NSE Mega IPOకి SEBI గ్రీన్ సిగ్నల్.. ఈ కంపెనీల షేర్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లు ఓ లుక్కేసుకోండి..
భారత అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) నుంచి సూత్రప్రాయ అనుమతులు లభించడంతో పాటు సెప్టెంబర్ 2026 చివరి నాటికి ఎక్స్ఛేంజ్ షేర్లు దలాల్ స్ట్రీట్లో జాబితా అయ్యేందుకు మార్గం సుగమమైంది. రూ. 30,000 కోట్ల అంచనా విలువతో రాబోతున్న ఈ ఇష్యూ, దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవబోతోంది.
ఈ పబ్లిక్ ఆఫర్ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో రానుంది. ఎన్ఎస్ఈలోని ప్రస్తుత వాటాదారులు దాదాపు 14.89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ఎన్ఎస్ఈ సంస్థకు కొత్తగా నిధులు రావు. కానీ ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారులకు తమ వాటాలను విక్రయించి నగదుగా మార్చుకునే (Value Unlocking) అవకాశం లభిస్తుంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ రూ. 5 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఐపీఓ వాచ్ ప్రకారం చూసినట్లయితే ఈరోజు ఎన్ఎస్ఈ ఐపీఓ జీఎంపీ (గ్రే మార్కెట్ ప్రీమియం) రూ. 200గా ఉంది. అయితే, ఐపీఓ ధరల శ్రేణి, సబ్స్క్రిప్షన్ ప్రారంభ తేదీ, ఇతర వివరాలను ఎన్ఎస్ఈ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎన్ఎస్ఈ యాజమాన్యం తన వాల్యుయేషన్లపై కొంత ప్రీమియంను అందిస్తే.. అప్పుడు ఎన్ఎస్ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ. 1800 నుంచి రూ. 1900 పరిధిలో ఉండవచ్చని అంచనా. లేకపోతే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ. 2000 నుంచి రూ. 2200 పరిధిలో రావచ్చు.
ఎన్ఎస్ఈ ఐపీఓ వార్తలతో ఎక్స్ఛేంజ్లో నేరుగా లేదా పరోక్షంగా వాటాలు ఉన్నపలు కంపెనీల షేర్లు విపరీతంగా పుంజుకున్నాయి.
న్యూ ఇండియా అస్యూరెన్స్ (NIACL): ఎన్ఎస్ఈలో 1.42% నేరుగా వాటా ఉన్నందున ఈ కంపెనీ షేరు దాదాపు 15% జంప్ చేసింది.
IFCI & స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎన్ఎస్ఈలో పరోక్ష వాటాలు ఉన్న ఐఎఫ్సీఐ షేర్లు 11.5% పెరగ్గా, ఎస్బీఐ, బీవోబీ, జీఐసీ వంటి ప్రభుత్వ బ్యాంకులు మరియు భీమా సంస్థల షేర్లు కూడా లాభాల్లో పయనించాయి.
ఎల్ఐసీ (LIC): ఎన్ఎస్ఈలో అత్యధికంగా 10.7% వాటా (26.5 కోట్ల షేర్లు) కలిగి ఉన్న భారతీయ జీవిత భీమా సంస్థ (LIC), ఈ ఐపీఓలో తన వాటాను విక్రయించడం లేదని, దీర్ఘకాలిక పెట్టుబడిదారుగానే కొనసాగుతానని స్పష్టం చేసింది.
ముఖ్యమైన తేదీల అంచనా:
ధరల శ్రేణి (Price Band) ప్రకటన: సెప్టెంబర్ 11, 2026
సబ్స్క్రిప్షన్ ప్రారంభం: సెప్టెంబర్ 21, 2026
సబ్స్క్రిప్షన్ ముగింపు: సెప్టెంబర్ 23, 2026
కేటాయింపుల వివరాలు (Allotment): సెప్టెంబర్ 24, 2026
లిస్టింగ్ తేదీ: సెప్టెంబర్ 25 నుండి 28, 2026 మధ్యలో
ప్రధాన విక్రయ వాటాదారులు, వారి వాటాల వివరాలు:
ఎస్బిఐ గ్రూప్ (SBI Group): ఈ ఐపీఓలో అతిపెద్ద విక్రయదారుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ నిలిచింది. ఎస్బీఐ దాదాపు 2.475 కోట్ల వరకు షేర్లను ఆఫర్ చేయనుంది (ఇందులో ఎస్బీఐ నేరుగా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా విక్రయించే షేర్లు ఉన్నాయి).
ఎంఎస్ స్ట్రాటజిక్ (మారిషస్) లిమిటెడ్: ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ అయిన ఎంఎస్ స్ట్రాటజిక్ దాదాపు 1.60 కోట్ల షేర్లను విక్రయించనుంది.
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (CPPIB): గ్లోబల్ పెన్షన్ ఫండ్ సంస్థ పబ్లిక్ ఆఫర్ ద్వారా 1.19 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది.
అరండా ఇన్వెస్ట్మెంట్స్ (మారిషస్) పిటిఇ లిమిటెడ్ (టెమాసెక్): సింగపూర్ ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ పెట్టుబడి సంస్థ 1.12 కోట్ల షేర్లను మార్కెట్లో అమ్మకానికి ఉంచింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB): ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సుమారు 1.10 కోట్ల షేర్లను విక్రయించబోతోంది.
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL): ఈ సంస్థ సుమారు 1.09 కోట్ల షేర్లను పబ్లిక్ ఆఫర్ ద్వారా ఆఫర్ చేయనుంది.
ఇతర విక్రయదారులు, రంగాలు:
ఈ సంస్థలతో పాటు భారతదేశంలోని ప్రభుత్వ రంగ భీమా దిగ్గజాలు - జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC Re), ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ వద్ద ఉన్న నిల్వ వాటాలను విక్రయించనున్నాయి. అంతేకాకుండా, పలువురు వ్యక్తిగత, చిన్న తరహా హెచ్ఎన్ఐ (HNI) వాటాదారులు కూడా ఈ ఓఎఫ్ఎస్లో భాగస్వాములవుతున్నారు. కాగా ఎన్ఎస్ఈలో 10.7 శాతం అతిపెద్ద వాటా కలిగిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) మాత్రం తన షేర్లను విక్రయించడం లేదని స్పష్టం చేసింది.
ఈ లిస్టింగ్ కేవలం ఒక కంపెనీ షేర్ల అమ్మకం మాత్రమే కాకుండా, భారతీయ మూలధన మార్కెట్లకు (Capital Markets) ఒక అత్యంత కీలకమైన పరిణామంగా నిలవనుంది. దేశంలోనే అత్యధిక ట్రేడింగ్ వాల్యూమ్స్ కలిగిన అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యాపారంలో సాధారణ రిటైల్, ఇన్సిస్టట్యూషనల్ ఇన్వెస్టర్లకు నేరుగా భాగస్వామ్యం లభించడమే కాకుండా, పబ్లిక్ మార్కెట్ వేదిక ద్వారా విదేశీ మరియు స్వదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు నిష్క్రమణ (Exit Opportunity) సదుపాయం లభిస్తుంది.
సెబీ నిబంధనల ప్రకారం ఏ స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా తన సొంత వేదికపైనే షేర్లను లిస్ట్ చేసుకోకూడదు (Self-Listing Restriction). ఈ నిబంధన కారణంగా, ఎన్ఎస్ఈ షేర్లు దాని ప్రత్యర్థి వేదిక అయిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లో మాత్రమే ట్రేడింగ్ కోసం అందుబాటులోకి వస్తాయి. గతంలో ఉన్న నిబంధనల వివాదాలు, కో-లోకేషన్ కేసు సమస్యలు పరిష్కారమై, సెబీ క్లియరెన్స్ రావడంతో రిటైల్, హెచ్ఎన్ఐ (HNI) ఇన్వెస్టర్లు ఈ మెగా ఐపీఓలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

