సుకన్య సమృద్ధి ఖాతా: లోపాల గురించి తెలుసుకోండి..!
న్యూఢిల్లీ: ఆడపిల్లల పట్ల వివక్షను అంతం చేసి లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించారు. ఇందుకోసం మోడీ బేటీ బచా వో.. బేటీ పఢావో పిలుపునిచ్చారు. ఆడ పిల్లలకు ప్రత్యేక ఖాతాలు తెరవడం వల్ల ఆర్థిక సాధికారత లభిస్తుందని, తద్వారా వారిని మగ పిల్లలతో సమానంగా సంరక్షించేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం 9.2 శాతంగా నిర్ణయించింది. అంతే కాదు ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపన్ను మినాహాయింపు కూడా ఉంది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.
తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది.
అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
1. కాల పరిమితి:
ఈ ఖాతా తక్కువ కాల పరిమితి పెట్టుబడిదారులకు ఏవిధంగానూ హెల్ప్ అవదు. ఖాతాలో ఉన్న జమ అయిన డబ్బు 21 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.
2. రెండు ఖాతాలు:
ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఇద్దరు బాలికలున్న తండ్రి రెండు ఖాతాల్లో విడివిడిగా సొమ్ముని జత చేయాల్సి ఉంటుంది. ముగ్గురు కూమార్తెలున్న తండ్రి మరో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచేందుకు వీలు లేదు.
3. ముందు ఉపసంహరణ
ఈ పథకం కింద జమ చేసిన నగదుని 21 సంవత్సరాల తర్వాతనే చెల్లిస్తారు. ఏదైనా కారణం చేత ముందుగా నగదుని విత్ డ్రా చేసుకుందామనుకుంటే ఇవ్వరు. ఒక వేళ బాలిక చనిపోతే దానిని వేరుగా పరిగణిస్తారు.
4. ఆన్లైన్ ఫెసిలిటీ లేదు
సుకన్య సమృద్ధి యోజన పథకం కింద తెరిచిన ఖాతాలో డీడీ లేదా చెక్కు ద్వారా మాత్రమే జమ చేయాలి. ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం లేదు. సాంకేతిక పెరిగిన ఈ రోజుల్లో ప్రజలకు పెద్ద అసౌకర్యంగా అనిపిస్తుంది.
5. వడ్డీ రేట్లలో తేడా
ఈ పథకం కింద జమ చేసిన నగదుకు ప్రభుత్వం ప్రకటించే వడ్డీ రేట్లలో ప్రతి ఏడాదికి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ నగదుని ప్రభుత్వ బాండ్లకు అనుసంధానం చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద జమ చేసిన నగదుకి రిస్క్ భయం తక్కువగా ఉండే వడ్డీ మాత్రమే లభిస్తుంది.