ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్.. 25 వేల మందిని కొత్తగా తీసుకుంటామని కీలక ప్రకటన..
ఐటీ రంగం ప్రస్తుతం అనేక ఒడి దుడుకులను ఎదుర్కుంటోంది. గత రెండేళ్ల నుంచి కంపెనీలు కాస్ట్ కటింగ్ ప్లాన్ చేస్తూనే ఉన్నాయి. ఉద్యోగులు జాబ్ ఎప్పుడు ఊడుతుందో తెలియక టెన్సన్ వాతావరణం మధ్య బతుకుతున్నారు. చాలామంది అయితే ఉద్యోగం కోల్పోయి రోడ్డు మీదకు కూడా వచ్చారు. ఇక ఏఐ రాకతో టెక్ స్వరూపమే మారిపోయింది. మధ్య స్థాయి ఉద్యోగులను ఏఐ వణికిస్తోంది. వారు చేసే పని అది చేస్తుండటంతో చాలామంది ఉద్యోగులను కంపెనీలు తీసేస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఐటీ రంగంలో ఇటీవల నెలకొన్న ఉద్యోగాల కోతలు.. నియామకాల మందగమనం కారణంగా నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళన నెలకొంది.
అనేక పెద్ద ఐటీ సంస్థలు ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టడంతో.. కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయన్న భావన బలపడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) తీసుకున్న తాజా నిర్ణయం యువతకు ఊరటనిస్తోంది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. ఇది గత ఏడాది చేపట్టిన 20 వేల నియామకాలతో పోలిస్తే దాదాపు 20 శాతం అధికం కావడం విశేషం.

ముఖ్యంగా క్యాంపస్ రిక్రూట్మెంట్పై మరింత దృష్టి సారిస్తూ, యువ ప్రతిభను పెద్ద సంఖ్యలో సంస్థలోకి తీసుకురావాలనే వ్యూహాన్ని కంపెనీ అమలు చేయబోతోంది. ఈ నిర్ణయం వెనుక సంస్థకు ఉన్న దీర్ఘకాలిక ఆలోచన ఎంతో కీలకం అని చెప్పవచ్చు. సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయన్న వాదనలు వినిపిస్తుంటాయి. అయితే కాగ్నిజెంట్ మాత్రం దీనిని భిన్నంగా చూస్తోంది. ఏఐను మానవ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా వినియోగిస్తున్నామని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని సంస్థ సీఈఓ రవి కుమార్ కూడా వెల్లడించారు. జెమిని, ఓపెన్ ఏఐ వంటి ప్రముఖ ఏఐ ప్లాట్ఫారమ్లతో కలిసి పనిచేస్తూ, ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు ఏఐ ఆధారిత టూల్స్ను అందిస్తున్నామని తెలిపారు. ఈ టూల్స్ వల్ల కొత్తగా చేరిన ఇంజనీర్లు గతంతో పోలిస్తే చాలా తక్కువ సమయంలోనే క్లయింట్ ప్రాజెక్టుల్లో చురుకుగా పాల్గొంటున్నారని ఆయన వివరించారు. అదే కారణంగా ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించకుండా, మరింత పెంచుతున్నామని కంపెనీ స్పష్టంగా పేర్కొంది.
ఆర్థిక ఫలితాల పరంగా కూడా కాగ్నిజెంట్ బలమైన ప్రదర్శననే ఇచ్చింది. 2025 డిసెంబరుతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 18.7 శాతం పెరిగి 64.8 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది సంస్థ వ్యాపార స్థిరత్వాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఉద్యోగుల సంఖ్య పరంగానూ వృద్ధి కనిపించింది. సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్ నాటికి సుమారు 1,800 మంది ఉద్యోగులు పెరిగి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.51 లక్షలకు చేరుకుంది.
భవిష్యత్తు లక్ష్యాల విషయానికి వస్తే.. కాగ్నిజెంట్ కేవలం మానవ వనరులపై మాత్రమే కాకుండా, డిజిటల్ లేబర్ను కూడా వినియోగిస్తూ ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ వ్యూహంతో 2026లో 2,266 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. కంపెనీ.. ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయన్న భయాల మధ్య, పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించేందుకు ముందుకు రావడం వల్ల ఐటీ రంగంలో మళ్లీ ఉత్సాహం పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications


