రూ. 1 లక్ష పెట్టుబడి 5 నిమిషాల్లో రూ.44 లక్షలా.. Sensex వైల్డ్ స్వింగ్ వెనుక అసలు కథ ఏంటి..
నెలవారీ డెరివేటివ్స్ గడువు ముగిసే రోజున (F&O Expiry) బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) ముగింపు సమయంలో చోటుచేసుకున్న ఆకస్మిక, నాటకీయ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) సమయంలో సెన్సెక్స్ సూచీ కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల పాయింట్ల తీవ్ర హెచ్చుతగ్గులకు గురికావడం.. దానికి తోడు అదే సమయంలో రూ.1 లక్ష పెట్టుబడితో ఐదు నిమిషాల్లో రూ.44 లక్షలు ఆర్జించవచ్చనే ఒక ఊహాజనిత ట్రేడ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
గురువారం ముగింపు సెషన్లో మధ్యాహ్నం 3:17 గంటల సమయంలో సెన్సెక్స్ 77,200 పాయింట్ల వద్ద కొనసాగింది. అయితే తదుపరి ఆరు నిమిషాల్లోనే (మధ్యాహ్నం 3:23 గంటల సమయానికి) నిలువునా 2,200 పాయింట్లకు పైగా కుప్పకూలి 74,983 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఆశ్చర్యకరంగా తదుపరి ఏడు నిమిషాల్లోనే (3:30 గంటల కల్లా) మళ్లీ దాదాపు 2,000 పాయింట్లు వేగంగా కోలుకుని, చివరకు బుధవారం నాటి ముగింపు కంటే 539 పాయింట్లు తగ్గి 76,934 వద్ద స్థిరపడింది. కేవలం పది నిమిషాల వ్యవధిలో సూచీలో చోటుచేసుకున్న ఈ అసాధారణ కదలికలు నిపుణులను సైతం విస్మయానికి గురిచేసాయి.

ఈ తీవ్ర పతనాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఒక మార్కెట్ భాగస్వామి 'X' (ట్విట్టర్) వేదికగా ఆసక్తికరమైన గణాంకాన్ని విశ్లేషించారు. మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో రూ.1 లక్ష విలువైన సెన్సెక్స్ 76,500 'పుట్ ఆప్షన్లను' కొనుగోలు చేసి.. మార్కెట్ అత్యంత తక్కువ స్థాయికి చేరిన 3:20 గంటల సమయంలో వాటిని విక్రయించి ఉంటే ఆ పొజిషన్ సుమారు రూ.44 లక్షల భారీ లాభాన్ని తెచ్చిపెట్టి ఉండేదని వివరించారు (సదరు పోస్ట్లో మధ్యాహ్నానికి బదులుగా ఉదయం అని అక్షరదోషం దొర్లింది). అయితే ఇది కేవలం సూచీ కదలికల ఆధారంగా వేసిన ఊహాజనితమైన లెక్క మాత్రమేనని.. నిజమైన ట్రేడర్ ఎవరూ అటువంటి విపరీతమైన లాభాన్ని సాధించలేదని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేశారు.
ఈ ఆకస్మిక కదలిక కేవలం సూచీకే పరిమితం కాలేదు. సెన్సెక్స్లో కీలక వెయిటేజ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కొన్ని నిమిషాల్లోనే రూ.1,289 నుండి రూ.1,250కి క్షీణించి.. ఆపై వేగంగా పుంజుకుని రూ.1,286 వద్ద ముగిసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటిసి, భారతి ఎయిర్టెల్ వంటి ఇతర బ్లూచిప్ స్టాక్స్లోనూ ఇలాంటి తీవ్రమైన వ్యత్యాసాలు నమోదయ్యాయి.
మార్కెట్లో ధరల తారుమారు (Price Manipulation) సంభవించకుండా వాస్తవిక ముగింపు ధరలను నిర్ణయించే ఉద్దేశంతో ఆగస్టు 3న బీఎస్ఈ ప్రవేశపెట్టిన 'క్లోజింగ్ ఆక్షన్ సెషన్' (CAS) విధానంపైనే ఈ ఘటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 200 ప్రముఖ డెరివేటివ్ స్టాక్స్ పరిధిలోకి వచ్చే ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి మధ్యాహ్నం 3:15 నుండి 3:30 గంటల మధ్య నిఫ్టీ, సెన్సెక్స్లలో ఇలాంటి అసాధారణ అస్థిరత కనిపిస్తోందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకోవడానికి మరో ప్రధాన కారణం సెబీ తీసుకున్న కఠిన చర్యలే. సెన్సెక్స్, దాని అనుబంధ షేర్లలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై జేపీ మోర్గాన్ అనుబంధ సంస్థ 'కాప్థాల్ మారిషస్', 'మాన్సీ స్టాక్ బ్రోకింగ్'లపై సెబీ ఇటీవలే ట్రేడింగ్ నిషేధం విధిస్తూ.. అక్రమంగా ఆర్జించిన రూ. 3.8 కోట్ల లాభాలను జప్తు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో క్లోజింగ్ ఆక్షన్ సెషన్లో జరిగిన తాజా ఉదంతంపై నియంత్రణ సంస్థల దృష్టి మరలే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
