రూపే కార్డు అంటే ఏమిటి, ఎవరు రూపొందించారు?
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల చెల్లింపుల్లో ఆధార్ పాత్రను పరిమితం చేయాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ నిధుల విత్డ్రాకు ఆధార్ స్థానంలో రూపే ఎటిఎం కార్డుల వాడకాన్ని ప్రవేశపెట్టాలని భావించడంతో ఇప్పుడు అందరి చూపు వీటిపై పడింది.
అసలు రూపే కార్డు ఏమిటి? ఎవరు రూపొందించారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి కలిగి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. దేశీయంగా వివిధ రకాల చెల్లింపుల కోసం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ సొంతంగా ‘రూపే కార్డు'ను రూపొందించింది.
రూపే కార్డు ఏమిటి?
రూపీ, పేమెంట్ అనే రెండు పదాలను కలిపి రూపేగా మార్చారు. వీసా, మాస్టర్ కార్డ్ లాగా రూపే కార్డును ఎటిఎం, పాయింట్ ఆఫ్ సేల్స్, ఆన్లైన్ లావాదేవీల్లో ఉపయోగించవచ్చు. రూపే ప్లాట్ఫాంను 2012లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) అభివృద్ధి చేసింది.
రూపే కార్డు అందించే సర్వీసులను వివిధ దశల్లో విస్తరించనున్నారు. తొలిదశలో ఎటిఎంలు/మైక్రో ఎటిఎంలలో అనుమతించడం, రెండో దశలో డెబిట్ కార్డులు జారీ చేయడం ఇప్పటి వరకు జరిగింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చెల్లింపుల వ్యవస్థల్లో ఎటిఎం, పాయింట్ ఆఫ్ సేల్స్, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న వ్యవస్థల్లో రూపే ప్లాట్ఫాం ఏడోది.
అంతర్జాతీయ డెబిట్, క్రెడిట్ కార్డులకు ప్రామాణికంగా భావించే యూరోపే, మాస్టర్ కార్డ్, వీసాలలో ఉపయోగించిన చిప్ టెక్నాలజీని రూపే కార్డుల రూపకల్పనలో కూడా ఉపయోగించారు.
కేంద్ర ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు:
రూపే కార్డు ప్రాసెసింగ్ మన దేశంలోనే జరుగుతుంది కాబట్టి, ప్రాసెసింగ్ వ్యయాలు తగ్గడంతో పాటు, చాలా త్వరగా పూర్తవుతాయి. ఈ కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీల క్లియరింగ్, సెటిల్మెంట్ నిర్వహిస్తే, బ్యాంకులు చెల్లించాల్సిన ఫీజులో 40 శాతం మేర తగ్గుతుంది.
ఆన్లైన్లో రూపే కార్డుల వాడకాన్ని మరింత సురక్షితం చేస్తూ గత ఏడాది జూన్లో ఎన్పిసిఐ పే సెక్యూర్ను ప్రారంభించింది. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు గోప్యంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఎటిఎంలో ఉపయోగించే పిన్ నెంబర్తోనే రూపే కార్డు ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించవచ్చు. ఎటిఎం లావాదేవీలు నిర్వహించుకోవడానికి వీలుగా బ్యాంకులు రూపే ప్లాట్ఫాంపై కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి.
కిసాన్ కార్డుల కింద రైతులు పొందిన మొత్తం వ్యవసాయ రుణాన్ని ఒక్కసారిగా కాకుండా, అవసరాలకు అనుగుణంగా వివిధ దశల్లో విత్డ్రా చేసుకునే అవకాశాన్ని ఈ కార్డులు కల్పిస్తున్నాయి. దీని ఫలితంగా రైతులకు అనవసర వడ్డీ భారం తప్పుతుంది. దేశవ్యాప్తంగా 1.6 లక్షల పైగా ఎటిఎంల్లో, 9.45 లక్షల పైగా పాయింట్ ఆఫ్ సేల్స్లో, 10,000 ఆన్లైన్ వేదికల్లో రూపే కార్డుని వినియోగించవచ్చు.