ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. రూ. 1700 కోట్లు టార్గెట్తో కొత్త IPO వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు ఇవే
దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆభరణాల రిటైలర్ దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ తన రూ. 1,700 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రణాళికను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాథమిక వాటా ఆఫర్ 2026 ఆగస్టు 17న సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమై.. ఆగస్టు 19న ముగుస్తుంది. రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణిని (Price Band) కంపెనీ రూ. 190 నుండి రూ. 201 వరకు నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం 74 షేర్లకు, ఆపై 74 షేర్ల గుణిజాలలో బిడ్లు దాఖలు చేయవచ్చు.
మొత్తం రూ. 1,700 కోట్ల ఐపీఓలో రూ. 1,200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ (Fresh Issue) ఉండగా.. కంపెనీ ప్రమోటర్ ఎం. కిరణ్ కుమార్ జైన్ ద్వారా రూ. 500 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంది. ఆఫర్ సమయానికి కంపెనీ వద్ద మొత్తం 49,99,77,156 ఈక్విటీ షేర్లు చెలామణిలో ఉన్నాయి. కంపెనీకి చెందిన ఆర్హెచ్పి (RHP) పత్రాలు ఇప్పటికే చెన్నైలోని ఆర్ఓసీ (RoC) వద్ద ఆగస్టు 9, 2026న దాఖలయ్యాయి.

ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో లలితా జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. కిరణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. మేము ఇప్పటికే ప్రధాన మెట్రో నగరాల్లో బలంగా స్థిరపడ్డాము. ఐపీఓ తర్వాత కూడా మా ప్రాధాన్యత టైర్-II, టైర్-III నగరాలపైనే ఉంటుంది. ఈ నగరాల్లో ఆభరణాలకు అత్యంత బలమైన డిమాండ్ ఉంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులతో రిటైల్ రంగాన్ని మరింత విస్తరిస్తూ కొత్తగా 10 షోరూమ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ప్రస్తుత తయారీ యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తుండటంతో.. కొత్త తయారీ కేంద్రాలపై తక్షణమే పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
క్రిసిల్ (CRISIL) నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వ్యవస్థీకృత ఆభరణాల రష్యా సంస్థలలో ఒక్కో స్టోర్కు అత్యధికంగా రూ. 410.23 కోట్ల నిర్వహణ రాబడిని నమోదు చేసి లలితా జ్యువెలరీ రికార్డు సృష్టించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788.05 కోట్లుగా ఉన్న కంపెనీ కార్యకలాపాల రాబడి 2026 ఆర్థిక సంవత్సరానికి రూ. 25,023.93 కోట్లకు పెరగ్గా.. నికర లాభం రూ. 359.83 కోట్ల నుండి రూ. 1,009.82 కోట్లకు భారీగా పుంజుకుంది.
ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలలోని 51 నగరాల్లో కంపెనీ 61 షోరూమ్లను (మొత్తం 6.5 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో) నిర్వహిస్తోంది. వీటిలో 45 స్టోర్లు టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉండటం విశేషం. చెన్నైలోని తిరుముడివాక్కం, కాంచీపురంలోని మరైమలైలలో కంపెనీకి సొంతంగా రెండు ఆధునిక ఆభరణాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. 'ధన వందనం', 'ఫ్రీ-యో-ఫ్లెక్సీ' వంటి ప్రత్యేక డిపాజిట్ పథకాలతో వినియోగదారులకు మరింత చేరువైంది.
ఈ ఐపీఓకు ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ లిమిటెడ్, ఈక్విరస్ క్యాపిటల్ లిమిటెడ్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, ఎంయూఎఫ్జీ ఇన్టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
