సెబి కొత్త నిబంధనలు, టాప్ 1000 కంపెనీలకు డివిడెండ్ పాలసీ తప్పనిసరి
కార్పొరేట్ గవర్నెన్స్, డిస్క్లోజర్లను పటిష్టపరిచే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా టాప్ 1000 లిస్టెడ్ కంపెనీలు డివిడెండ్ పంపిణీ విధానాన్ని తప్పనిసరిగా రూపొందించుకోవాలి. మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా టాప్ 500 కంపెనీలకు తప్పనిసరి డివిడెండ్ పంపిణీ విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇప్పుడు దీనిని టాప్ 1000కు పెంచుతూ తాజా నిబంధనలు తీసుకువచ్చింది.
ఇతర లిస్టెడ్ కంపెనీలు వాటి డివిడెండ్ పంపిణీ విధానాన్ని స్వచ్ఛంధంగా వాటి వెబ్సైట్ ద్వారా ప్రకటించుకోవొచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటును టాప్ 1000 కంపెనీలకు సెబి తప్పనిసరి చేసింది. కమిటీల్లో ఒక స్వతంత్ర డైరెక్టర్తో సహా కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి.
రిస్క్ మేనేజ్మెంట్ పాలసీని రూపొందించడం, అమలును పర్యవేక్షించడం, సమీక్షించడం ఈ కమిటీ పని. మార్చి 31వ తేదీ నాటికి మార్కెట్ క్యాప్ ఆధారంగా టాప్ కంపెనీలను నిర్ధారిస్తారు. ఈ నిబంధనలు మే 5వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు తెలిపింది.