పీఎంఈజీపీ కింద 5,22,496 మందికి ఉపాధి అవకాశాలు
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (PMEGP) కింద ఇప్పటి వరకు 65,312 కొత్త మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు అయ్యాయి. వీటి వల్ల 5,22,496 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. వీటి కోసం రూ.1929.83 కోట్ల విలువైన మార్జిన్ మనీ సబ్సిడీ వినియోగించారు. ఎంఎస్ఎంఈల కోసం వడ్డీ ఉపసంహరణ పథకం కింద జీఎస్టీ నమోదు చేసుకున్న అన్ని ఎంఎస్ఎంఈలకు 2 శాతం వడ్డీ ఉపసంహరణకు (కొత్త లేదా ఇంక్రిమెంటల్ లోన్స్) 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లు కేటాయించారు.
హౌసింగ్పై వడ్డీ అదనంగా తగ్గింపు
2020 మార్చి 31వ తేదీ వరకు రూ.45 లక్షల విలువ కలిగిన హౌస్ కొనుగోలుపై తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీని అదనంగా రూ.1,50,000 తగ్గించాలని ప్రతిపాదించారు.
పెన్షనర్ల కోసం ఇంటిగ్రేటెడ్ గ్రీవాన్స్ సెల్, కాల్ సెంటర్
పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గ్రీవాన్స్ సెల్, కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీనిని 20 జూన్ 2019న ఏర్పాటు చేసింది.
స్మార్ట్ మీటరింగ్
వినియోగదారుల ప్రీపేయిడ్ మోడ్ మీటర్లను అన్నింటిని స్మార్ట్ మీటర్లుగా మార్చాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్, ఎన్డీఎంసీ- ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే 9 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు.