SBI alert: ఆ 5 గంటలు ఎస్బీఐ యోనో, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పని చేయదు
స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI) కస్టమర్లకు అలర్ట్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు శనివారం కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు కూడా నిలిచిపోతాయని ఎస్బీఐ పేర్కొంది. శనివారం అర్ధరాత్రి గం.11.30 నుండి ఆదివారం వేకువజాము గం.4.30 వరకు అంటే ఐదు గంటల పాటు ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
టెక్నికల్ అప్గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్బీఐ పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న అసౌకర్యానికి సహకరించాలని కస్టమర్లను కోరింది. దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22వేల శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్ 8న ఇదే తరహాలో మెయింటెనెన్స్లో భాగంగా ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు కొద్దిగంటల పాటు అంతరాయం ఏర్పడింది.

SBI వెబ్ సైట్ ప్రకారం నాలుగో వంతు మార్కెట్ వాటాతో దేశంలో అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఎస్బీఐ తన 11 సబ్సిడరీల ద్వారా వ్యాపారాన్ని వైవిద్యపరిచింది. ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ కార్డ్స్ వంటివి ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించింది. 32 విదేశాల్లో 233 కార్యాలయాల ద్వారా టైమ్ జోన్లలో పని చేస్తుంది.