రూ.లక్షకు రూ. 10 లక్షలు లాభాలు.. అసలు ట్విస్ట్ ఏంటంటే.. రూ.1.36 కోట్లు హాంఫట్..
Online Trading Scam: షేర్ ట్రేడింగ్ నిపుణులుగా నటిస్తూ ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల చేతిలో చించ్వాడ్కు చెందిన ఒక టెలికాం కంపెనీ సీనియర్ మేనేజర్ (53) దారుణంగా మోసపోయారు. ఆన్లైన్ స్టాక్ మార్కెట్, ఐపీఓ (IPO) పెట్టుబడుల పేరుతో నిందితులు బాధితుడి నుండి ఏకంగా రూ. 1.36 కోట్లు కాజేసినట్లు సైబర్ పోలీసులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య జరిగిన వరుస లావాదేవీలలో తాను డబ్బులు కోల్పోయినట్లు గుర్తించిన బాధితుడు, శుక్రవారం పింప్రి చించ్వాడ్ సైబర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు అత్యంత పక్కా పథకం ప్రకారం ఒక ప్రైవేట్ మెసేజింగ్ అప్లికేషన్ గ్రూప్లో బాధితుడిని చేర్చారు. ఆ గ్రూప్లోని ఇతర సభ్యులు (మోసగాళ్ల సహచరులు) ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ ద్వారా తాము భారీ లాభాలు గడిస్తున్నామని, గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చే పెట్టుబడి సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తప్పుడు చాటింగ్లతో నమ్మకం కలిగించారు. వారి మాటలు నిజమేనని నమ్మిన బాధితుడు సలహాల కోసం గ్రూప్ అడ్మిన్ను సంప్రదించగా, ట్రేడింగ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన మోసపూరిత మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోమని సూచించారు.

ప్రారంభంలో తక్కువ మొత్తంతో కొనుగోలు చేసిన షేర్లు మంచి లాభాలను చూపించడంతో.. లాభాలను గరిష్ఠ స్థాయికి పెంచుకోవాలంటూ నిందితులు అతడిని ప్రోత్సహించి అధిక విలువ గల షేర్లు, ఐపీఓలలో పెట్టుబడుల పేరుతో వారు ఇచ్చిన నాలుగు వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లోకి విడతల వారీగా మొత్తం రూ. 1.36 కోట్లు బదిలీ చేయించుకున్నారు.
ఆ నకిలీ యాప్లో బాధితుడి ఖాతాలో రూ. 2.5 కోట్లకు పైగా కల్పిత లాభాలు కనిపిస్తుండటంతో తన పెట్టుబడులు అసాధారణంగా పెరుగుతున్నాయని భావించిన ఆయన, ఆ షేర్లను విక్రయించి లాభాలను తన బ్యాంక్ ఖాతాలోకి ఉపసంహరించుకోవడానికి (Withdraw) ప్రయత్నించినప్పుడు అసలు నిజం బయటపడింది. నిందితులు విత్డ్రా అభ్యర్థనలను అడ్డుకోవడంతో పాటు అదనపు రుసుములు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో, తాను తీవ్రంగా మోసపోయానని, ఆ యాప్, చూపించిన లాభాలు అన్నీ కల్పితమేనని ఆయన గ్రహించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పింప్రి చించ్వాడ్ సైబర్ పోలీసులు.. డబ్బు బదిలీకి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్లు, సదరు యాప్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా లేదా మెసేజింగ్ గ్రూపులలో వచ్చే అపరిచిత పెట్టుబడి సలహాలను నమ్మవద్దని, అనధికారిక ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేసి డబ్బులు జమ చేయవద్దని అధికారులు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications

