LIC ఏజెంట్లు మీకు చెప్పని కొన్ని విషయాలు మీకోసం!
సంప్రదాయ పాలసీలు జీవిత బీమా సంస్థల వ్యాపారానికి భారీ లాభాలను తెచ్చిపెడతాయి. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు భిన్నంగా సంప్రదాయ పాలసీల వివరాలు పారదర్శకంగా ఉండవు. పెట్టుబడి వివరాలు, ఛార్జీలలాంటివేమీ వెల్లడించరు. పాలసీ ప్రీమియం డబ్బులు రెండింతలు అవుతాయి, పన్ను ఆదా అవుతుందని ఏజెంటు ఊరిస్తాడే తప్ప చాలా విషయాలను మీ దగ్గర దాచిపెడతాడు. సంప్రదాయ పథకాలను ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను ఏజెంట్లు మీ దగ్గర ప్రస్తావించరు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. సంప్రదాయ పాలసీల గురించి:
ప్రతి జీవిత బీమా సంస్థ తమ పథకాల్లో భాగంగా కొన్ని ఎండోమెంట్ పాలసీలను (సంప్రదాయ పాలసీలు) అందుబాటులో ఉంచుతుంది. వీటిలోనే యులిప్స్ ఉంటాయి. మార్కెట్ రాబడులతో యులిప్స్ నేరుగా ముడిపడి ఉంటాయి. కాగా, సంప్రదాయ పథకాలను మాత్రం పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్గా వర్గీకరించారు. పార్టిసిపేటింగ్ ప్లాన్స్లో పాలసీదారులు తమ పెట్టుబడుల్లో కొంత లాభాలు పొందగలుగుతారు. బీమా సంస్థలు ఏటా ప్రకటించే బోనస్ ద్వారా ఈ లాభాలు వస్తాయి. నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్స్లో అయితే పాలసీదారులు లాభాల్లో వాటాను పొందలేరు. అయితే రాబడులను మాత్రం చివర్లో కచ్చితంగా అందుకుంటారు. సంప్రదాయ ప్లాన్స్లో రిస్క్ కవరేజీ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం రక్షణ కోసం ఉద్దేశించి పాలసీ తీసుకోవాలనుకుంటే సంప్రదాయ ప్లాన్స్ అనుకూలం కాదు. సంప్రదాయ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ గరిష్టంగా ప్రీమియానికి 10రెట్లు ఉంటుంది. టర్మ్ పాలసీ తీసుకున్నట్లయితే రక్షణ గణనీయంగా ఉంటుంది.
2. మీకు చెప్పని, తెలియని ఛార్జీల వివరాలు:
ఏజెంట్లకు కమిషన్ ఎంతిస్తున్నారనే విషయాన్ని పాలసీదారులకు బీమా సంస్థలు వెల్లడించడం తప్పనిసరి కాదు. సంప్రదాయ పాలసీల్లో ప్రీమియం కేటాయింపు ఛార్జీలు, నిర్వహణ రుసుములు, మోర్టాలిటీ ఛార్జీలను తెలుసుకోవాలన్నా దొరకని పరిస్థితి. పాలసీ డాక్యుమెంట్లో కనిపించే బెనిఫిట్ ఇలస్ట్రేషన్లో స్థూల రాబడికి... నికర రాబడికి(ఐఆర్ఆర్)కి మధ్య తేడా గ్రహించడం ద్వారా నిర్వహణ రుసుములను తెలుసుకోవచ్చు. అయితే ఎక్కడా ఛార్జీల్లో బ్రేకప్ ను పేర్కొనరు. ఏజెంట్లు సరెండర్ ఛార్జీల వివరాలు సైతం తెలపకపోవచ్చు. సంప్రదాయ పాలసీల్లో పెట్టుబడులపై ఎలాంటి లాకిన్ గడువు ఉండదు. అయితే సరెండర్ ఛార్జీలను మోత మోగిస్తారు. ఇది ప్రారంభంలో 70శాతం దాకా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. యూలిప్స్ లో ఛార్జీలను సమాంతరం చేస్తారు కానీ సంప్రదాయ పాలసీల్లో అన్నీ ఒకేసారి బాదేస్తారు. పాలసీ డాక్యుమెంట్లో సరెండర్ ఛార్జీల గురించి వివరాలు ఉంటాయి అయితే చాలా సందర్భాల్లో ఏజెంట్లు ఈ వివరాలేవీ వెల్లడించరు
3. ఐఆర్ఆర్ః
వాస్తవ రాబడి సంప్రదాయ బీమా పాలసీల్లో, ఏజెంట్లు పెట్టిన పెట్టుబడి అంతా రెండింతలవుతుందని ప్రగల్భాలు పలుకుతారు. వాస్తవానికి అలా ఏమీ కాదు. చాలా నాన్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ ప్లాన్స్లో సరాసరి రాబడులు 4 నుంచి 5శాతం మధ్యలో ఉంటాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ అందిస్తున్న సంచయ్ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. 45ఏళ్ల వయసున్న వ్యక్తి సంవత్సర ప్రీమియం రూ.1.5లక్షలను 10ఏళ్ల పాటు చెల్లించుకుంటు వెళితే 20ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ గడువు ముగిసి రూ.28లక్షలు చేతికందుతుంది. దీని అంతర్గత రాబడి రేటు(ఐఆర్ఆర్)ను లెక్కిస్తే 4శాతానికి వస్తుంది. పాలసీదారులు చెల్లించే ప్రీమియం మొత్తాలను, మెచ్యూరిటీ విలువ మొత్తాన్ని పోల్చకుండా వాస్తవ రాబడిని ఏజెంట్లు చెప్పకుండా ఉంటారు. ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రీమియం ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు చెల్లించాలి. మెచ్యూరిటీ సొమ్ము వాయిదా విధానంలో 5 లేదా 10ఏళ్ల వరకు ఇస్తారు లేదా ప్రీమియం చెల్లింపులు ముగిసిన 10 లేదా 20ఏళ్ల తర్వాత ఒకేసారి మొత్తంగా ఇస్తారు. ఈ క్రమంలో అన్నేళ్ల కాలానికి డబ్బు విలువను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. ఎండోమెంట్ పాలసీల్లో అంతర్గత రాబడి రేటు(ఐఆర్ఆర్)ను తెలుసుకోవడం వల్ల వాస్తవ రాబడి ఏమిటో లెక్కించవచ్చు. ఐఆర్ఆర్ ను లెక్కించడం పెద్ద సమస్యేమి కాదు. ఆన్లైన్లో చాలా కాలిక్యులేటర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్సెల్ స్ప్రెడ్ షీట్లోనూ ఐఆర్ఆర్ లెక్కించడం సాధ్యమవుతుంది.
4. బెనిఫిట్ ఇలస్ట్రేషన్, కాల్పనికమేనా?:
ఏ పెట్టుబడి తీసుకున్నా సరే దాంట్లో వచ్చే రాబడులే పెట్టుబడిదారులను ఆకర్షించేది. పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్ రెండూ తమ పాలసీ డాక్యుమెంట్లో పాలసీదారుల అవగాహన కోసం మెచ్యూరిటీ రాబడులపై బెనిఫిట్ ఇలస్ట్రేషన్ను పొందుపరుస్తాయి. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్లో మెచ్యూరిటీ బెనిఫిట్ ను కచ్చితంగా నిర్ణయించి ఇస్తారు కాబట్టి చివరికి రాబడి మొత్తం కలిపి ఎంత అందుకునేది బెనిఫిట్ ఇలస్ట్రేషన్లో పేర్కొంటారు. పార్టిసిపేటింగ్ ప్లాన్స్లో మాత్రం రెండు సందర్భాలను పేర్కొనడం గమనార్హం. మెచ్యూరిటీ గడువు ముగిశాక ఎంత అందుకునేది సోదాహరణగా వివరిచేందుకుగాను ఒక సందర్భంలో 4శాతం రాబడి వచ్చినట్టు, మరొక సందర్భంలో 8శాతం రాబడి ఉన్నట్టు లెక్కిస్తారు. ఇలా లెక్క కట్టినంత విలువ చేతికందుతుందనే భ్రమలో ఉండకండి. ఇది కేవలం ఉదాహరణ కోసమే తప్ప అంతే మొత్తం ఇస్తుందని కచ్చితంగా చెప్పలేం. 2013 వరకు కూడా బీమా సంస్థలు 6 శాతం, లేదా 10శాతం రాబడి వచ్చినట్టుగా పేర్కొనేవారు. పార్టిసిపేటింగ్ ప్లాన్స్లో ఏ విధంగాను రాబడి ఎంతొస్తుందన్న విషయాన్ని తెలుసుకోలేం. ఇది బీమా సంస్థ ప్రకటించే బోనస్పై ఆధారపడి ఉంటుంది. పాలసీతో ముడిపడిన ఛార్జీలను తెలసుకోవడానికే బెనిఫిట్ ఇలస్ట్రేషన్ ఉపయోగపడుతుంది. ఒక పాలసీలో 8శాతం రాబడి అంచనా వేసుకుంటే ఇందులో వాస్తవ రాబడి 5శాతం ఉన్నట్లయితే మిగతా 3శాతాన్ని నిర్వహణ కిందికే వెళ్లినట్టు. ఈ 3శాతమే సదరు పాలసీ నిర్వహణ నిష్పత్తి. దీన్ని ఇతర ఎండోమెంట్ పాలసీల నిర్వహణ నిష్పత్తితో పోల్చి చూసుకొని ఛార్జీల వసూలులో ఎంత తేడా ఉంటుందో గమనించవచ్చు.
5. బోనస్ అందిస్తామనే కచ్చితమైన హామీ:
జీవిత బీమా రూపంలో సేకరించిన నిధుల నుంచి బోనస్ను బీమా సంస్థలు ప్రకటిస్తుంటాయి. ఈ బోనస్ వల్లే పార్టిసిపేటింగ్ ప్లాన్స్లో రాబడులు పెరుగుతాయి. బోనస్ ప్రకటిస్తే పాలసీదారులకు కచ్చితంగా కొంచెం లాభం అందుతుంది. ఇది 1శాతం వాస్తవ రాబడి అంత ఉంటుంది. బోనస్ ప్రకటన వల్ల కచ్చితంగా రాబడి వస్తుందని ఏజెంట్లు చెబుతారు కానీ వాస్తవానికి అలా రాకపోవచ్చు. బీమా సంస్థలు తాము పెట్టిన పెట్టుబడిలో మంచి లాభాలు గడిస్తేనే బోనస్ను ప్రకటించి తమ పాలసీదారులకు అందేలా చేస్తారు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం బీమా సంస్థలు అధికంగా ఆర్జించిన మొత్తాన్ని పాలసీదారులు, షేర్ హోల్డర్లకు మద్య 9:1 నిష్పత్తిలో పంచాల్సి ఉంటుంది. కంపెనీ మంచి ఫలితాలను అందిస్తున్న సమయంలోనే బోనస్ను ఇవ్వగలుగుతుంది. ఏటా బోనస్ రేటులో మార్పులుంటాయి. ఎందుకంటే ఇది నేరుగా సంస్థ లాభాలతో ముడిపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో నడుస్తున్న వడ్డీ రేట్ల చక్రాలకు అనుగుణంగానూ బోనస్ రేట్లలో మార్పులను చూడవచ్చు. పార్టిసిపేటటరీ పాలసీలలో ఉన్న సొమ్మును అధికంగా డెట్ సాధనాల్లో పెట్టడమే ఇందుకు కారణం. గడచిన కొన్నేళ్లలో ప్రభుత్వ బాండ్ల విలువ తరిగిపోతుంది. బీమా సంస్థలు ప్రకటించే బోనస్ సైతం తగ్గిపోతూ వస్తోంది. ఉదాహరణకు 2014 నుంచి ఇప్పటిదాకా తీసుకున్నట్లయితే 10ఏళ్ల ప్రభుత్వ బాండ్ల రేటు 9 నుంచి 6.8శాతానికి పడిపోయింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సేవింగ్స్ సురక్ష పథకాన్నే తీసుకున్నట్లయితే... ఇది ఒక నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్. 2014లో రివర్సనరీ బోనస్ 2.25శాతం వచ్చేది. అది కాస్తా 1.75శాతానికి చేరుకుంది. బీమా సంస్థలు బోనస్ ను సాధారణంగా సమ్ అస్యూర్డ్ లో శాతం లెక్కల్లో ప్రకటిస్తారు. చాలా సంస్థలు సింపుల్ రివర్సనరీ బోనస్ను ప్రకటిస్తాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంటి కొన్ని సంస్థలే కంపౌండ్ రివర్సనరీ బోనస్ను ప్రకటిస్తాయి. ఇక్కడ రెండో ఏడాది ప్రకటించిన బోనస్తో తొలి ఏడాది బోనస్ను కలిపి ప్రకటిస్తారు. సాధారణంగా రెండు రకాల బోనస్లుంటాయి.. రివర్సనరీ బోనస్ -- దీన్ని ప్రతి ఏటా ప్రకటిస్తుంటారు. మరొకటి టెర్మినల్ బోనస్- దీన్ని పాలసీ సరెండర్ చేసేటప్పుడో లేదా పాలసీదారు మృతిచెందినప్పుడో ప్రకటిస్తుంటారు. పాలసీ ముగిసే వ్యవధి నాటికి, సమ్ అస్యూర్డ్ పై మెచ్యూరిటీ విలువతో పాటుగా రివర్సనరీ బోనస్, టెర్మినల్ బోనస్లను లెక్కించి మొత్తంగా జమ అయిన దాన్ని ఒకేసారి చెల్లిస్తారు.
6. అధికంగా డెట్ పెట్టుబడుల్లో పెట్టే విషయం:
సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు అధిక రాబడుల రాకపోవడానికి కారణం వాటిని డెట్ పెట్టుబడుల్లో పెట్టడమే అన్న సంగతిని మదుపరులు గుర్తించాలి. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం జీవిత బీమా సంస్థలు తమ మొత్తం కేటాయింపుల్లో 50శాతం ప్రభుత్వ బాండ్లలో పెట్టాలి. 15శాతం గృహ, మౌలిక బాండ్లలో పెట్టాలి. కేవలం 35శాతం లేదా అంతకంటే తక్కువ ఈక్విటీల్లో పెట్టాలి. సంప్రదాయ పాలసీల్లో 80 నుంచి 85శాతం దాకా స్థిర ఆదాయ పెట్టుబడుల్లోనే పెడతారు. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్లో అయితే రాబడి కచ్చితంగా ఇంత ఇవ్వాలనే నియమం ఉంటుంది కాబట్టి వీటిలోని సొమ్మును డెట్ పెట్టుబడుల్లోనే పెడతారు.
7. కచ్చితమైన రాబడులనందించే వాటిపై మొగ్గు చూపాలా?:
వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో దీర్ఘకాల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కేవలం 6.5శాతం వడ్డీనందిస్తున్నాయి. పెట్టుబడిదారులను ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిందిగా సూచిస్తున్నాయి. బీమా పాలసీల్లో కచ్చితమైన రాబడులు 4-5శాతం మేర వస్తున్నాయి. మెచ్యూరిటి సొమ్ముపై పన్ను మినహాయింపు లభిస్తుంది కాబట్టి వాస్తవ రాబడి ఎఫ్ డీలతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటుంది. బీమా రక్షణ, పెట్టుబడుల కలయికగా వచ్చే ఈ పాలసీల ధరలు అధికమనే చెప్పాలి. ఇలాంటి పాలసీలు అందించే రాబడులేమిటి వాటిని ఏ రకంగా ఎంచుకోవాలో తెలుసుకుందాం.