చేశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాప్ రూ. 16,643.2 కోట్లు పెరిగి రూ. 8,48,079.71 కోట్లకు చేరింది. ఐసిఐసిఐ బ్యాంక్ విలువ రూ. 4,475.28 కోట్లు పెరిగి రూ. 10,22,805.73 కోట్లకు చేరుకోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ. 599.99 కోట్లు పెరిగి రూ. 9,65,568.75 కోట్లుగా నమోదైంది.
ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దాని తదుపరి స్థానాల్లో భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, ఎల్ఐసీ మరియు హిందుస్థాన్ యూనిలివర్ వరుసగా నిలిచాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
