NSE IPO: భారతదేశపు అతిపెద్ద ఈక్విటీ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న చట్టపరమైన పోరాటం ఒక ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. సెబీ ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి ప్యానెల్, ఎన్ఎస్ఈపై ఉన్న పెండింగ్ వివాదాలను పరిష్కరించుకోవడానికి (సెటిల్మెంట్) సుమారు రూ. 1,800 కోట్లకు పైగా ($192.5 మిలియన్లు) చెల్లించాలని సిఫార్సు చేసింది.
గతంలో ఎన్ఎస్ఈ పాలనలో జరిగిన లోపాలు, ముఖ్యంగా ట్రేడింగ్ సభ్యులందరికీ సమాన ప్రాప్యత కల్పించడంలో వైఫల్యం (కో-లొకేషన్ వివాదం) వంటి అంశాల కారణంగా ఈ వివాదం తలెత్తింది. ఈ సమస్యల వల్లే ఎన్ఎస్ఈ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) దాదాపు పదేళ్ల పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఈ తాజా సిఫార్సు అమలులోకి వస్తే, ఎన్ఎస్ఈ ఐపీఓ మార్గం సుగమం కావడమే కాకుండా, మార్కెట్ రెగ్యులేటర్తో ఉన్న విభేదాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ కేసులను పరిష్కరించుకోవడానికి ఎన్ఎస్ఈ గతంలో రూ. 1,300 కోట్లను కేటాయించగా, ప్యానెల్ మాత్రం అంతకంటే ఎక్కువగా రూ. 1,800 కోట్లు చెల్లించాలని సూచించింది. పక్షం రోజుల క్రితం ఎన్ఎస్ఈ పంపిన సెటిల్మెంట్ ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత ప్యానెల్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను అధికారికంగా ఖరారు చేసే ముందు, సెబీ ఒక డిమాండ్ లేఖను జారీ చేసే అవకాశం ఉంది.
దీనిపై అటు సెబీ గానీ, ఇటు ఎన్ఎస్ఈ ప్రతినిధులు గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, మార్కెట్ వర్గాల్లో మాత్రం ఇది హాట్ టాపిక్గా మారింది. ఈ భారీ మొత్తం చెల్లింపు ద్వారా ఎన్ఎస్ఈ తనపై ఉన్న పాత మరకలను తుడిచేసుకుని, ఒక పారదర్శకమైన సంస్థగా ఐపీఓ వైపు అడుగులు వేయాలని భావిస్తోంది. మరోవైపు ఐపీఓ దిశగా ఎన్ఎస్ఈ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఐపీఓ కోసం ఏకంగా 20 బ్యాంకులని మర్చంట్ బ్యాంకర్లుగా నియమించుకోవడం ఎన్ఎస్ఈ ప్రాముఖ్యతను చాటిచెబుతోంది.
ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద అన్లిస్టెడ్ కంపెనీగా ఉన్న ఎన్ఎస్ఈలో దాదాపు 1,90,000 మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఈ బ్యాంకర్లు ఇప్పటికే ప్రస్తుత వాటాదారులకు లేఖలు పంపుతూ, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా తమ వాటాలను విక్రయించడానికి ఆసక్తి ఉందో లేదో తెలియజేయాలని కోరారు. ఇందుకు ఏప్రిల్ 27ను గడువుగా నిర్ణయించారు. ఒకవేళ ఈ సెటిల్మెంట్ ప్రక్రియ సజావుగా సాగితే, మే నెలాఖరు నాటికి ఎన్ఎస్ఈ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన వెంటనే ఐపీఓ కోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను (DRHP) దాఖలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది జరిగితే, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక భారీ, అత్యంత ఆసక్తికరమైన ఐపీఓగా నిలిచిపోనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
