ఇండియాలో చిన్న కంపెనీలు పెద్దవి కావటం కష్టం, ఎందుకంటే!
భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ సహజ లక్షణం. ఇది పారిశ్రామిక రంగంలోనూ కనిపిస్తుంది. కుటీర పరిశ్రమల నుంచి కుబేరుల కంపెనీల వరకు ఎన్నో రంగాల్లో ప్రజలు ఉపాధి కోసం వ్యాపారాలు చేస్తుంటారు. అయితే, ఎంత కష్టపడినా... మన దగ్గర చిన్న కంపెనీలు చిన్నవిగానే ఉండి పోతుండగా, పెద్దవి మాత్రం మరింత పెద్దవిగా అవతరిస్తున్నాయి. కొన్ని కంపెనీలు, వ్యాపారాలు ఇందుకు మినహాయింపు అయినా... మెజారిటీ సంస్థలది ఇదే తంతు. దీనికి కారణం ఏమిటంటే... మన దేశంలో సర్వీస్, ప్రోడక్ట్ విక్రయించినా దాని సొమ్ము కంపెనీ యజమానికి చేరటంలో నెలకొనే తీవ్రమైన జాప్యమే. ఇది ఇటీవల ప్రముఖ ఫైనాన్సియల్ డైలీ ది ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన ఒక సర్వే లో తేలింది. దీంతో చిన్న కంపెనీలు, సంస్థలు సమయానికి వర్కింగ్ కాపిటల్ లేకపోవటంతో సతమతమవుతున్నాయి. పేమెంట్ సైకిల్ లో నెలకొనే జాప్యంతో కొన్ని సార్లు కంపెనీల మనుగడే కష్టతరం అవుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఇక చిన్న కంపెనీలు పెద్దవిగా ఎలా రూపాంతరం చెందుతాయి?
చిన్నవే కానీ...
మైక్రో, స్మాల్, మీడియం ఎంట్రప్రెసెస్ (ఎంఎస్ఎంఈ) లు దేశ ఆర్థిక రంగానికి పట్టుకొమ్మలు. దేశం మొత్తం జీడీపీ లో వీటి వాటా సుమారు 37% ఉంటుంది. మన దేశం నుంచి జరిగే ఎగుమతుల్లో ఈ కంపెనీలదే సింహభాగం. సుమారు 43% వాటా తో చిన్న కంపెనీలు, సంస్థలు దేశ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశానికి పెద్ద ఎత్తున విదేశి మారక నిల్వలను అందిస్తున్నాయి. మొత్తం ఉద్యోగ కల్పనలోనూ వీటిది ప్రత్యేక స్థానమే. ముఖ్యంగా తయారీ రంగంలో ఈ కంపెనీలు సుమారు 70% మందికి ఉపాధి కల్పిస్తూ దేశ ప్రగతి లో కీలక భూమిక పోషిస్తున్నాయి. కానీ వీటి కష్టాలను తీర్చే సరైన ప్రణాళికలు అటు కేంద్రం గానీ ఇటు రాష్ట్రాలు గానీ రూపొందించటం లేదు అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
సగం సగం...: నెలకు రూ.2,000తో చేతికి రూ.50 లక్షలు!
సందేహం లోనే సగం కంపెనీలు...
ఇండియాలోని చిన్న తరహా కంపెనీలు తాము అందించిన వస్తు, సేవలకు సంబంధించిన పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని సందేహంలోనే ఉంటున్నాయి. ఈటీ సర్వే ప్రకారం 100 సంస్థలకు గాను 44 సంస్థలకు పేమెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పటం కష్టం. సుమారు 22% కంపెనీలకు 60 రోజుల్లో పేమెంట్ వస్తుండగా, 10% సంస్థలకు 45 రోజుల్లో లభిస్తోంది. నెల రోజుల్లోపు పేమెంట్ పొందే కంపెనీల శాతం కేవలం 21% గా ఉన్నాయి. దీన్ని బట్టి భారత దేశంలో చిన్న కంపెనీలు మనుగడ సాగించటానికి ఎంతలా పోరాడాలో తెలుస్తోంది.
రూ 1.80 లక్షల కోట్ల బకాయిలు...
ప్రముఖ ఆడిటింగ్ కంపెనీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఒక నివేదిక ప్రకారం 2018-19 లో భారత దేశంలో చిన్న తరహా కంపెనీలకు రావలసిన బకాయిల మొత్తం రూ 1.80 లక్షల కోట్లు అని తేలింది. ఇందులో ప్రభుత్వ రంగ కంపెనీల నుంచే రూ 48,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉండగా... పెద్ద కంపెనీల నుంచి రూ 40,000 కోట్ల మేరకు బకాయిలు పేరుకు పోయాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో బకాయిలు పేరుకు పోతే... ఇక ఈ చిన్న, మధ్య తరహా కంపెనీలు ఎలా తమ వ్యాపారాలను కొనసాగిస్తాయి అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అవి మనుగడ సాగించటమే కష్టం. ఇక పెద్ద కంపెనీలుగా ఆవిర్భవించటం ఇంకెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు అని వారు పేర్కొంటున్నారు.
ప్రైవేటు కంపెనీల ఎగవేతలు ...
చిన్న తరహా కంపెనీలు అందించే సేవలు, వస్తువుల బిల్లులు సకాలంలో చెల్లించటం లో ప్రైవేట్ రంగ కంపెనీలు బాగా వెనుకబడి పోతున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలు కూడా అనేక కారణాలతో బిల్లుల చెల్లింపు లో జాప్యం చేస్తున్నాయి. ఇందుకు ఉన్నతాధికారుల ఇగో కూడా ఒక కారణమని తేలుతోంది. మొత్తం కస్టమర్లలో ప్రైవేటు రంగం వాటా 40% నికి పైగా ఉంటోంది. ప్రభుత్వరంగ కంపెనీలది పావు శాతం వరకు ఉండగా.... ఎంఎన్సి ల వాటా 17% వరకు ఉంది. అయితే, ఎంఎన్సి కంపెనీలు బిల్లుల చెల్లింపులో మెరుగ్గా ఉంటాయని, సమయానుకూలంగా పేమెంట్ చేస్తాయని తేలుతోంది. కాగా... సుమారు అయిదో వంతు బకాయిలు మొండి బకాయిలుగా మారి పోతున్నాయట. వీటిని తిరిగి రాబట్టుకోలేక చిన్న కంపెనీలు రైట్ ఆఫ్ చేసుకొంటున్నాయి. బాకీలు వసూలు చేసుకొనేందుకు మాత్రం స్వయానా కంపెనీల యజమాని వెళితే కొంత వరకు వసూలు అవుతున్నట్లు గుర్తించారు. సో, చిన్న కంపెనీలకు పెద్ద కష్టమొచ్చిందన్నమాట.