మణప్పురం vs ముత్తూట్.. వీటి మధ్య ఏం జరుగుతోంది?
దేశంలో గోల్డ్ లోన్ బిజినెస్ ఈ మధ్య కాలంలో బాగా ఊపందుకుంది. గత కొన్నేళ్లుగా ఈ తరహా లోన్స్ మీద వచ్చే ఆదాయం ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న గోల్డ్ లోన్స్లో నాన్ బ్యాంకింగ్ కంపెనీల(NBFC) వాటా దాదాపు 55 నుంచి 60 శాతంగా ఉంది. వీటిలో ముత్తూట్, మణప్పురం కంపెనీలు టాప్ ప్లేయర్స్ గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండింటిలో ఒక కంపెనీ మరో కంపెనీని దాటేస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు ఈ రెండు కంపెనీల పెర్ఫామెన్స్ ఎలా మారుతుందో ఓసారి గమనిద్దాం.

దేశంలో బంగారు రుణాల వాల్యూ మొత్తం గతేడాది 1.47 లక్షల కోట్లుగా ఉంటే అది ఈ ఏడాది సెప్టెంబర్ 19 నాటికి 3.16 లక్షల కోట్లకు చేరుకుంది. బంగారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా లోన్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే వీటిలో ముఖ్యమైన కంపెనీలుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ మధ్య భారీ తేడా కనిపిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ముత్తూట్ ఫైనాన్స్ దాని ఫలితాలను ప్రకటించింది. ముత్తూట్ షేర్ వాల్యూ 9.9% పెరిగి రూ.3,726.9కి చేరుకుంటే.. మణప్పురం ఫైనాన్స్ షేర్ వాల్యూ 2.8% పెరిగి రూ.281.4కి చేరుకుంది.
ముత్తూట్ ఫైనాన్స్ v/s మణప్పురం ఫైనాన్స్
దేశంలో అతిపెద్ద గోల్డ్ లోన్ ఫైనాన్షియర్ అయిన ముత్తూట్ ఫైనాన్స్ 2026 రెండవ త్రైమాసికంలో సగటు లోన్స్ పై 19.99 శాతం ఆదాయాన్ని ఆర్జించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కాస్త ఎక్కువ. గతేడాది లోన్స్ పై పొందిన ఆదాయం 18.65 శాతంగా ఉండేది. అలాగే దాని నికర వడ్డీ ఆదాయం కూడా విస్తృతంగా పెరిగింది. సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో 11.2%గా ఉన్న వడ్డీ ఆదాయం అంతకుముందు సంవత్సరం 9.6%గా ఉండేది.
ఇక మణప్పురం ఫైనాన్స్ విషయానికొస్తే.. ఇక్కడ సీన్ రివర్స్లో ఉంది. సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో మణప్పురం నికర దిగుబడి 19.7% గా ఉంటే.. అంతకుముందు సంవత్సరం 22% గా ఉంది. అంటే నికర దిగుబడి క్రమంగా తగ్గుతూ వస్తోంది.
మిడిల్ ప్లేయర్
ఇకపోతే గోల్డ్ లోన్స్లో మిడిల్ ప్లేయర్గా అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC ఉంది. ఈ బ్యాంకుకి సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో.. వడ్డీ ద్వారా ఆర్జించే ఆస్తుల నికర ఆదాయం 3.4 శాతంగా ఉండగా ఇది అంతకు ముందు సంవత్సరం 3.7 శాతంగా ఉంది. అయితే 2025 జూన్ ప్రారంభంలో జరిగిన సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ రెపో రేట్లను తగ్గించడంతో బ్యాంకు రుణాలు / క్రెడిట్ సౌకర్యాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. ఫలితంగా బ్యాంకులకు వచ్చే నికర వడ్డీ ఆదాయంపై కొంత ఎఫెక్ట్ పడింది. దీంతో నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ సంస్థల బిజినెస్ కొంతమేర ఊపందుకుంది.
మొత్తం విలువ
ఒక్క 2026 మొదటి త్రైమాసికంలోనే ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఆస్తులు 45 శాతం పెరిగి రూ.1.24 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలా ముత్తూట్ ఈ బిజినెస్ లో టాప్ లో దూసుకెళ్తోంది. మరోపక్క మణప్పురం ఫైనాన్స్ విషయంలో దాని బంగారు రుణాల మొత్తం విలువ రూ. 30,236 కోట్లుగా ఉంది. అంటే మణప్పురంతో పోలిస్తే ముత్తూట్ వాల్యూ సుమారు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.
లాభాలు.. నష్టాలు..
ఇక గోల్డ్ లోన్స్ లో మరో ముఖ్యమైన విషయం అయిన స్టేజ్ 3 లోన్స్ లో కూడా ముత్తూట్ మెరుగైన పర్ఫామెన్స్ చూపిస్తుంది. స్టేజ్ 3 లోన్ అంటే 90 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు నిరర్థకంగా లేదా గడువు ముగిసిన లోన్స్. ఈ తరహా లోన్స్ వల్ల కంపెనీలకు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఈ తరహా నష్టాలను ముత్తూట్ తగ్గించుకుంటోంది. సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో ముత్తూట్లో స్టేజ్ 3 లోన్స్1.86%గా ఉంటే అంతకుముందు సంవత్సరం 3.68%గా ఉన్నాయి. అంటే నాన్ పెర్ఫార్మింగ్ లోన్స్ను తగ్గిస్తూ వస్తోంది ముత్తూట్. ఈ అన్ని ఫ్యాక్టర్స్తో పాటు బంగారు రుణాలకు బలమైన డిమాండ్ పెరుగుతున్న కారణంగా ముత్తూట్ ఫైనాన్స్ యొక్క నికర లాభం సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో దాదాపు 87.5% పెరిగి రూ.2,345 కోట్లకు చేరుకుంది. అయితే దీనికి విరుద్ధంగా మణప్పురం ఫైనాన్స్ నికర లాభం సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో 2.6%గా , అంతకుముందు సంవత్సరం 2.1%గా ఉంది. ఒకేరకమైన డిమాండ్ ఉన్న ఇండస్ట్రీలు రెండు వేర్వేరు ప్లేయర్స్ ఇలా వేర్వేరు పెర్ఫామెన్స్ చూపించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.
క్షీణిస్తున్న మణప్పురం
మణప్పురం ఫైనాన్స్ మార్కెట్ విలువ రోజురోజుకీ తగ్గుతూపోతోంది. అలాగే 2026 రెండవ త్రైమాసికంలో మణప్పురం ఫైనాన్స్ క్షీణిస్తున్న ఆస్తుల విలువ రూ.120 కోట్లుగా ఉంటే.. ఇది అంతకు ముందు సంవత్సరం రూ.53.2 కోట్లుగా ఉంది. అదనంగా ఈ కంపెనీ ఎక్కువ ఆపరేషనల్ ఖర్చులను ఎదుర్కుంటోంది. ఫలితంగా లాభాల్లో తగ్గుదలను చూస్తూ వస్తోంది. సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం దాదాపు 20 శాతం తగ్గి రూ.375.9 కోట్లకు చేరుకుంది.
బంగారం సెంటిమెంట్
భారతీయ కుటుంబాల్లో దాదాపు 25,000 నుంచి 27,000 టన్నుల బంగారం ఆభరణాల రూపంలో నిల్వ ఉన్నట్టు ఒక అంచనా. బంగారం అనేది భారతీయ కుటుంబాలకు సాంప్రదాయ పొదుపు మార్గంగా ఉంది. మరోపక్క ఉపాధి అవకాశాలు తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. వ్యాపారాలు, వివాహాలు లేదా కుటుంబ అత్యవసర పరిస్థితులను తీర్చడానికి బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తోంది. దీని ఫలితంగా గోల్డ్ లోన్ సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముత్తూట్ దూకుడు ప్రదర్శిస్తుంటే మణప్పురం కాస్తే వెనుక పడినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications


