భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికుల నుండి విశేష ఆదరణ పొందుతూ వార్తల్లో నిలుస్తోంది. అయితే దేశీయ ప్రయాణికులే కాకుండా విదేశీ ప్రయాణికులు కూడా వందేభారత్ ట్రైన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కామాఖ్య-హౌరా మార్గంలో గౌహతి నుండి కోల్‌కతా వరకు నడిచే వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమై ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా.. అంతర్జాతీయ ప్రయాణ నిపుణురాలు, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ 'అనూష' పంచుకున్న సమీక్ష సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

Advertisement

ప్రారంభోత్సవ సమయంలో ఉన్న హడావుడి, మెరుపులు ఆరు నెలల నిరంతర ప్రయాణాల తర్వాత కూడా నిలిచి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఆమె ఫస్ట్ ఏసీ క్యాబిన్‌లో ఒంటరిగా ప్రయాణించి, తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు. సాధారణంగా భారతీయ రైళ్లలో నెలల తరబడి వేలాది మంది ప్రయాణించిన తర్వాత పరిశుభ్రత క్షీణించడం, సౌకర్యాలు దెబ్బతినడం చూస్తుంటామని, అందుకే ఈ రైలు కూడా అలాగే ధ్వంసమై లేదా గందరగోళంగా ఉంటుందని తాను ఊహించానని అనూష చెప్పారు.

Advertisement

అయితే రైలులో అడుగుపెట్టిన వెంటనే ఆమె అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఆరు నెలల తర్వాత కూడా కోచ్‌లు, క్యాబిన్లు అత్యంత విశాలంగా, ఆధునికంగా, ఎటువంటి మచ్చలేని శుభ్రతతో కనిపించాయి. రైలు ఎక్కిన వెంటనే లభించిన వేడి టీతో పాటు.. మార్గమధ్యంలో వడ్డించిన ఆహారం తొలిరోజు ప్రయాణంలో ఉన్నంత రుచిగానే ఉందని ఆమె కొనియాడారు. రైలు నిర్వహణ స్థాయికి అసలైన నిదర్శనం దాని వాష్‌రూమ్ పరిస్థితేనని భావించిన అనూష.. ఫస్ట్ ఏసీలోని బాత్రూమ్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు. అందులోని షవర్ ఏరియా, బాత్రూమ్ ఎంతగానో పరిశుభ్రంగా ఉండటం చూసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు ఆరు నెలల వైబ్ చెక్ లో సంపూర్ణంగా విజయం సాధించిందని ఆమె ప్రకటించిన వీడియోకు నెటిజన్ల నుండి లక్షలాది వీక్షణలు, వేలాది కామెంట్లు వచ్చాయి.

Advertisement
హైడ్రోజన్ రైలు vs వందే భారత్.. ఏది వేగం..మరేది చౌక.. ప్రయాణికులు తెలుసుకోవాల్సినవి ఇవే..

ఈ సమీక్ష వైరల్ అయిన తదుపరి రోజుల్లో.. Vande Bharat స్లీపర్ రైళ్లకు సంబంధించి అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూష వీడియో ఆధారంగా సోషల్ మీడియా వేదికగా పౌర బాధ్యతపై ఒక పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు.. వాటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఆస్తిని కాపాడుకోవడం పౌరులుగా ప్రయాణికుల కనీస బాధ్యత అని నెటిజన్లు పెద్ద ఎత్తున వ్యాఖ్యానించారు. చెత్తను బాత్రూముల్లో లేదా కోచ్‌లలో పడేయకుండా డస్ట్‌బిన్‌లను వాడాలని ప్రచారాలు ఊపందుకున్నాయి.

Advertisement

అదే సమయంలో ఈ రకమైన ప్రీమియం అనుభవాన్ని సుదీర్ఘకాలం కాపాడేందుకు రైల్వే శాఖ ఆన్-బోర్డ్ హౌస్‌కీపింగ్ సేవలను మరింత కఠినతరం చేసింది. రైలు ప్రయాణంలో ఉన్నంతసేపు ప్రతి రెండు నుండి మూడు గంటలకొకసారి వాష్‌రూమ్‌లను, కారిడార్లను శుభ్రం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, కామాఖ్య-హౌరా మార్గంలో వందే భారత్ స్లీపర్ సాధించిన విజయవంతమైన స్పందనను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ.. రాత్రివేళ ప్రయాణ మార్గాలలో కూడా మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే తయారీ వేగాన్ని పెంచింది. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కోచ్‌లో ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర టాక్-బ్యాక్ సిస్టమ్‌ల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు డిజిటల్ మానిటరింగ్‌ను ప్రవేశపెట్టారు.

Advertisement

ఏదేమనా విదేశీ ప్రయాణికురాలి రివ్యూ భారతీయ రైల్వే మేక్ ఓవర్ పై అంతర్జాతీయంగా సానుకూల దృక్పథాన్ని పెంచడమే కాకుండా, దేశీయంగా రైలు సౌకర్యాలను కాపాడుకోవడంలో ప్రయాణికుల బాధ్యతను మరొకసారి గుర్తుచేసిందని చెప్పవచ్చు.