భారత వృద్ధి రేటు అంచనాల్లో ఎస్ అండ్ పీ కోత, 7.3% తగ్గింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని మొదట అంచనా వేసింది. ఇప్పుడు దీనిని 7.3 శాతానికి కుదించింది. ద్రవ్యోల్భణం పెరుగుదల, అంచనాలకు మించి ఎక్కువ కాలం ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగడమే ప్రధాన కారణమని ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది.
ద్రవ్యోల్భణం దీర్ఘకాలం అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని తమ నివేదికలో ఎస్ అండ్ పీ తెలిపింది. దీంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవలసి ఉంటుంది. ఇది ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని, ఇది ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్భణం 6.9 శాతంగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక భారత వృద్ధి రేటు అంచనాల్లో వివిధ అంతర్జాతీయ సంస్థలు కోత పెట్టాయి. ప్రపంచ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 8.7 శాతం నుండి 8 శాతానికి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 9 శాతం నుండి 8.2 శాతానికి, ఆర్బీఐ 7.8 శాతం నుండి 7.2 శాతానికి తగ్గించింది.