పేటీఎమ్-ఐసీఐసీఐ జట్టుగా వడ్డీ లేని రుణాలు
రెగ్యులర్గా పేటీఎమ్ ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి దాదాపు రూ20 వేల వరకూ వడ్డీ రహిత రుణాలను అందివ్వనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మీ కోసం...
పేటీఎమ్ లాయల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులుగా ఉంటూ పేటీఎమ్ వాడేవారికి వడ్డీ లేని రుణాలిచ్చేందుకు సిద్దమైంది. రెగ్యులర్గా పేటీఎమ్ ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి దాదాపు రూ20 వేల వరకూ వడ్డీ రహిత రుణాలను అందివ్వనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మీ కోసం...
రూ.20 వేల వరకూ రుణం
సినిమా టిక్కెట్, విమానయాన టిక్కెట్లు కొన్నంత సులువుగా తక్షణ రుణం ఇచ్చేందుకు పేటీఎమ్-ఐసీఐసీఐ కొత్త ప్రయత్నం చేస్తున్నాయి. తమ కస్టమర్లకు స్వల్పకాలిక తక్షణ రుణ సదుపాయం అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. పేటీఎం ద్వారా కొనుగోళ్లు వారికి దాదాపు రూ. 20,000 దాకా రుణం అందించనున్నట్లు పేర్కొంది. ఈ సదుపాయం పొందాలంటే వినియోగదారులు పేటీఎమ్ వాడుతూ ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులై ఉండాలి.
45 రోజుల దాకా వడ్డీ ఉండదు
పేటీఎం-ఐసీఐసీఐ బ్యాంక్ పోస్ట్ పెయిడ్ కార్డ్ మీద తీసుకునే రుణంపై మొదటి 45 రోజులదాకా వడ్డీ ఉండదని, ఒకవేళ ఆ వ్యవధిలో గానీ చెల్లించకపోతే.. జాప్యానికి గాను రూ. 50 ఫీజుతో పాటు 3% వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. సకాలంలో రుణం చెల్లించే వారికి ఎటువంటి వడ్డీ ఉండకపోవడమే ఇందులోని సౌలభ్యత.
ఒకసారి తీరిస్తే మళ్లీ...
రుణపరిమితి ఒక్క లావాదేవీకి రూ. 20,000 మాత్రమే ఉన్నప్పటికీ.. అప్పుని తీర్చేసిన తర్వాత కస్టమర్ మళ్లీ ఈ రుణ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ తెలిపారు. ఈ ప్రయోగాన్ని బట్టి ఐసీఐసీఐ బ్యాంక్యేతర కస్టమర్లకు, ఇతర పెద్ద వ్యాపార సంస్థలకు కూడా విస్తరించే అవకాశం పరిశీలిస్తామని పేర్కొన్నారు.
ఉత్పత్తి పేరు
పేటీఎమ్, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ కలిసి విడుదల చేస్తున్న ఈ సరికొత్త సేవ పేరు పేటీఎమ్-ఐసీఐసీఐ బ్యాంక్ పోస్ట్పెయిడ్. దేశంలో ఈ తరహా ఉత్పత్తి లేదా సేవను ప్రారంభించడం ఇదే మొదటిసారి.
తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు వినియోగదారులు పేటీఎమ్ వాలెట్, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.