ఐపీఎల్ లాగా సినీ రంగంలో కూడా కొత్త టీంలు.. భారీగా పెట్టుబడులు పెడుతున్న ప్రాంఛైజీలు..
దాదాపు రూ. 22 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలోకి సరికొత్త రూపంలో మూలధనం ప్రవహిస్తోంది. ఇవి సాధారణ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు లేదా కేవలం గ్లామర్ చూసి పెట్టే పెట్టుబడులు కావు. స్టాక్ మార్కెట్ తరహాలోనే.. భారతీయ సినిమాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపే అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారులు (HNIలు), వివిధ ఆర్థిక సంస్థల నుండి నిధులను సేకరించి, వాటిని సినిమాల్లో మదుపు చేసే పక్కా ప్రొఫెషనల్ ఫండ్లు.
భారతీయ చిత్రాలను ఒక కొత్త ఆస్తి వర్గంగా (Asset Class) మార్చడం, అలాగే వాటిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్ల తరహాలో లాభదాయకమైన బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే ఈ ఫండ్ల ప్రధాన లక్ష్యం. ఇప్పటికే 'ఫిల్మొనీ గ్లోబల్', 'సినీనౌ' అనే రెండు అంతర్జాతీయ ఫండ్లు ఈ దిశగా భారత్లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. దుబాయ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న 'ఫిల్మానీ గ్లోబల్' సంస్థ త్వరలోనే 5 మిలియన్ పౌండ్ల పరిమాణంతో తన మొదటి ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని (SPV) తీసుకురానుంది.

ఈ సంస్థ ఏర్పాటు చేయబోయే 10 విభిన్న SPVలలో ప్రతి ఒక్కటి 5 నుండి 10 మిలియన్ పౌండ్లు లేదా డాలర్ల నిధుల పూల్ను కలిగి ఉంటుంది. ఇవి యువతను ఆకట్టుకునే చిత్రాలలోని నిర్దిష్ట శైలిపై (ఉదాహరణకు ఒక SPV కేవలం హారర్ చిత్రాలపై, మరొకటి రొమాంటిక్ చిత్రాలపై) దృష్టి పెడుతూ.. ఒక్కో సినిమాకు గరిష్టంగా 1 మిలియన్ పౌండ్లను పెట్టుబడిగా పెడతాయి. పెద్ద స్టార్స్ లేదా బడా దర్శకులు లేకపోయినా, అద్భుతమైన కాన్సెప్ట్ ఉండి థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలను ప్రోత్సహించడం ద్వారా నష్టాలను తగ్గించుకుంటూ రాబడులను గరిష్ఠ స్థాయికి చేర్చడమే తమ వ్యూహమని సంస్థ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ జైన్ తెలిపారు.
మరోవైపు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో రిజిస్టర్ అయిన '$1.5 మిలియన్ల' (దాదాపు రూ.1,350 కోట్లు) నిధుల భారీ ఫండ్ 'సినీనౌ' కూడా.. సినిమా మేధో సంపత్తిని (IP) ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా మార్చాలని యోచిస్తోంది. రాబోయే ఆరేళ్లలో రూ. 3 కోట్ల నుండి రూ. 300 కోట్ల (3 బిలియన్లు) వరకు బడ్జెట్ ఉన్న దాదాపు 30కి పైగా చిత్రాలలో పెట్టుబడి పెట్టడమే తమ లక్ష్యమని సినీనౌ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ దాల్మియా ప్రకటించారు.
తాము కేవలం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 100 శాతం నిధులను సమకూరుస్తామని, అసలు పెట్టుబడి , అంగీకరించిన లాభాలు తిరిగి వచ్చేవరకు సినిమా హక్కులు తమ వద్దే ఉంటాయని, అయితే సృజనాత్మక విషయాలలో (Creative Control) తాము జోక్యం చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిధిని బ్లాక్చెయిన్పై డిజిటల్ టోకెన్లుగా విభజించి, ఆరేళ్ల పెట్టుబడి కాలంలో ఇన్వెస్టర్లకు 17 నుండి 22 శాతం వార్షిక రాబడిని అందించాలని సినీనౌ లక్ష్యంగా పెట్టుకుంది.
భారతీయ చిత్ర పరిశ్రమ సృజనాత్మకంగా ఎంతో బలంగా ఉన్నప్పటికీ, అవసరమైన మూలధనం అందుబాటులో లేకపోవడం పెద్ద మైనస్ అని అబండెంటియా ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుడు, సీఈఓ విక్రమ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. నిర్మాతలు సాధారణంగా స్ట్రీమింగ్ (OTT) లేదా టెలివిజన్ కంపెనీలపై ఆధారపడతారని, కానీ ఫైనాన్సింగ్ చేయడం వారి పని కాదని ఆయన అన్నారు. కేవలం బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లు వసూలు చేసిన ప్రతి సినిమా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టకపోవచ్చని (భారీ నిర్మాణ వ్యయం వల్ల), అదే సమయంలో రూ.5 కోట్ల బడ్జెట్ సినిమా రూ. 20 కోట్లు సాధిస్తే అద్భుతమైన లాభాలను అందిస్తుందని, అందుకే తాము కేవలం హిట్-ఆధారిత విధానం కాకుండా స్థిరమైన వ్యాపార నమూనాను నమ్ముతామని ఆయన వివరించారు.
1950లలో పాత ఫైనాన్సింగ్ వ్యవస్థ కుప్పకూలినప్పటి నుండి, 1980లలో అండర్వరల్డ్ డబ్బు ప్రవేశించడం, ఆపై 2000లో పరిశ్రమ హోదా లభించి ఐపీఓలు, విదేశీ స్టూడియోల (ఫాక్స్, డిస్నీ) పెట్టుబడులు రావడం వరకు భారతీయ సినిమా ఫండింగ్ అనేక మార్పులను చూసింది. గడిచిన రెండేళ్లలో మళ్లీ పరిస్థితులు మెరుగుపడి సినిమా నిర్మాణం కోసం రూ. 3 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించే ఒప్పందాలు జరిగాయి.
ఇందులో ధర్మ ప్రొడక్షన్స్లో ఆదర్ పూనావాలా పెట్టిన రూ. 1,000 కోట్ల పెట్టుబడి, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్లో యూనివర్సల్ మ్యూజిక్ పెట్టిన రూ. 720 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. హాలీవుడ్లో ఎస్పివిల ద్వారా ఆర్థిక పెట్టుబడులు పెట్టడం సర్వసాధారణం కాగా, ప్రస్తుతం బాలీవుడ్ భారతీయ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలలోకి ప్రవేశిస్తున్న ఈ సరికొత్త కార్పొరేట్ నిధులు పరిశ్రమను మరింత వ్యవస్థీకృతంగా మార్చనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
