భారీగా ఉద్యోగాల కోత, శాలరీ కోత: కానీ ఇది తాత్కాలికమే.. త్వరలో కొత్త నియామకాలు షురూ!
దేశంలో సంఘటిత రంగంలోని ప్రయివేటు సంస్థలలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవడం, వేతన కోతలు ఉంటాయని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఉద్యోగాల తొలగింత, శాలరీల్లో కోత విధించడంపై కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మైహైరింగ్ క్లబ్ డాట్ కామ్, సర్కారీ నౌకరీ డాట్ ఇన్ఫో 'లేఆఫ్ సర్వే 2020'లో తేలింది. 32 శాతం కంపెనీలు ఉద్యోగుల కోత లేదని, అలాగే శాలరీ కోత లేదని తెలిపాయి.
మీకిదే చివరి వర్కింగ్ డే: 'జూమ్'లో ఉబెర్ షాక్, ఇలాంటి కాన్ఫరెన్స్లో ఉండలేం.. ఉన్నతాధికారి
68% కంపెనీల నుండి ఉద్యోగులకు షాక్
ఈ సర్వే ప్రకారం 68% కంపెనీలు ఉద్యోగుల తొలగింతను ప్రారంభించాయి లేదా ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా చేసిన ఈ సర్వేలో 11 రంగాల నుండి 25 ప్రధాన నగరాలలోని 1,124 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సర్వేను మే 1వ తేదీ నుండి మే 10వ తేదీ మధ్య నిర్వహించారు.
వేతనాల తగ్గింపుకు 73% కంపెనీలు రెడీ
సర్వే చేసిన సంస్థల్లో 73% కంపెనీలు ఉద్యోగుల వేతనాలు తగ్గించేందుకు సిద్ధమయ్యారు. 57% కంపెనీలు ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు తెలిపాయి. 21% కంపెనీలు శాశ్వత ప్రాతిపదికన కనీసం రెండేళ్ల కాలానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపాయి.
32% కంపెనీల్లో వేతన కోత లేదు.. ఉద్యోగాల కోత లేదు
మరో ఆసక్తికర విషయం ఏమంటే 32% కంపెనీలు ఎలాంటి ఉద్యోగాల కోత లేదా ఎలాంటి వేతన కోత లేదని వెల్లడించాయి. ఏ ఉధ్యోగులను అయితే కొనసాగించాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయో.. వారికి వేతన కోతలు విధిస్తున్నాయని, మిగతా వారిని ఇళ్లకు పంపిస్తున్నాయని సర్వేలలో వెల్లడైంది.
ఇది తాత్కాలికమే.. ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు వస్తాయ్
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు.. అన్ని కంపెనీలు కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాయని, అందుకే తొలగింపు లేదా వేతన కోతకు దారి తీస్తోందని, కంపెనీలు తాము నిలుపుకోవాలనుకున్న ఉద్యోగుల వేతనాల్లో మాత్రం తగ్గింపు ప్రకటిస్తున్నాయని సర్వేలు వెల్లడించాయి. అయితే, ఈ సంక్షోభం తాత్కాలికమేనని, కంపెనీలు ఈ ఉపద్రవం నుండి బయటకు వచ్చాక ఉద్యోగ, ఉపాది కల్పనలు ఉంటాయని, నియామకాల ప్రారంభం తప్పనిసరిగా ఉంటుందని మైహైరింగ్ క్లబ్ డాట్ కామ్, సర్కారీ నౌకరీ డాట్ ఇన్ఫో సీఈవో రాజేష్ కుమార్ తెలిపారు.
ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం
విమానయానం, హాస్పిటాలిటీ, ట్రావెల్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఆటోమొబైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు తగ్గిపోతాయని, దీని నుండి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నారు.
ప్రధాన కారణాలివే..
కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగాల కోత, వేతన కోత, వ్యాపారాలు పతనం అవుతున్నాయి. ఈ కారణాల వల్ల ప్రజలు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ఇది డిమాండ్ తగ్గడానికి కారణంగా మారింది. పై మూడు అంశాలు ఖర్చులు తగ్గడానికి ప్రధాన కారణమని చెప్పారు.
ఉద్యోగాల తొలగింపు ఏ రంగంలో ఎంత, ఎక్స్పీరియన్స్..
సర్వే ప్రకారం ఉద్యోగాల తొలగింత ఏ రంగంలో ఎంత ఉందంటే..
రిటైల్ అండ్ ఎఫ్ఎంసీజీ రంగం - 49%
ఆతిథ్య, విమానయాన, ట్రావెల్ రంగాలు - 48%
ఆటోమొబైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజినీరింగ్ - 41%
రియల్ ఎస్టేట్ - 39%
పవర్ సెక్టార్ 38%
ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే.. 6 ఏళ్ల - 10 ఏళ్ల అనుభవం 31%,
ఏడాది నుండి 5 ఏళ్ల అనుభవం 18%,
11 ఏళ్ల నుండి 15 ఏళ్ళ అనుభవం 30%,
15 ఏళ్ళ కంటే ఎక్కువ అనుభవం 21% మేర తొలగిస్తున్నట్లు నివేదిక చెబుతోంది.