నేటి నుండి ఆటో డెబిట్ కొత్త రూల్స్, వీటికి మినహాయింపు: ఇవి తెలుసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆటో డెబిట్ రూల్స్ నేటి నుండి (అక్టోబర్ 1) అమలులోకి వస్తున్నాయి. మనలో చాలామంది క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్లు తమ విద్యుత్, గ్యాస్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ (నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి), బీమా చెల్లింపులు ఇలా పలు సేవలకు ఆటో పేమెంట్ సూచనలను ఏర్పాటు చేసుకోవడం సహజం. కానీ నేటి నుండి అలాంటివి జరిగే అవకాశం లేదు. ఇప్పటికే ఈ మేరకు బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారాన్ని అందించాయి. ఆర్బీఐ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం 24 గంటల ముందు బ్యాంకులకు ఖాతాదారులు ప్రీ-డెబిట్ సందేశం పంపిస్తే ఆటో డెబిట్ పేమెంట్స్ జరుగుతాయి. రూ.5000 దాటిన ఆటోమేటెడ్ పేమెంట్స్కు సంబంధిత ఖాతాదారు స్వయంగా ఓటీపీ ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది.
అనుమతితోనే..
బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఆటోమేటిక్ పేమెంట్స్ కోసం నేటి నుండి అడిషనల్ ఫ్యాక్చర్ అథెంటిఫికేషన్(AFA)ను తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే చెల్లింపులకు ముందు కస్టమర్ నుండి ప్రతిసారి అంగీకారం పొందవలసి ఉంటుంది. చెల్లింపు తేదీ, చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి కస్టమర్కు ముందే సందేశం పంపించాలి. కస్టమర్ దానిని ధృవీకరించిన తర్వాత ట్రాన్సాక్షన్ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. ఆర్బీఐ నిబంధన ప్రకారం ప్రతి చెల్లింపులోను దీనిని పాటించవలసి ఉంటుంది. రూ.5వేలకు మించిన ట్రాన్సాక్షన్కు దీనిని తప్పనిసరిగా పూర్తి చేయాలి. అంతేకాదు, ఇది ఎంత వరకు అమలులో ఉండాలో కూడా చెప్పవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్ జరగడానికి ఇరవై నాలుగు గంటల ముందు కస్టమర్ అనుమతిని తీసుకోవాలి. అవసరమైతే కస్టమర్ ఈ ట్రాన్సాక్షన్ను నిలిపివేయవచ్చు.
వీటికి మినహాయింపు
ఆటో డెబిట్ పాలసీలో కొన్ని పథకాలకు మినహాయింపులు ఉన్నాయి. బ్యాంకు ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్స్కు చెల్లింపుతో పాటు సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP)లకు మినహాయింపు ఇచ్చింది ఆర్బీఐ. బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించడానికి ముందే ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పర్టిక్యూలర్ సర్వీసులు వద్దని కస్టమర్లు వెళ్లినప్పటికీ, థర్డ్ పార్టీ కంపెనీలు కస్టమర్స్ ఖాతా నుండి డబ్బులు డెబిట్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆర్బీఐ కొత్త నిబంధనను తీసుకు వచ్చింది. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విధానాలను విశ్లేషించి కొత్త రూల్స్ తెచ్చింది. థర్డ్ పార్టీ కంపెనీలు కస్టమర్స్ మొత్తం ఆర్థిక ట్రాన్సాక్షన్స్ను నిక్షిప్తం చేసుకుంటున్నందున కస్టమర్లకు ఈ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ నిబంధన తెచ్చింది.
ప్రతిసారి ధృవీకరణ
కొత్త నిబంధనల కింద అన్ని రికవరింగ్ ట్రాన్సాక్షన్స్కు అదనపు అనుమతి అవసరం అవుతుంది. రూ.5000కు మించిన చెల్లింపులకు ప్రతిసారి ఓటీపీతో దానిని ధ్రువీకరించాలి. ఇది అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల (దేశీయ, అంతర్జాతీయ)పై వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధనను కేంద్ర బ్యాంకు ఇచ్చిన గడువులోగా అన్ని బ్యాంకులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈజీ ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయని, కానీ నేటి నుండి ప్రారంభమయ్యే ఈ కొత్త నిబంధనల ప్రారంభంలో కస్టమర్లకు ఆటంకాలు కలిగించవచ్చునని అంటున్నారు. ప్రముఖ బ్యాంకులు రేజర్ పే, బిల్ డెస్క్ వంటి వాటితో కలిసి పని చేస్తున్నాయి.