IPO News: అదరగొట్టిన ఐపీవో.. లిస్టింగ్ లోనే లాభాలు.. షేర్లు వచ్చినోళ్లకు పండగే..!
IPO News: 2023లో మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలి ఐపీవోగా రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ నిలిచింది. ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 10% ప్రీమియంతో జాబితా చేయబడ్డాయి. దీంతో 2023లో ఐపీవోల మార్కెట్ ఒక శుభారంభాన్ని నమోదు చేసింది.
మార్కెట్ ఓలటాలిటీ..
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి అస్థిరతల మధ్య స్టాక్ మంచి ప్రీమియం ధరకు లిస్ట్ కావటం మంచి సూచికగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. స్టాక్ ఇష్యూ ధర రూ.94 ఉండగా దలాల్ స్ట్రీట్లో మంచి అరంగేట్రం చేశాయి. అలా ఎన్ఎస్ఈలో 9.57 శాతం పెరిగి రూ.103 వద్ద స్టాక్ లిస్ట్ అయ్యింది. అలాగే బీఎస్ఈ సూచీలో 5.6 శాతం వృద్ధితో రూ.99.30 వద్ద షేర్ ట్రేడింగ్ ప్రారంభించింది.
గ్రేమార్కెట్లో..
ఈ ఐపీవో గ్రే మార్కెట్లో తక్కువ ప్రీమియం కలిగి ఉంది. దీంతో విశ్లేషకుల అంచనాలను అధిగమించి స్టాక్ మార్కెట్లో మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. వారు స్టాక్ ఫ్లాట్ గా మార్కెట్లోకి అడుగుపెడుతుందని అంచనా వేశారు. కానీ వాస్తవానికి షేర్ మంచి ప్రీమియం రేటుకు మార్కెట్లోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 23-27 మధ్యకాలంలో ఇష్యూ కేవలం 53 శాతం మాత్రమే సబ్స్క్రైబ్ చేయబడింది. కానీ కంపెనీ ఆఫర్-ఫర్-సేల్ భాగాన్ని భారీగా తగ్గించిన తర్వాత IPO ముగిసింది.
మెుత్తం క్యాపిటల్..
కంపెనీ తన ఐపీవో ద్వారా రూ.51.27 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేసింది. దీనికి తోడు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో మరో రూ.199.5 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. ఈ రెండు మార్గాల ద్వారా కంపెనీ మెుత్తంగా రూ.250.76 కోట్లను సమీకరించింది. అయితే దీనికి ముందు కంపెనీ తొలుత రూ.388 కోట్లను మార్కెట్ నుంచి రెయిజ్ చేయాలని నిర్ణయించింది. అప్పట్లో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.328 కోట్లు, తాజా ఇష్యూ ద్వారా రూ.60 కోట్లను సమీకరించాలని కంపెనీ భావించింది. కానీ మధ్యలో నిర్ణయాన్ని మార్చుకుని ఐపీవోనూ పూర్తి చేసింది.
కంపెనీ వ్యాపారం..
రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ 2005లో స్థాపించబడింది. ఇది దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యవస్థీకృత రిటైల్, ఈ-కామర్స్ కంపెనీలకు రిటైల్ నగదు నిర్వహణ సేవలను అందిస్తోంది. కంపెనీ ఒక్కో షేరు ధరను ఐపీవోలో రూ.94-99గా నిర్ణయించింది. ఈ ఐపీవోను విజయవంతం చేయటంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ది హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పాల్గొన్నాయి.
బ్రోకరేజ్ ఏం చెప్పింది..
రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీవో పెట్టుబడి విషయంలో స్టాక్బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌదరి మాత్రం దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచించారు. అలాగే షేర్లు ఎలాట్ అయినవారు మార్కెట్లో మంచి అవకాశాల కోసం వెతకాలని సూచించారు. హేమ్ సెక్యూరిటీస్లో ఫండ్ మేనేజర్, PMS హెడ్ మోహిత్ నిగమ్ మాత్రం కంపెనీ భవిష్యత్తు అవకాశాల సమాచారాన్ని అన్వేషించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.