నష్టాల్లో ఉన్న ఆ సంస్థల మూసివేత
తీవ్ర నష్టాల్లో ఉన్న 15 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో ఐదింటి కోసం కేబినెట్ అనుమతి కూడా వచ్చేసింది. మరో వైపు అలాగే మూడు ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తతంగమంతా నీతి ఆయోగ్ సూచనల మేరకు జరుగుతోందని అనధికార వర్గాల సమాచారం. కొన్ని మంత్రిత్వ శాఖలు వాటి పరిధిలో ఉన్న సంస్థలను మూసివేసేందుకు సుముఖంగా ఉండగా, మరికొన్ని శాఖలు ఈ ప్రక్రియను అంగీకరించడం లేదు.
హెచ్పీసీఎల్ బయో ఫ్యూయెల్స్ మూసేయడాన్ని పెట్రోలియం శాఖ వ్యతిరేకిస్తోంది. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ బ్రిటీష్ ఇండియా కార్పొరేషన్, ఎల్గిన్ మిల్స్ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాయి. మరో మూడు ఫార్మా పీఎస్యూల విషయాన్ని మంత్రుల కమిటీ ముందుకు తీసుకెళ్లగా ఆ కమిటీ హిందూస్తాన్ యాంటిబయోటిక్స్ను క్లోజ్ చేయకూడదని సూచించింది. హెచ్ఎంటీ సంస్థలను మూసివేసేందుకు రూపొందించిన ప్రణాళికకు భారీ పరిశ్రమల శాఖ అనుమతించింది. అదే విధంగా సెంట్రల్ ఇన్ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ను మూసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.