స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. ఊహించని షాక్ ఇచ్చిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ జేపీమోర్గాన్..
భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీమోర్గాన్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశీయంగా పెరిగిన స్టాక్ వాల్యుయేషన్లను దృష్టిలో ఉంచుకుని, భారత మార్కెట్ రేటింగ్ను 'ఓవర్వెయిట్' నుండి 'న్యూట్రల్'కు తగ్గిస్తూ సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ వార్తతో మార్కెట్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
జేపీమోర్గాన్ అంచనా ప్రకారం.. ఒకవేళ పరిస్థితులు అత్యంత దారుణంగా మారితే నిఫ్టీ 50 సూచీ ఏకంగా 20,500 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది. నేడు మధ్యాహ్నం సమయానికి నిఫ్టీ ఇప్పటికే 1 శాతానికి పైగా నష్టపోయి 23,900 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఈ హెచ్చరిక నిజమైతే ప్రస్తుత స్థాయి నుండి మరో 14% పైగా పతనం తప్పదని అర్థమవుతోంది. గతంలో ఈ బేర్ కేస్ లక్ష్యం 24,000గా ఉండగా, ఇప్పుడు దానిని 20,500కు తగ్గించడం విశేషం. సాధారణ పరిస్థితుల్లో నిఫ్టీ 27,000 వద్ద ఉండవచ్చని ఈ సంస్థ పేర్కొంది.

భారత Market ధరలు కంపెనీల ఆదాయాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని, ఈ వాల్యుయేషన్ అంతరం ఇన్వెస్టర్లకు పెద్ద రిస్క్గా మారిందని నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలిగితే, అది భారత కంపెనీల ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే నిపుణులు FY27 ఆదాయ అంచనాలను 2% నుండి 10% వరకు తగ్గించారు.
మరోవైపు, కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, డేటా సెంటర్ల వంటి భవిష్యత్తు కీలక రంగాల్లో భారత్లోని లార్జ్-క్యాప్ కంపెనీల ప్రాబల్యం అమెరికా, చైనా, తైవాన్ వంటి దేశాల కంటే తక్కువగా ఉండటం ఒక లోపంగా మారింది. అలాగే అసాధారణ వర్షపాతం వల్ల ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరగడం లేదా గ్రామీణ ఆదాయాలు దెబ్బతినడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయని జేపీమోర్గాన్ ఆందోళన వ్యక్తం చేసింది.
రంగాల వారీగా విశ్లేషిస్తే జేపీమోర్గాన్.. ఫైనాన్షియల్స్, మెటీరియల్స్, హాస్పిటల్స్, డిఫెన్స్ మరియు పవర్ రంగాలు మెరుగైన రాబడులను ఇవ్వవచ్చని భావిస్తూ వాటికి ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. అయితే, ఐటీ మరియు ఫార్మాస్యూటికల్ రంగాలకు మాత్రం ప్రతికూల రేటింగ్ ఇచ్చింది. ముఖ్యంగా అమెరికాలో కొత్త హెచ్-1బి వీసా నిబంధనలు మరియు గ్లోబల్ డిమాండ్ తగ్గడం ఐటీ రంగానికి శాపంగా మారే అవకాశం ఉందని వివరించింది.
భారతదేశ దీర్ఘకాలిక వృద్ధి కథనం బలంగా ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో మాత్రం పెట్టుబడిదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇతర వర్ధమాన మార్కెట్లలో మెరుగైన అవకాశాలను వెతుక్కోవడం మంచిదని సూచించింది. మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ తరుణంలో అనవసరపు రిస్క్ తీసుకోకుండా, వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారే వరకు ఓపికగా ఉండటమే ఉత్తమమని ఈ నివేదిక సారాంశం.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
