5 రోజుల్లో 2400 పాయింట్లు పతనం, మార్కెట్ నష్టాలకు కారణాలివే
ముంబై: స్టాక్ మార్కెట్లు ఈ వారం భారీ నష్టాల్లో ప్రారంభించాయి. వరుసగా 5వ రోజు నష్టాలను నమోదు చేశాయి. మొదటి నాలుగు రోజుల్లో దాదాపు 1300 పాయింట్లు నష్టపోయిన సూచీలు నేడు ఒక్కరోజే 1100 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. దీంతో ఈ 5 సెషన్లలో సెన్సెక్స్ అకంగా 2400 పాయింట్లు క్షీణించింది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సెన్సెక్స్ 47,000 పాయింట్లకు దిగువన ఉంది. బడ్జెట్ ప్రసంగంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో వరుస సెషన్లలో లాభపడి 52వేల మార్క్ దాటింది. ఆ తర్వాత మార్కెట్కు అనుకూలంగా ఎలాంటి సెంటిమెంట్ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. దీంతో వరుసగా నష్టాలు చవిచూస్తున్నాయి. దీంతో నేడు సెన్సెక్స్ 50వేల పాయింట్ల దిగువన ముగియగా, నిఫ్టీ 14700 పాయింట్ల దిగువకు వచ్చింది.
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, 3.78 లక్షల కోట్ల సంపద ఆవిరి
కరోనా భయం
ఉదయం మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. అప్పటికి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆసియా మార్కెట్లో నష్టపోయాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లు మరింత పతనమయ్యాయి. మరోవైపు, మార్కెట్ బలపడేందుకు బడ్జెట్ తర్వాత ఎలాంటి అంశంలేకుండా పోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఐదు సెషన్లుగా ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపుతున్నారు. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ ఎంత మేర నష్టపోయిందే, ఈ ఒక్కరోజే అంత నష్టపోవడానికి ఇంకా పలు కారణాలు ఉన్నాయి. దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగింది. దీంతో అక్కడ ఆంక్షలు విధించారు. కరోనా కేసుల సంఖ్య పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. ఇన్వెస్టర్లు కరోనా పరిస్థితులను గమనిస్తూ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి.
ఇవి కూడా...
కరోనా కేసులు పెరగడంతో FPI పెట్టుబడులు క్షీణించాయి. గత కొన్ని నెలల్లో రోజువారీ సగటుతో పోలిస్తే ఈ పెట్టుబడులు గత వారంగా తగ్గుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలతో పోల్చినా, జనవరి, ఫిబ్రవరిలో తగ్గాయి. ఇది మార్కెట్ సెంటిమెంటును బలహీనపరిచింది.
ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు కనిపించలేదు. బాండ్స్ మార్కెట్లో అస్థిరత ఈక్విటీ సూచీలను ప్రభావితం చేశాయి. అమెరికాలో బాండ్స్ ఈల్డ్ పెరగడం మార్కెట్లో ద్రవ్యోల్భణ భయాలను కలిగించింది.
రూ.3.78 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ 1,145 పాయింట్లు క్షీణించి 49,744.32 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్ అనంతరం మొదటిసారి 50వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ 306 పాయింట్లు పతనమై 14,675 పాయింట్లకు కుప్పకూలింది. సెన్సెక్స్ 1145 పాయింట్లు పతనమవడంతో ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే రూ.3.78 లక్షల కోట్లు క్షీణించింది. మార్కెట్లు వరుసగా నష్టపోవడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. ఓ సమయంలో రూ.2.05 లక్షల కోట్లు దాటిన మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.2 లక్షల కోట్ల వద్ద ఉంది.