గుడ్ న్యూస్: నగదు రూపంలోనూ ఫాస్టాగ్ రీఛార్జ్!
మీరు నేషనల్ హైవేస్ పైన ప్రయాణం చేస్తున్నారా? ఫాస్టాగ్ వాడుతున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త! ఫాస్టాగ్ రీఛార్జ్ కోసం ఇకపై నగదు (క్యాష్) కూడా వాడొచ్చు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ ) ఒక నిర్ణయం తీసుకుందట. త్వరలోనే ఈ విధానం అందరు వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకువస్తారట. ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు, అలాగే టోల్ వసూళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ను తెరపైకి తీసుకొచ్చింది. మొత్తం టోల్ కలెక్షన్స్ ను ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసి) విధానం లోకి మార్చారు.
ఫాస్టాగ్కు సంబంధించి మరిన్ని వార్తలు
ఈ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కు అప్పగించారు. 2019 డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ వాడకాన్ని తప్పనిసరి చేశారు. మొత్తం టోల్ గేట్ల లో ఇరు వైపుల కేవలం ఒక్కో గేటు మాత్రమే నగదు రూపంలో చెల్లించేందుకు అనుమతిస్తున్నారు. మిగితా గేట్లన్నీ ఫాస్టాగ్ వాడుతున్నవారిని అనుమతిస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది ఫాస్టాగ్ తీసుకోకపోవడంతో టోల్ గేట్ల వద్ద హైబ్రిడ్ గేట్ల ను ఏర్పాటు చేసారు. అంటే ఒకే లేన్ లో ఫాస్టాగ్ వాహనాలు, అలాగే ఫాస్టాగ్ లేని వాహనాలు కూడా వెళ్ళవచ్చు. కానీ ఫాస్టాగ్ లేని వాహనాలు రెట్టింపు టోల్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది.
క్యాష్ తో ముందుకు...
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఫాస్టాగ్ ను క్యాష్ తో రీఛార్జ్ చేసుకుని, టోల్ గేట్ల వద్ద వాహనాలు సాఫీగా సాగిపోవచ్చు. ప్రస్తుతం ఫాస్టాగ్ ను కేవలం ఆన్లైన్ రీఛార్జ్ విధానంలో మాత్రమే రీఛార్జ్ చేసుకునే సదుపాయం ఉంది. దీంతో చాలా మంది ఇంకా దీనికి అలవాటు పడలేదు. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ అందులో టోల్ చెల్లింపులకు సరిపడే నగదు లేకపోవటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీనిని గుర్తించిన ఎన్ హెచ్ ఏ ఐ క్యాష్ రీఛార్జ్ ఆప్షన్ ను తెరపైకి తీసుకొచ్చింది.
ఇంకా 60% మే ...
ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసి సరిగ్గా ఒక నెల రోజులు అవుతున్నా... దానిని వినియోగిస్తున్న వారి సంఖ్య ఆశించిన మేరకు పెరగలేదని ఎన్ హెచ్ ఏ ఐ గుర్తించింది. ప్రస్తుతం కేవలం 60% వాహనదారులు మాత్రమే ఫాస్టాగ్ ను వినియోగిస్తున్నారు. మరో 40 % మంది ఇంకా నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన కొత్తలో దాని వినియోగం విపరీతంగా పెరిగినప్పటికీ... మెల్లగా ఆ స్పీడ్ తగ్గినట్లు గుర్తించారు. అందుకే అందరికీ ప్రయోజనం చేకూర్చేలా ఎవరికీ ఇబ్బంది లేకుండా క్యాష్ ను కూడా అనుమతించాలని నిర్ణయించారు.
కోటి దాటిన ఫాస్టాగ్ లు...
దేశంలోని మొత్తం టోల్ గేట్ల లో దాదాపు 75% టోల్ గేట్ల వద్ద ఈటీసీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అంటే సుమారు 535 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది. ఈటీసీ లేన్ లో ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించే వారికి డబుల్ టోల్ ఫీజ్ వసూలు చేస్తారు. అందుకే ఫాస్టాగ్ తీసుకునేందుకు వాహనదారులు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు 1.26 కోట్ల వాహనాలకు ఫాస్టాగ్ ను వినియోగిస్తున్నట్లు ఎన్ హెచ్ ఏ ఐ గుర్తించింది. నగదు రీఛార్జ్ సౌకర్యం ఉంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.