లక్నో మున్సిపల్ కార్పొరేషన్ రికార్డు: బీఎస్ఈలో లిస్టింగ్: బాండ్లు జారీ: గంట మోగించిన యోగి
ముంబై: లక్నో మున్సిపల్ కార్పొరేషన్ రికార్డు సృష్టించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అడుగు మోపింది. బీఎస్ఈ లిస్టింగ్లో చోటు సంపాదించుకుంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొద్దిసేపటి కిందటే ఈ బాండ్లను జారీ చేయడాన్ని ప్రారంభించారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో సంప్రదాయబద్ధంగా గంటను మోగించి ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించారు. బాండ్లను జారీ చేయడం ద్వారా 200 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని ఉత్తర ప్రదేశ్ మున్సిపల్ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. బాండ్ల రూపంలో ఈ మొత్తాన్ని సేకరించబోతోంది.
యూపీ స్థానిక సంస్థల పరిపాలనలో సువర్ణ అధ్యాయం..
ఉత్తర ప్రదేశ్లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఓ స్థానిక సంస్థ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ కావడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి యోగి ఆదిత్యనాథ్ ఈ తెల్లవారు జామున ముంబైకి వచ్చారు. సిటీ హోటల్లో బస చేశారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన బీఎస్ఈకి చేరుకున్నారు. బాండ్ల జారీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ సరికొత్త సువర్ణాధ్యాయం ఆరంభమైందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో సుపరిపాలనను అందించడానికి, మౌలిక వసతులను మరింత మెరుగుపర్చడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
జనంలో ఆసక్తి..
లక్నో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అజయ్ కుమార్ ద్వివేదీ మాట్లాడుతూ.. తాము బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి అయినప్పటికీ.. ఆరంభంలోనే అంచనాలకు మించిన డిమాండ్ లభిస్తోందని అన్నారు. పెట్టుబడిదారులు ఆ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం స్పష్టమైందని చెప్పారు. చారిత్రాత్మకమైన బీఎస్ఈ బాండ్ల ప్లాట్ఫాంపైకి అడుగు మోపడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. మున్ముందు మరిన్ని బాండ్లను జారీ చేయడానికి అవకాశాన్ని కల్పించినట్టయిందని పేర్కొన్నారు.
తొలి మున్సిపాలిటీగా..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ కుమార్ చౌహాన్ మాట్లాడుతూ.. బాండ్ల ద్వారా 200 కోట్ల రూపాయలను సేకరించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి బీఎస్ఈ బాండ్ల ప్లాట్ఫామ్పై కాలు మోపిన తొలి కార్పొరేషన్గా లక్నో మున్సిపాలిటీ రికార్డు నెలకొల్పిందని చెప్పారు. ప్రైవేటు సంస్థలే కాకుండా.. ప్రభుత్వానికి సంబంధించిన స్థానిక సంస్థలు కూడా బీఎస్ఈ బాండ్లలో లిస్టింగ్ కావడం ఆనందంగా ఉందని, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఇదొక చక్కటి వేదికగా మారిందని అన్నారు.
పన్నుల రూపేణా ఆదాయం స్తంభించడంతో..
బాండ్లను జారీ చేయడం ద్వారా 200 కోట్ల రూపాయలను సేకరించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్డౌన్ వల్ల పన్నుల రూపంలో స్థానిక సంస్థలకు రావాల్సిన ఆదాయం స్తంభించిపోయింది. పన్నుల రాబడి అంతంత మాత్రమే. వాటికి భారీగా నిధులను కేటాయించడం కూడా ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. అదే సమయంలో- మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాండ్లను జారీ చేయాలని నిర్ణయించుకుంది. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ పేరు మీద బాండ్లను జారీ చేసింది. దీనిద్వారా వచ్చే 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలను సమకూర్చాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.