ఇన్వెస్టర్లు మనీతో రెడీగా ఉండండి.. ఐపీఓ మార్కెట్ రికార్డును బద్దలు కొట్టబోతున్న ఎన్ఎస్ఈ..
NSE IPO 2026: దేశీయ మూలధన మార్కెట్లలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత భారీ పబ్లిక్ ఇష్యూకు సమయం ఆసన్నమైంది. భారతీయ షేర్ మార్కెట్ రంగానికి హార్ట్ లాంటి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ).. దాదాపు దశాబ్ద కాలపు వేచివేత తర్వాత తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను సెప్టెంబర్ 2026 మధ్య నాటికి మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది. రూ. 31,500 కోట్లు ($3.8 బిలియన్లు) సమీకరించాలనే లక్ష్యంతో రూపొందుతున్న ఈ ఐపీఓ.. ఇప్పటివరకు భారత పబ్లిక్ మార్కెట్ చరిత్రలో అత్యంత భారీ ఇష్యూగా నిలిచిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (రూ. 27,870 కోట్లు) రికార్డును తిరగరాయనుంది.
ఐపీఓ ముఖ్యాంశాలు, స్వరూపం
మొత్తం ఇష్యూ పరిమాణం: సుమారు రూ. 31,500 కోట్లు.
విక్రయించే వాటా: ఎన్ఎస్ఈ తన ఈక్విటీ నుంచి 6% వాటాను (14,89,05,525 షేర్లు) విక్రయించనుంది.
ఇష్యూ పద్ధతి: ఇది 100% 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) రూట్లో జరుగుతుంది. అంటే, ఎన్ఎస్ఈ సంస్థకు కొత్తగా ఎలాంటి నిధులు వెళ్లవు. సంస్థలో ఇప్పటికే ఉన్న వాటాదారులు (LIC, SBI, ఇతర దిగ్గజ ఇన్వెస్టర్లు) మాత్రమే తమ షేర్లను విక్రయించి నిధులను సమీకరించుకుంటారు.
అంచనా విలువ (Valuation): ఈ ఐపీఓ ద్వారా ఎన్ఎస్ఈ మార్కెట్ విలువను సుమారు 55 బిలియన్ డాలర్లు (రూ. 5.26 లక్షల కోట్లు)గా లెక్కగట్టారు.
కమిటీ & బ్యాంకర్లు: కోటక్ మహీంద్రా, జేఎమ్ ఫైనాన్షియల్, మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్లతో సహా ఏకంగా 20 ప్రసిద్ధ మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు ఈ ఐపీఓ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నాయి.

సెప్టెంబర్ టార్గెట్ వివరాలు: గత జూన్ 17, 2026న ఎన్ఎస్ఈ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి (SEBI) తన ముసాయిదా పత్రాలను (DRHP) సమర్పించింది. ఆ తర్వాత అంతర్జాతీయంగా లండన్, న్యూయార్క్, సింగపూర్, హాంగ్కాంగ్ వంటి ప్రముఖ ఫైనాన్షియల్ హబ్లలో గ్లోబల్ ఇన్వెస్టర్లతో సుదీర్ఘ రోడ్షోలు నిర్వహించింది. బ్లాక్రాక్, జీక్యూజీ పార్ట్నర్స్, జానస్ హెండర్సన్ వంటి 120కి పైగా ప్రముఖ గ్లోబల్ ఫండ్ మేనేజర్లు ఈ ఇష్యూ పట్ల తీవ్ర ఆసక్తి కనబరిచారు.సెబీ నుంచి త్వరలోనే తుది నిరభ్యంతర పత్రం (Observation Letter) రానుండటంతో, ఎన్ఎస్ఈ సెప్టెంబర్ 15 నాటికి ఐపీఓను ప్రారంభించి, సెప్టెంబర్ 25 నాటికి స్టాక్ ఎక్స్ఛేంజీలలో షేర్ల లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దశాబ్ద కాలపు చట్టపరమైన అడ్డంకులకు తెర: ఎన్ఎస్ఈ ఐపీఓ ప్రతిపాదన ఈనాటిది కాదు. 2016లోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలని భావించినప్పటికీ.. ఎన్ఎస్ఈలో చోటుచేసుకున్న కో-లొకేషన్ కేలక్యులేషన్స్ వివాదం, అల్గో-ట్రేడింగ్ అవకతవకలు వంటి అంశాలపై సెబీ సుదీర్ఘ విచారణ జరిపింది. దీంతో ఐపీఓ ప్రక్రియ ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే 2026 ప్రారంభంలో సెబీతో సంబంధిత వివాదాలు రూ. 1,300 కోట్ల సెటిల్మెంట్ నిధులతో ముగియడంతో పాటు, ఢిల్లీ హైకోర్టు కూడా ఐపీఓను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. దీంతో జనవరి 30, 2026న సెబీ ఐపీఓ సన్నాహాలకు క్లియరెన్స్ ఇవ్వడం ద్వారా దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడింది.
ఆర్థిక బలం, మార్కెట్ ప్రభావితం: ఆర్థికంగా ఎన్ఎస్ఈ అత్యంత బలమైన స్థితిలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం (FY26) లో ఎన్ఎస్ఈ ఏకంగా ₹18,713 కోట్ల ఆదాయాన్ని, ₹10,302 కోట్ల నికర లాభాన్ని సాధించి, 51% ప్రాఫిట్ మార్జిన్ను నమోదు చేసింది. తన వాటాదారులకు ప్రతి షేరుపై ₹35 చొప్పున భారీ డివిడెండ్ను కూడా ప్రకటించింది. ఈ ఐపీఓ పూర్తయి, 55 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధిస్తే-అమెరికాకు చెందిన 'నాస్డాక్' (Nasdaq) ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్ ఆపరేటర్గా ఎన్ఎస్ఈ నిలుస్తుంది. ఇది కేవలం ఎన్ఎస్ఈకి మాత్రమే కాకుండా, మొత్తం భారతీయ ఈక్విటీ మార్కెట్లకు, దేశీయ మూలధన వ్యవస్థకు అంతర్జాతీయ స్థాయిలో ఒక మైలురాయిగా నిలవనుంది. రిటైల్ పెట్టుబడిదారులు, హెచ్ఎన్ఐలు (HNI) సెప్టెంబర్ మధ్యలో రాబోయే ఈ మెగా పబ్లిక్ ఆఫరింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications
