5 రెట్లు పెరిగిన షేర్ ధర: రిలయన్స్ అదరగొట్టింది, లిస్టెడ్ కంపెనీల్లో 10% వాటా
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దుమ్మురేపుతోంది. గత కొద్ది నెలల కాలంలోనే ఈ కంపనీ షేర్లు భారీగా ఎగిశాయి. మార్చి 23న రూ.900 లోపు ఉన్న షేర్ ధర ఆ తర్వాత పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ తదితర కారణాలతో ఏకంగా రూ.2,150 పైకి చేరుకుంది. ఓ సమయంలో రూ.2,200 సమీపానికి చేరుకుంది. ఈ రోజు (జూలై 27, సోమవారం) రూ.2,150 వద్ద ముగిసింది. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ను దాటి ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు సంస్థగా ఆవిర్భవించింది. తాజాగా మరో ఘనత సాధించింది.
74 లక్షల షేర్లు విక్రయించిన ఆదిత్యపురి, HDFC షేర్లు ఢమాల్! బ్యాంకు ఏం చెప్పిందంటే..
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో రిలయన్స్ వాటా 10 శాతం
గత రెండేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజురోజుకు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకుంటూ భారత ఈక్విటీ మార్కెట్లో ఆధిపత్యం చలాయిస్తోంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఈ రోజు ఓ దశలో రూ.14.38 లక్షల కోట్లు దాటింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో రిలయన్స్ వాటానే దాదాపు 10 శాతంగా ఉంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ రూ.147.23 లక్షల కోట్లు కాగా, ఇందులో రిలయన్స్ది రూ.14 లక్షల కోట్లు దాటి 9.8 శాతంగా నిలిచింది.
5 రెట్లు పెరిగిన రిలయన్స్ మార్కెట్ క్యాప్
2020 క్యాలెండర్ ఇయర్లో రిలయన్స్ మార్కెట్ క్యాప్ 49.8 శాతం లేదా రూ.4.77 లక్షల కోట్లు పెరిగింది. డిసెంబర్ 31, 2019న 9.59 లక్షల కోట్లుగా ఉంది. కరోనా నేపథ్యంలో ఈ క్యాలెండర్ ఇయర్లో బీఎస్ఈ సెన్సెక్స్లో లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ పడిపోయింది. 2014 డిసెంబర్ 31వ తేదీ నాటికి బీఎస్ఈ (98.36 ట్రిలియన్లు) లిస్టెడ్ కంపెనీల్లో రిలయన్స్ ఎం-క్యాప్ 2.9 శాతంగా ఉంది. అప్పడు 2.8 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ ఎం-క్యాప్ దాదాపు 5 రెట్లు పెరిగి ఇప్పుడు రూ.14 లక్షల కోట్లు దాటింది. అప్పుడు షేర్ ధర రూ.450 లోపు ఉంది. అంటే ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు ఐదు రెట్ల రిటర్న్స్ వచ్చినట్లు. అయితే అంతకుముందు రూ.700దాటిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుండి స్టాక్స్ రెండు రెట్లకు పైగా పెరిగాయి. సెన్సెక్స్ కౌంటర్ ఇండెక్స్లో 16.7 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో 10.8 శాతంగా ఉంది. ఇటీవల రిలయన్స్ టార్గెట్ ధరను రూ.2,317కు పెంచారు నిపుణులు.
గత 8 ఏళ్లలో రిలయన్స్ ఎం-క్యాప్ పెరుగుదల
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండేళ్లలో రెండింతలకు పెరిగింది. 2013 డిసెంబర్ నుండి రిలయన్స్ ఎం-క్యాప్, బిఎస్ఈ క్యాపిటలైజేషన్లో వాటా భారీగా పెరిగింది. ఈ రోజు రిలయన్స్ షేర్ ధర భారీగా ఎగిసి మళ్లీ పడిపోయింది. ఓ సమయంలో రూ.2,188 దాటింది. చివరకు రూ.2,155 వద్ద ముగిసింది.
- 2013లో రూ.2,89,132 కోట్లతో 4.1 శాతం వాటా,
- 2014లో రూ.2,88,293 కోట్లతో 2.9 శాతం వాటా,
- 2015లో రూ.3,28,003 కోట్లతో 3.3 శాతం వాటా,
- 2016లో రూ.3,50,341 కోట్లతో 3.3 శాతం వాటా,
- 2017లో రూ.5,83,347 కోట్లతో 3.8 శాతం వాటా,
- 2018లో రూ.7,10,585 కోట్లతో 4.9 శాతం వాటా,
- 2019లో రూ.9,59,819 కోట్లతో 6.2 శాతం వాటా,
- 2020లో ఇప్పటి వరకు రూ.14,37,621 కోట్లు, 9.8 శాతం వాటా (మధ్యాహ్నం సమయానికి)