ATMను టచ్ చేయకుండానే మనీ విత్డ్రా చేసుకోవచ్చు! ఎన్నో ప్రయోజనాలు
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం సామాజిక దూరం తప్పనిసరిగా మారింది. బయట ఏ వస్తువును తాకాలన్నా భయంగానే ఉంది. దానిని ఎవరు ముట్టుకున్నారో తెలియని పరిస్థితి. ఎందుకంటే కరోనా సోకిన వ్యక్తి దానిని ముట్టుకుంటే నిర్దిష్ట సమయంలో దానిని ఇతరులు తాకితే వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. అందుకే శానిటైజర్లు, పేస్ మాస్కులు, సామాజిక దూరం అనివార్యంగా మారాయి. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్, స్టెయిన్లెస్స్టీల్ పైన కరోనా 3 రోజుల వరకు జీవించగలదు. ఏటీఎంలో నెంబర్లు ప్రెస్ చేసేందుకు వీటిని తాకాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని బ్యాంకులు సాధ్యమైనన్ని తక్కువసార్లు తాకేలా కార్డ్లెస్ నగదు ఉపసంహరణను ప్రోత్సహిస్తున్నాయి.
కరోనా ఎఫెక్ట్: ATM నుండి కార్డ్లెస్ ఉపసంహరణ ఎలా చేయాలి?
QR కోడ్ ద్వారా నగదు ఉపసంహరణ
అయితే వీటి కంటే మరో ముందడుగు వేసి, అసలు ఏటీఎం యంత్రంలో పిన్ నెంబర్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే QR కోడ్ ద్వారా డబ్బును తీసుకునే మరో సరికొత్త సాంకేతికతను ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా దాదాపు 72,000లకు పైగా ఏటీఎంలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణను ఈ సంస్థ చూస్తోంది.
క్యూఆర్ కోడ్ ద్వారా నగదు ఉపసంహరణ ఇలా..
కరోనా నేపథ్యంలో వస్తువులను తాకడాన్ని నిరోధించడంలో భాగంగా దీనిని వినియోగంలోకి తెస్తున్నట్లు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ తెలిపింది. ఈ సాంకేతికతకు సంబంధించి నమూనా ఏటీఎంలను బ్యాంకులకు వివరిస్తోంది. దీని ప్రకారం ఓ బ్యాంకు కస్టమర్ ఏటీఎంకు వెళ్లిన తర్వాత తన మొబైల్ ఫోన్లో సంబంధిత బ్యాంకు యాప్ను ఓపెన్ చేసి, క్యూఆర్ కోడ్ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఎంచుకోవాలి. ఎంత నగదు కావాలో కూడా అందులో చేసే వెసులుబాటు ఉంది. వాటిని పూర్తి చేయగానే ఏటీఎం మిషన్ స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎం-పిన్ నమోదు చేయాలి.
ఫ్రాడ్కు కూడా చెక్
టచ్లెస్ ఏటీఎం నగదు ఉపసంహరణను విజయవంతంగా పరీక్షించిన ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (AGSTTL) ఆసక్తి కలిగిన బ్యాంకులకు డెమో ఇస్తోంది. మొబైల్ అప్లికేషన్ ద్వారానే నగదు ఉపసంహరణ పూర్తి అవుతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా నగదు ఉపసంహరణ మరింత వేగంగా, సురక్షితంగా ఉంటుంది. ఏటీఎం పిన్ లేదా కార్డ్ స్కిమ్మింగ్ ఫ్రాడ్కు చెక్ చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది.
బ్యాంకులు అప్ గ్రేడ్ చేస్తే చాలు
సంస్థ చైర్మన్ అండ్ ఎండీ రవి బీ గోయల్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో కస్టమర్లకు మరింత సరళీకృత నగదు ఉపసంహరణ అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భీమ్ యూపీఐని ఉపయోగించేందుకు చాలామంది క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తున్నారని, ఇదే టెక్నాలజీతో దీనిని తయారు చేసినట్లు తెలిపారు. కస్టమర్లకు ఇది మెరుగైన భద్రత, వేగవంత సేవలు అందిస్తుందన్నారు. కనీస పెట్టుబడితో బ్యాంకులు ఇప్పటికే ఉన్న సాఫ్టువేర్ను అప్ గ్రేడ్ చేయడం ద్వారా దీనిని ఉపయోగించవచ్చునన్నారు.