SEBI: కంపెనీలకు సెబీ కొత్త రూల్స్.. ఇన్వెస్టర్లకు ప్రయోజనం.. పెనాల్టీల మోత..
SEBI: స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన దేశీయ కంపెనీలకు సెబీ కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మార్కెట్ క్యాప్ ప్రకారం టాప్-250 కంపెనీలు త్వరలో దేశంలోని ప్రధాన మీడియాలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీలకు సంబంధించి ఏదైనా పుకార్లపై సదరు సంస్థలు తప్పనిసరిగా తిరస్కరించాలి లేదా ధృవీకరించాల్సి ఉంటుంది. సెబీ లిస్టింగ్ నిబంధనల సమీక్షలో ఇటీవల ఈ ప్రతిపాదనను సూచించింది.
ఆరు నెలల కిందట..
ఆరు నెలల క్రితం జియో-ఫేస్బుక్ ఒప్పందంపై ఫైనాన్షియల్ టైమ్స్లో వార్తలు వచ్చిన తర్వాత స్పష్టత ఇవ్వనందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇద్దరు కంపెనీ అధికారులపై సెబీ పెనాల్టీ విధించింది. ఆ తర్వాత సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ పెనాల్టీపై స్టే విధించింది. ఇన్వెస్టర్లకు లిస్టెడ్ కంపెనీలు మీడియా వార్తలపై ధృవీకరణ అవసరాన్ని సెబీ నొక్కి చెబుతోంది.
ఇతర మార్పులు..
టాప్ 250 కంపెనీలకు ఈ కొత్త అవసరాలు కాకుండా.. మరిన్ని ఇతర మార్పులను ప్రతిపాదించింది. ఇది కంపెనీల మెటీరియల్ ఈవెంట్లను బహిర్గతం చేయడాన్ని నిర్ణయిస్తుంది. అయితే వీటికి టర్నోవర్, నికర విలువ, పన్ను తర్వాత లాభం/నష్టాల కలయికను బెంచ్ మార్క్ గా పరిగణించవచ్చని తెలుస్తోంది. సెబీ ప్రకారం మెటీరియలిటీ పాలసీ పరిధిని కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది.
నయా రూల్స్ ప్రకారం..
ప్రస్తుతం కంపెనీలు మెటీరియల్ ఈవెంట్లను 24 గంటల్లోగా వెల్లడించాలి. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో వేగంగా సమాచారం అందిచాల్సిన అవసరం ఉన్నందున ఈ కాలాన్ని 12 గంటలకు తగ్గించాలని సెబీ పేర్కొంది. బోర్డు సమావేశాల సమాచారానికి దీనిని 30 నిమిషాలుగా ఉండాలని ప్రతిపాదించింది. ఇలా రేటింగ్స్, ఓటింగ్ హక్కులకు సంబంధించిన అన్ని మార్పులను కంపెనీలు ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి ఉంటుంది. దీనిపై నవంబర్ 27లోగా తమ అభిప్రాయాన్ని సమర్పించాలని రెగ్యులేటర్ వాటాదారులను కోరింది.
వెల్లడించాలి..
రెగ్యులేటరీ, చట్టబద్ధమైన, ఎన్ఫోర్స్మెంట్ లేదా న్యాయపరమైన అధికారం ద్వారా ఆర్డర్లు లేదా చర్యలను తప్పక వెల్లడించాలని కంపెనీలకు మార్గదర్శకాలు నిర్దేశించబడతాయి. కొన్ని కమ్యూనికేషన్ల గోప్య స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలు రూపొందించబడతాయని సెబీ పేర్కొంది.