గంటల వ్వవధిలోనే కుప్పకూలిన మైక్రోసాఫ్ట్ షేర్లు.. చరిత్రలోనే అతి పెద్ద పతనం.. కారణాలు ఏంటంటే..
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్స్ పతనం బుధవారం మార్కెట్లను భారీ షాక్కు గురి చేసింది. కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే దాదాపు 12 శాతం పతనమయ్యాయి. మార్చి 2020 (కోవిడ్ ప్రారంభం) తర్వాత అత్యంత చెత్త ట్రేడింగ్ డేను నమోదు చేశాయి. నిన్న ఒక్కరోజు పతనంతోనే మైక్రోసాఫ్ట్.. స్టాక్ మార్కెట్ విలువలో 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. నిన్న మధ్యాహ్నం 1:20 గంటల నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి సుమారు 424 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రెండవ అతిపెద్ద ఒకరోజు వాల్యుయేషన్ వైపౌట్ గా నిలిచింది.
ఇలాంటి మార్కెట్ నష్టం గతేడాది ఒక్కసారే జరిగింది. గత సంవత్సరం జనవరిలో డీప్సీక్ (DeepSeek) తక్కువ ధర AI మోడల్ను విడుదల చేసిన తర్వాత ఎన్విడియా (Nvidia) స్టాక్ ఒక్కరోజులోనే 593 బిలియన్ డాలర్లు నష్టపోయింది. అదే ఇప్పటివరకు అతిపెద్ద ఒకరోజు మార్కెట్ విలువ విధ్వంసం. ఇప్పుడు Microsoft దానికి తర్వాతి స్థానంలో నిలిచింది.

బ్లూమ్బెర్గ్ ప్రకారం Microsoft షేర్ ధరలో దాదాపు 12 శాతం పతనం కంపెనీ చరిత్రలోనే అత్యంత దారుణమైన వాటిలో ఒకటి. 1986లో పబ్లిక్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ కేవలం కొన్ని సందర్భాల్లోనే ఇంత పెద్ద పతనాన్ని చూసింది. 1987లోని బ్లాక్ మండే, 2000ల ప్రారంభంలో డాట్-కామ్ బుడగ పగిలిన సమయంలో, అలాగే 2020లో కోవిడ్-19 కారణమైన మార్కెట్ అమ్మకాల సమయంలో మాత్రమే ఇలాంటి భారీ నష్టాలు నమోదయ్యాయి.
ఈ పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటేంటంటే.. మైక్రోసాఫ్ట్ తన ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి (Q3) ఇచ్చిన ఆపరేటింగ్ మార్జిన్ మార్గదర్శకత్వం (guidance) పెట్టుబడిదారులను నిరాశపరచడం. అంతేకాకుండా కంపెనీ ఇటీవల చేపట్టిన భారీ ఖర్చుల ప్రణాళికలను సమర్థించడంలో ఇబ్బంది పడుతోందన్న భావన కూడా మార్కెట్లో బలపడింది. ముఖ్యంగా, మైక్రోసాఫ్ట్ యొక్క కీలకమైన అజూర్ (Azure) క్లౌడ్ విభాగంలో వృద్ధి మందగించడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది.
AI, కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులపై వాల్ స్ట్రీట్లో ఇప్పటికే తీవ్రమైన చర్చ జరుగుతోంది. గత ఏడాది కంపెనీలు భారీగా ఖర్చు చేసిన తర్వాత, ఇప్పుడు పెట్టుబడిదారులు ఆ పెట్టుబడుల నుంచి స్పష్టమైన లాభాలు (ROI) చూడాలని కోరుకుంటున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ ఫలితాలు ఈ విషయంలో ఆశించిన స్థాయిలో లేవన్న భావన ఏర్పడింది. కంపెనీ తాజా త్రైమాసికంలో మూలధన వ్యయాలు (Capex) 66 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 37.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఖర్చులు ప్రధానంగా క్లౌడ్, AI డిమాండ్ను మద్దతు ఇవ్వడానికి చేసినవేనని చెప్పవచ్చు.
అయితే ఇదే సమయంలో.. అజూర్ క్లౌడ్ యూనిట్ వృద్ధి గత త్రైమాసికంతో పోలిస్తే మందగించింది. ఎంటర్ప్రైజ్ AI డిమాండ్ను అంచనా వేయడానికి పెట్టుబడిదారులు ఈ విభాగాన్ని అత్యంత కీలకంగా చూస్తుండటంతో.. ఈ మందగమనం స్టాక్పై ఒత్తిడిని పెంచింది. మిల్లర్ టబాక్ + కోలో చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ మాథ్యూ మాలే మాట్లాడుతూ..మైక్రోసాఫ్ట్ భారీ AI పెట్టుబడుల నుంచి బలమైన లాభాలను అందుకోలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే స్టాక్ను దాని చారిత్రాత్మక సరసమైన విలువకు దగ్గరగా తిరిగి అంచనా వేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.
ఇంకొక కీలక అంశం ఏంటంటే.. కంప్యూట్ సామర్థ్య పరిమితులు. డిమాండ్ సరఫరాను మించిపోవడంతో, మైక్రోసాఫ్ట్ అవసరమైన కంప్యూటింగ్ పవర్ను వెంటనే అందించలేకపోతున్నట్లు కంపెనీ అంగీకరించింది. ఫైనాన్స్ చీఫ్ అమీ హుడ్ ఉద్యోగులకు రాసిన లేఖలో.. కొత్త GPU చిప్లన్నింటినీ అజూర్లోకి వెంటనే ప్రవేశపెట్టగలిగితే అజూర్ వృద్ధి 40 శాతం వరకు ఉండేదని తెలిపారు. అయినప్పటికీ, ఉత్పత్తి ఆవిష్కరణలు, GitHub Copilot, M365 Copilot వంటి సేవల వినియోగం పెరుగుతుండటంతో.. రాబోయే కాలంలో సరఫరా పెరిగి డిమాండ్ను తీరుస్తుందని ఆమె పేర్కొన్నారు.
దీనితో పాటు సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని OpenAIపై ఉన్న ఆందోళనలు కూడా మైక్రోసాఫ్ట్ పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి. CNBC ప్రకారం.. మైక్రోసాఫ్ట్ డిమాండ్ బ్యాక్లాగ్ 110 శాతం పెరిగి 625 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో OpenAIతో ఉన్న 250 బిలియన్ డాలర్ల క్లౌడ్ ఒప్పందం కూడా ఉంది. అయితే OpenAI తన ఆర్థిక బాధ్యతలను ఎంతవరకు నెరవేర్చగలదన్న అనుమానాలు సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసినట్లు విశ్లేషకులు అంటున్నారు.
క్లుప్తంగా చెప్పాలంటే AIపై భారీ పెట్టుబడులు, క్లౌడ్ వృద్ధిలో మందగమనం, మార్జిన్లపై ఒత్తిడి, OpenAI సంబంధిత ఆందోళనలు కలిసి.. మైక్రోసాఫ్ట్కు ఈ చారిత్రాత్మకంగా చెత్త విధ్వంసాన్ని తెచ్చినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications


