ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎస్సెమ్మెస్ నిబంధనలు తప్పనిసరి
భారీ మొత్తం సంక్షిప్త సందేశాలు (బల్క్ ఎస్సెమ్మెస్లు) పంపే సంస్థలు కొత్త నిబంధనలు పాటించకపోతే మార్చి 31వ తేదీ తర్వాత కస్టమర్లకు సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చునని ప్రభుత్వ, వాణిజ్య సంస్థలకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ సేవలకు సాంకేతిక సాయం అందించే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), సిడాక్, సాఫ్టువేర్ సంస్థల సంఘం నాస్కామ్, పరిశ్రమ, వాణిజ్య సంఘాలు ఫిక్కీ, అసోచామ్, టెలికం నెట్ వర్క్ సంస్థల సంఘం కోయ్లకు లేఖలు రాసింది. వాణిజ్య సందేశాలు పంపేందుకు అమలు చేయాల్సిన నిబంధనలు గుర్తు చేసింది.
ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎస్సెమ్మెస్ నిబంధనలు పాటించాలని టెలికం ఆపరేటర్లకు, టెలీమార్కెటర్స్కు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఎస్సెమ్మెస్ చెకింగ్ ఫిల్టర్లను తిరిగి సక్రియం చేయాలని, నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా లేని ట్రాఫిక్ను నిరోధించాలని ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులేటరీ రిక్వైర్మెంట్కు అనుగుణంగా ప్రధాన సంస్థలకు తగిన అవకాశం ఇవ్వబడిందని, కాబట్టి వినియోగదారులకు నియంత్రణ నిబంధనల ప్రయోజనాలు కోల్పోలేరని పేర్కొంది.
ఈ మేరకు ఏప్రిల్ 1, 2021 నుండి నియంత్రణ అవసరాలను పాటించకపోవడం వల్ల స్క్రబ్బింగ్లో విఫలమైన సందేశాలు తిరస్కరించబడతాయని తెలిపింది. సంక్లిష్ట బ్లాక్ చెయిన్ ఆధారిత ఎస్సెమ్మెస్ ఫిల్టరింగ్ సిస్టంలోకి వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న అవరోధాలను చర్చించేందుకు ట్రాయ్ టెలికం ఆపరేటర్లతో, దేశవ్యాప్తంగా 50కి పైగా టెలి మార్కెటింగ్ సంస్థలతో సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది.