Alert: షాపింగ్ సమయంలో కస్టమర్లను అలా ఇబ్బంది పెట్టడం ఇక కుదరదు..!!
Good News: సాధారణంగా మనం షాపింగ్ కి వెళ్లినప్పుడు బిల్లింగ్ సమయంలో చాలా సంస్థలు వినియోగదారులను మెుబైల్ నంబర్ అడుగుతుంటాయి. ఇది చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. అయితే దీనిపై ఫిర్యాదులు పెరిగిపోవటంతో ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పద్ధతికి స్వస్తి చెప్పే దిశగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఒక హెచ్చరికను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ సమస్యపై అనేక ఫిర్యాదులు అందినందున తాజా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఎవరైనా వ్యాపారి కస్టమర్ల నుంచి మెుబైల్ నంబర్ ఇన్వాలని పట్టుబట్టడం 'అన్యాయమైన వాణిజ్య విధానం' కిందకు వస్తుందని ఆయన అన్నారు.

కొన్ని చోట్ల మెుబైల్ నంబర్ ఇవ్వటానికి నిరాకరిస్తే.. వారికి సేవలను అందించటానికి నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదుల్లో అనేక మంది తెలిపారు. అదే సమయంలో మొబైల్ నంబర్ లేకుంటే బిల్లు జనరేట్ కావటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ చర్యలు చట్టానికి విరుద్ధమైనవి కాబట్టి కస్టమర్లు సమ్మతిస్తే తప్ప వారి మొబైల్ నంబర్లు తీసుకోకూడదు. భారతదేశంలో వినియోగదారులు కొనుగోలు తర్వాత బిల్లింగ్ కోసం మెుబైల్ నంబర్ వివరాలు అందించాల్సిన అవసరం లేదు.

కస్టమర్ల గోప్యతకు సంబంధించిన అంశం కాబట్టి.. తన మొబైల్ నంబర్ను షేర్ చేయాలా వద్దా అనే హక్కు కస్టమర్కు ఉంటుంది. అందువల్ల ఈ విషయంపై వ్యాపారులకు ప్రభుత్వ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా సమస్యను పరిష్కరించడానికి రిటైల్ పరిశ్రమకు, CII, FICCI, ASSOCHAM వంటి సంస్థలకు ఒక సలహా పంపబడుతుంది.


Click it and Unblock the Notifications