లిస్టెడ్ కంటే అన్లిస్టెడ్ రిటర్న్స్ ఎక్కువ: రాకేష్ ఝున్ఝున్వాలా
తనకు లిస్టెడ్ కంపెనీల్లోని పెట్టుబడుల ద్వారా వచ్చిన రిటర్న్స్ కంటే అన్-లిస్టెడ్ కంపెనీల ద్వారా వచ్చినవే ఎక్కువ అని భారత ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా అన్నారు. భారత ఆర్థిక రికవరీ క్రమంగా పుంజుకుంటోందన్నారు. ద్రవ్యోల్భణ ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేట్లు పెంచదని అభిప్రాయపడ్డారు. కమోడిటీ స్టాక్స్ను కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్ సాధించవచ్చునని చెప్పారు. గత దశాబ్ద కాలంగా తాను ప్రయివేటు కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నానని చెప్పారు.
అవే అధిక రిటర్న్స్
స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల్లో తనకున్న వాటాల కంటే నమోదు కాని కంపెనీల్లోని వాటాలు అధిక రిటర్న్స్ ఇచ్చాయని చెప్పిన రాకేష్ ఝున్ఝున్వాలా... కొన్ని కంపెనీల్లో 10 ఏళ్లు - 12 ఏళ్ల నుండి తన వాటాలు కొనసాగుతున్నాయన్నారు. ఈక్విటీ మార్కెట్ల ఆర్జనపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. జన స్మాల్ ఫైనాన్స్ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ను ఆశ్రిత పెట్టుబడుదారుల దేశంగా అభివర్ణించవద్దని రాకేష్ ఝన్ఝున్వాలా అన్నారు. అసమాన సమాజంగా పిలిచే మన దేశంలో కొత్త ఆశయాలతో వస్తున్న వారే సంపదను సృష్టిస్తున్నారన్నారు. ఇందుకు ఓ భారతీయుడిగా గర్విస్తున్నాన్నారు.
ద్రవ్యలభ్యత
ద్రవ్య లభ్యతే దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు కారణమనే వాదనను కొట్టివేశారు. భారత కంపెనీలకు ఆర్జించే సామర్థ్యం ఉందని, అదే మార్కెట్లను ముందుకు నడుపుతోందని చెప్పారు. రెండు, మూడో త్రైమాసికాల్లో దేశీయ కంపెనీల ఆర్థిక ఫలితాలు అందుకు నిదర్శనం అన్నారు. గత సంవత్సరం కాలంలోనే మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయన్నారు. అమెరికా సహా ఇతర దేశాల్లో ద్రవ్యలభ్యత కారణంగా దేశీయ మార్కెట్లు కేవలం 10 శాతం మాత్రమే ఎగిసి ఉంటాయని చెప్పారు.
సూచీలు డబుల్
ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఓసారి మార్కెట్ సూచీలు డబుల్ అవుతాయని రాకేష్ ఝున్ఝున్ వాలా చెప్పారు. వచ్చే పాతికేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందన్నారు. దేశ తలసరి ఆదాయం చైనాను మించిపోతుందని అంచనా వేశారు. వచ్చే అయిదేళ్లలో దేశ వృద్ధి రేటు రెండంకెలకు చేరుకుంటుందని, రెండు దశాబ్దాల పాటు అది అలాగే కొనసాగుతుందని చెప్పారు.