భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: వచ్చేవారంపై ఆశలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ పతనం ఇవ్వాళ కూడా కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను పెంచిన తరువాత ఆరంభమైన ఈ క్షీణత ఇవ్వాళ కూడా కనిపించింది. ఇన్వెస్టర్లకు మరో బ్లాక్ ఫ్రైడేలా మారింది. తొలి గంటలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి. గురువారం నాటి ట్రేడింగ్తో పోల్చి చూస్తే.. ఇవ్వాళ అన్నీ నష్టాల్లో ఉన్నాయి. మైనస్లల్లో పడిపోయాయి.
దాదాపు అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్ల పరిస్థితీ ఇంతే. ఇదే క్షీణత రోజంతా కొనసాగింది. 866.65 పాయింట్ల మేర నష్టపోయింది సెన్సెక్స్. అటు నిఫ్టీలో కూడా 271.40 పాయింట్ల తగ్గుదల నెలకొంది. తొలి గంటలోనే 980.45 పాయింట్ల మేర నష్టపోయింది సెన్సెక్స్. అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్లన్నీ ఆరంభం నుంచే రెడ్ జోన్లో ట్రేడింగ్ అవుతూ వచ్చాయి. సమయం గడుస్తోన్న కొద్దీ షేర్లన్నీ మైనస్లోకి వెళ్లిపోవడం కనిపించింది.
ఒక దశలో వెయ్యి పాయింట్లను అధిగమిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మధ్యాహ్నం తరువాత కొంత కుదుటపడింది మార్కెట్. ఒకట్రెండు సెగ్మెంట్స్కు చెెందిన షేర్లు అప్పర్ సర్కుట్లో ట్రేడ్ అయ్యాయి. అయినప్పటికీ ఇంట్రాడే ట్రేడింగ్ మొత్తం రెడ్ జోన్లో కొనసాగడటం వల్ల సెన్సెక్స్ 866.65 పాయింట్ల మేర నష్టపోయింది. 54,835.58 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసింది. 271.40 పాయింట్ల నష్టపోయింది నిఫ్టీ. 1.63 శాతం మేర నష్టాన్ని మూటగట్టుకుంది. 16,411.30 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడింగ్ క్లోజ్ అయింది.
కాగా- ఇవ్వాళ మొత్తంగా బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో 837 షేర్లు స్వల్పంగా పుంజుకొన్నాయి. వాటి రేట్లు కొంత మేర పెరిగాయి. 2444 షేర్ల ధరలు క్షీణించాయి. 2 నుంచి 5 శాతం వరకు ఈ క్షీణత కనిపించింది. మరో 105 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయవి. కాగా- నిఫ్టీలో ఎక్కువ నష్టపోయిన కంపెనీల జాబితాలో దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీసిమెంట్స్, యూపీఎల్, టాటా మోటార్స్ ఉన్నాయి.
హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, ఓఎన్జీసీల షేర్లు లాభపడ్డాయి. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండైసెస్ అన్నీ 2.2 శాతం మేర నష్టాలను చవి చూశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్.. ఇలా అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్లన్నీ రెడ్ జోన్లో ట్రేడ్ అయ్యాయి. కాగా- ఈ వారం స్టాక్ మార్కెట్ ఇలా నష్టాలతో ముగిసిన నేపథ్యంలో.. వచ్చేవారంపై ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకున్నారు.