రికార్డుస్థాయి లాభాలు నమోదు చేసిన రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయెన్స్ ఇండస్ట్రీస్ గత రెండేళ్లలోనే అత్యధిక త్రైమాసిక లాభాన్ని నమోదు చేసింది. పెట్రో రసాయనాల మార్జిన్లు భారీగా పెరగడం, రూపాయి క్షీణతతో ఎగుమతుల ఆదాయాలు రాణించడంతో ఇది సాధ్యమైంది. అంతేగాక సహజ వాయువు వ్యాపారంలో బలహీనతలను రూపాయి కప్పిపుచ్చగలిగింది. దీంతో గత నెలతో ముగిసిన మూడు నెలల కాలంలో 5,631 కోట్ల రూపాయల లాభాలను పొందిన రిలయన్స్.. గత ఏడాది ఇదే వ్యవధిలో 5,589 కోట్ల రూపాయల లాభాలను సాధించింది.
చమురు శుద్ధి వ్యాపారం నుంచి 12.3 శాతం పెరిగిన లాభాలు.. పెట్రోకెమికల్స్ వ్యాపారంలో 10.6 శాతం పెరిగాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ బలహీనపడటంతో ఎగుమతులూ లాభించాయి. గత ఏడాది జనవరి-మార్చిలో 54.20 పైసలు పలికిన రూపాయి మారకం విలువ.. ఈ ఏడాది జనవరి-మార్చిలో 61.80 పైసలకు క్షీణించాయి. కాగా, చమురు, గ్యాస్ వ్యాపారంలో మాత్రం 17.8 శాతం లాభాలు క్షీణించాయి. కృష్ణా-గోదావరి బేసిన్లో తగ్గిన ఉత్పత్తే కారణమని రిలయన్స్ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.
ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ను గుజరాత్లోని జామ్నగర్లో నిర్వహిస్తున్న రిలయన్స్.. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఇక్కడ ఇంధనంగా మారిన ప్రతి బ్యారెల్ ముడిచమురుపై 9.3 బిలియన్ డాలర్లను అందుకుంది. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో ఇది 7.60 శాతం ఉండగా, గత ఏడాది జనవరి మార్చిలో 10.1 శాతంగా ఉంది. ఇదిలావుంటే అమ్మకాలు 13 శాతం వృద్ధితో 97,807 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
ఇక మొత్తం ఆర్థిక సంవత్సరం 2013-14లో సంస్థ నికర లాభం 21,984 కోట్ల రూపాయలకు చేరింది. ప్రైవేట్రంగంలోని ఓ సంస్థ ఇంతటి భారీ స్థాయిలో నికర లాభాలు అందుకోవడం ఇదే. 2012-13లో ఇది 21,003 కోట్ల రూపాయలుగా ఉంది. సంస్థ టర్నోవర్ కూడా రికార్డు స్థాయిలో 8.1 శాతం పెరిగి 4,01,302 కోట్ల రూపాయలను తాకింది. అంతకుముందు 3,71,119 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ‘2013-14 ఆర్థిక సంవత్సరం సంతృప్తికరంగా సాగింది.' అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముఖేష్ అంబానీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేల్ గ్యాస్ వెంచర్లో 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.