స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీకి అవకాశం.. సెన్సెక్స్ లక్ష దిశగా పయనిస్తుందంటున్న మోర్గాన్ స్టాన్లీ..
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley), భారతీయ ఈక్విటీ మార్కెట్పై తన తాజా విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన అంచనాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా దేశీయ స్టాక్ మార్కెట్ దాదాపు సున్నా రాబడులను (Zero Returns) ఇచ్చినప్పటికీ.. అలాగే విదేశీ పెట్టుబడిదారులు దలాల్ స్ట్రీట్ నుండి భారీగా నగదును ఉపసంహరించుకుంటున్నప్పటికీ, భారతదేశపు మెరుగుపడుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఆదాయాల చక్రం మార్కెట్కు గట్టి మద్దతునిస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో.. రాబోయే 12 నెలల్లోనే సెన్సెక్స్ (Sensex) చారిత్రాత్మక 1 లక్ష మార్కును చేరుకోవడానికి 25 శాతం సంభావ్యత (Probability) ఉందని మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ అంచనా వేశారు.
లక్ష స్థాయి అనేది ఒక ఉత్తేజకరమైన సానుకూల ఫలితంగా కనిపిస్తున్నప్పటికీ.. మోర్గాన్ స్టాన్లీ తన ప్రాథమిక అంచనాను (Base Case) కొంత సంప్రదాయబద్ధంగానే ఉంచింది. దీని ప్రకారం, జూన్ 2027 నాటికి సెన్సెక్స్ లక్ష్యం 89 వేలుగా గా ఉండవచ్చని, ఈ స్థాయికి చేరుకోవడానికి 50 శాతం సంభావ్యత ఉందని పేర్కొంది. ఇది ప్రస్తుత స్థాయిల నుండి సుమారు 15 శాతం వృద్ధిని సూచిస్తుంది. భారతదేశం సాధిస్తున్న స్థూల ఆర్థిక స్థిరత్వం, ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదల, వాస్తవ ఆర్థిక వృద్ధికి, వాస్తవ వడ్డీ రేట్లకు మధ్య ఉన్న సానుకూల అంతరంపైనే ఈ బేస్ కేస్ వృద్ధి ఆధారపడి ఉంటుంది.

భారతదేశం యొక్క మధ్యకాలిక వృద్ధిపై ఉన్న నమ్మకం, తక్కువ రిస్క్ (Beta) లక్షణాలు, స్థిరమైన ప్రభుత్వ విధానాల వల్ల మార్కెట్ వాల్యుయేషన్ ప్రీమియం పొందుతుందని, దీనివల్ల సెన్సెక్స్ తన 25 ఏళ్ల సగటు పి/ఇ (P/E) మల్టిపుల్ అయిన 22 రెట్ల కంటే ఎక్కువగా, 23.5 రెట్ల వద్ద ట్రేడ్ అవుతుందని విశ్లేషించారు. రాబోయే ఐదేళ్లలో ఇంధనం, మైనింగ్, రక్షణ, సెమీకండక్టర్లు, డేటా సెంటర్ల రంగాలలో జరిగే భారీ మూలధన వ్యయం (Capex) మద్దతుతో, దేశ పెట్టుబడి-జీడీపీ నిష్పత్తి 37.5 శాతానికి పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. కార్పొరేట్ ఆదాయాల విషయానికి వస్తే.. బేస్ కేస్లో ఆర్థిక సంవత్సరం 2029 (FY29) వరకు సెన్సెక్స్ కంపెనీల ఆదాయాలు ఏటా 16 శాతం చొప్పున, బుల్ కేస్లో (Bull Case) ఏకంగా 19% వరకు పెరుగుతాయని నివేదిక స్పష్టం చేసింది.
వర్ధమాన మార్కెట్లతో (Emerging Markets) పోలిస్తే భారతీయ ఈక్విటీలు ఇటీవల కొంత బలహీనపడినప్పటికీ, భారతదేశపు విలువల తగ్గుదలను మోర్గాన్ స్టాన్లీ దీర్ఘకాలికమైనదిగా కాకుండా ఒక చక్రీయమైన (Cyclical) మార్పుగానే పరిగణిస్తోంది. దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు మరియు సేవల ఆధారిత ఎగుమతి నమూనాపై కృత్రిమ మేధస్సు (AI) చూపబోయే ప్రతికూల ప్రభావాల గురించిన ఆందోళనలు పూర్తిగా "అతిశయోక్తి" అని కొట్టిపారేసింది.
దానికి బదులుగా, తక్కువ స్థాయి నుండి కార్మిక ఉత్పాదకతను (Labor Productivity) పెంచడానికి ఏఐ ఒక గొప్ప మధ్యకాలిక అవకాశంగా మారుతుందని వాదించింది. ప్రస్తుతం మార్కెట్-క్యాప్-టు-జీడీపీ నిష్పత్తి, కాంపోజిట్ వాల్యుయేషన్ సూచికలు మార్కెట్లో వృద్ధికి ఇంకా భారీ ఆస్కారం ఉందని సూచిస్తున్నాయి. ప్రస్తుత ప్రైస్-టు-బుక్ (P/B) స్థాయిల వద్ద రాబోయే 10 సంవత్సరాల వార్షిక రాబడులు సుమారు 11.6 శాతంగా ఉంటాయని మోర్గాన్ స్టాన్లీ నమూనాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 2009 తర్వాత రికార్డు స్థాయిలో, ప్రపంచ సూచీలలో భారతదేశ వాటా వెయిటేజీ (Weightage) ఇప్పుడు అత్యధిక తేడాతో అధిగమించిందని వ్యూహకర్తలు పేర్కొన్నారు.
ఈ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో, మూలధన వ్యయం, వినియోగ చక్రాల నుండి నేరుగా లబ్ధి పొందే దేశీయ చక్రీయ రంగాల వైపు (Domestic Cyclicals) మొగ్గు చూపాలని మోర్గాన్ స్టాన్లీ తన పోర్ట్ఫోలియో వ్యూహంలో (Portfolio Strategy) సిఫార్సు చేసింది. ఈ సంస్థ ప్రస్తుతం ఫైనాన్షియల్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ మరియు ఇండస్ట్రియల్స్ రంగాలలో అధిక పెట్టుబడులను (Overweight) సూచిస్తుండగా, ఎనర్జీ, మెటీరియల్స్, యుటిలిటీస్, హెల్త్కేర్ రంగాలలో తక్కువ పెట్టుబడులను (Underweight) సిఫార్సు చేస్తోంది.
తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ పన్నులు, మెరుగైన మొత్తం ఆదాయ వృద్ధి సహాయంతో వినియోగం బలంగా పెరుగుతుందని ఆశిస్తూ కన్స్యూమర్ డిస్క్రిషనరీ రంగానికి +300 బేసిస్ పాయింట్ల ఓవర్వెయిట్ను కేటాయించింది. అదేవిధంగా ప్రైవేట్ క్యాపెక్స్ పుంజుకుంటుందనే అంచనాలతో ఇండస్ట్రియల్స్ రంగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు ఏఐ అప్లికేషన్ల కోసం భారతీయ కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నందున ఐటీ సేవలు (IT Services) మార్కెట్లో ఒక సంభావ్య డార్క్ హార్స్ గా మారవచ్చని నివేదిక పేర్కొంది.
దీంతో పాటుగా మార్కెట్లో రాబోయే ప్రతికూల పరిస్థితులను (Bear Case) కూడా మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. సెన్సెక్స్ 1 లక్ష మార్కును తాకే సంభావ్యత 25 శాతం గా ఉండగా.. ఈ సూచీ 66 వేల స్థాయికి పడిపోయే ప్రతికూల బేర్ కేస్కు కూడా సమానంగా 25 శాతం సంభావ్యతను కేటాయించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో తీవ్ర మందగమనం ఏర్పడి, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 డాలర్లకు పైగా పెరిగితే, దేశీయ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి ఆర్బీఐ (RBI) వడ్డీ రేట్లను కఠినతరం చేయాల్సి వస్తుందని, ఇది మార్కెట్ పతనానికి దారితీస్తుందని హెచ్చరించింది.
భారతదేశానికి ఉన్న ప్రధాన నష్టాలు చాలావరకు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటి బాహ్య కారకాలేనని, దేశీయంగా బలహీనమైన వ్యవసాయ ఉత్పాదకత, న్యాయవ్యవస్థలో సామర్థ్య లోపాలు వంటివి ఉన్నాయని పేర్కొంది. అయినప్పటికీ, దేశీయ రిటైల్ నిధుల ప్రవాహం బలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు ఇప్పటికే బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి కారణాల వల్ల రిస్క్-రివార్డ్ నిష్పత్తి భారతీయ ఈక్విటీలకే అనుకూలంగా ఉందని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
