అమెజాన్ గో బ్యాక్... ఫ్లిప్కార్ట్ గో బ్యాక్ : రోడ్డెక్కిన వర్తకులు
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వర్తకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇప్పటికే తమ పొట్ట కొడుతున్న ఈ ఆన్లైన్ రిటైలర్లు... ఇకపై ప్రభుత్వమే చేయూతనిస్తే తమను బతకనిస్తాయా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు. ఇంతకూ జరిగిందేమిటి అంటే... ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అదేమిటంటే... దేశంలో ఎంపిక చేసిన కొన్న చిన్న తరహా కంపెనీలను ఫీజు చెల్లించి మరీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో లిస్ట్ చేయాలనీ ప్రభుత్వం భావించటమే. అందుకు అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం భరించేలా నిర్ణయం ఉండబోతోందని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ నిర్ణయాన్ని వర్తకుల సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. చిన్న కంపెనీలకు మేలు చేసే పేరుతొ, దొడ్డి దారిన ఈ కామర్స్ కంపెనీలకు ప్రభుత్వం నిధులు చెల్లించాలని చూస్తోందని ఆరోపించింది.
'
సొంతంగా పెట్టండి...
చిన్న కంపెనీలను ప్రోత్సహించాలని నిజంగా ప్రభుత్వం భావిస్తే... సొంతంగా అదే ఒక ఈ కామర్స్ పోర్టల్ ను ఏర్పాటు చేయాలి. దానిని దేశంలోని అందరు వర్తకులు సమర్థిస్తారు. దేశంలోని సుమారు 7 కోట్ల మంది చిన్న వర్తకులు ఆ పోర్టల్ లో నమోదు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని అని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ అల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్నీ ఎంట్రాకర్ తన కథనంలో వెల్లడించింది. అంతే కానీ ప్రైవేట్ సంస్థలకు నిధులు చెల్లించి మరీ కొన్ని సంస్థలను వారి వెబ్ సైట్ లలో లిస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వర్తకులు నిలదీశారు. వాస్తవానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు తమ వెబ్ సైట్ లో వర్తకులను ఉచితంగానే లిస్ట్ చేసుకొంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం లిస్టింగ్ కు కూడా ఫీజు చెల్లించాలని నిర్ణయిచటంతో ఇదో స్కాం కు దారితీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
క్రోనీ కాపిటలిజం...
నాకది... నీకిది (క్రోనీ కాపిటలిజం) తరహాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయని కూడా వర్తకుల బాడీ ఆరోపించింది. ఆయా కంపెనీలు విదేశి పెట్టుబడులను ఇండియాకు రప్పిస్తున్న పేరిట మళ్ళీ ప్రభుత్వం నుంచి ఫీజుల రూపంలో దండుకోవాలని యోచిస్తున్నాయని అసోసియేషన్ పేర్కొంది. అమెజాన్ వంటి కంపెనీలు పెట్టుబడులు సహా అనేక నిబంధనలను తుంగలో తొక్కుతూ అనేక దేశాల్లో భారీ పెనాల్టీకు గురవుతోందని తెలిపింది. చట్టాలను ఉల్లఘించటంలో వాటికవే సాటి అని ఆరోపణలు గుప్పిచింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద గుమికూడిన వర్తకులు అమెజాన్ గో బ్యాక్... ఫ్లిప్కార్ట్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసినట్లు ఎంట్రాకర్ వెల్లడించింది.
నిరసనలు ఉధృతం...
తమ నిరసనలతో ప్రభుత్వం ఇప్పటికైనా తన మనసు మార్చుకోకపోతే... నిరసనలు మరింత ఉధృతం చేస్తామని సిఏఐటి పేర్కొంది. ఈ అంశం పై తగు నిర్ణయం తీసుకొనేందుకు ఇదే సరైన సమయం. దీనిపై సరైన చర్యలు కూడా తీసుకోవాలి. న్యాయం చేయటంలో జాప్యం చేస్తే.... అన్యాయం చేసినట్టే అవుతుంది అని కాన్ఫెడరేషన్ ఆఫ్ అల్ ఇండియా ట్రేడర్స్ నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే... డిసెంబర్ 27న దేశవ్యాప్తంగా తమతో పాటు, తమ కుటుంబాలు, పిల్లలతో కలిసి ఒక రోజు నిరాహార దీక్ష చేపడతామని కాన్ఫెడరేషన్ వెల్లడించింది.
విరిగిన నడ్డి...
దేశంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ల జోరు పెరిగిన తర్వాత చిన్న వర్తకుల వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో విపరీతమైన ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను తమవైపు తిప్పుకుంటున్నాయి ఈ కామర్స్ కంపెనీలు. రూ వేళ కోట్ల లో నష్టాలు వస్తున్నా లెక్క చేయకుండా ఇవి మాత్రం ఎలాగైనా వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యాలు పెట్టుకున్నాయి. వీటితో పోటీ పడలేక, పెద్ద ఎత్తున ఆఫర్లు ఇవ్వలేక, వ్యాపారాలు నడవక చిన్న వర్తకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే వీరు కొంత కాలంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వానికి కూడా అనేక వినతులు సమర్పిస్తున్నారు. నిబంధనలు పాటించని ఈ కామర్స్ కంపెనీలపై చర్యలు ఉంటాయని ఓవైపు కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ పేర్కొంటున్న సమయంలోనే మరో మంత్రిత్వ శాఖ మాత్రం ఈ కామర్స్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయటం తీసుకోవటం గమనార్హం.