ఆ పరిశ్రమలకు ఆక్సిజన్ కష్టాలు .. దేశంలో కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత ఎఫెక్ట్
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా నెలకొన్న తాజా పరిస్థితులు మరోమారు పారిశ్రామిక రంగాన్ని భయపెడుతున్నాయి. కరోనా కేసులు పెరుగుదలతో ద్రవ రూప ఆక్సిజన్ వినియోగం ఆసుపత్రులలో విపరీతంగా పెరుగుతుంది . ఊహించని విధంగా పెరిగిన కరోనా కేసులతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నెలకొంది . ఈ ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం పరిశ్రమల ఆక్సిజన్ వాడకంపై నిషేధం విధించి , ఆ ఆక్సిజన్ ను వివిధ రాష్ట్రాలకు కరోనా బాధితుల కోసం తరలిస్తుంది. ఇక ఈ పరిణామాలు పలు పారిశ్రామిక సంస్థలకు ఇబ్బందిగా మారింది.
మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమొబైల్స్ రంగాలకు ఆక్సిజన్ కష్టాలు
ఆక్సిజన్ వాడకంపై పరిశ్రమలకు నిషేధం విధించటం మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమొబైల్స్ రంగాలకు మరో మారు ప్రతికూల పరిస్థితులను కలుగజేస్తుంది. పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న ఆక్సిజన్ ను , ప్రజల వైద్య అవసరాల కోసం కేటాయించాల్సి రావడం చిన్న కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇక ఇదే విషయాన్ని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుదల కారణంగా మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలలో కంపెనీలపై దీని ప్రభావం పడుతుంది.
ఆక్సిజన్ వాడకం నిషేధంతో కంపెనీలపై ప్రభావం పడుతున్నట్లుగా పేర్కొన్న క్రిసిల్
ముఖ్యంగా మహారాష్ట్ర, న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ , రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కంపెనీలపై ప్రభావం పడుతున్నట్లుగా క్రిసిల్ పేర్కొంది. పారిశ్రామిక వినియోగానికి ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరా నిషేధించడంతో మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటో మొబైల్స్, విడిభాగాలు, షిప్ బ్రేకింగ్, ఇంజనీరింగ్ వంటి రంగాలలో చిన్న, మధ్యస్థాయి కంపెనీలు ప్రభావితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. వెల్డింగ్, కటింగ్ వంటి పనులకు గ్యాస్ అవసరం ఉంది. ప్రస్తుతం 6 నుంచి 8 వారాల పాటు పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
సుదీర్ఘకాలం పరిశ్రమలకు ఆక్సిజన్ నిషేదం కొనసాగితే తీవ్ర నష్టం
అయితే సుదీర్ఘకాలం పరిశ్రమలకు ఆక్సిజన్ నిషేదం కొనసాగితే పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని గౌతమ్ షాహీ పేర్కొన్నారు. సాధారణంగా ఆక్సిజన్ రెండు రకాలుగా వినియోగిస్తారని తెలుస్తుంది ఆన్ సైట్ వినియోగానికి, మర్చంట్ సేల్స్ క్రింద వ్యాపార అవసరాల వినియోగానికి విక్రయించడం కోసం దేశీయంగా ఉత్పత్తి జరుగుతుంది . మర్చంట్ సేల్స్ విభాగం కింద వచ్చే ఆక్సిజన్ హెల్త్ కేర్ రంగం వినియోగించేది కేవలం 10 శాతం మాత్రమే , కానీ ప్రస్తుతం హెల్త్ కేర్ రంగానికి ఆక్సిజన్ వినియోగం విపరీతంగా పెరిగింది.
గతేడాది కష్టాల నుండి బయటపడకముందే దెబ్బ మీద దెబ్బ
కరోనా ఉదృతి నేపథ్యంలో ఆక్సిజన్ వినియోగం ప్రజల ప్రాణాలను రక్షించడానికి అవసరమవుతున్న నేపథ్యంలో పరిశ్రమల వాడకంపై నిషేధం విధించడంతో దాని ప్రభావం పరిశ్రమల ఆదాయంపై పడుతోంది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ దెబ్బతో నష్టాలను చవి చూసిన సంస్థలు ఈ ఏడాది కాస్త ఊపిరి తీసుకోవాలని భావిస్తే మళ్ళీ దాపురించిన కరోనా సెకండ్ వేవ్ పరిశ్రమలకు ఇబ్బంది కలిగిస్తుంది . ఆక్సిజన్ తప్పని సరిగా అవసరం ఉన్న వివిధ కంపెనీలకు ఆక్సిజన్ మళ్లింపు పనిని ప్రభావితం చెయ్యటమే కాకుండా ,పరిశ్రమ ఆర్ధిక స్థితిని సైతం ప్రభావితం చేస్తుంది.