RBI ప్రకటించిన రూ.1 లక్ష కోట్ల నిధులతో ఎవరికి ప్రయోజనమంటే?
కరోనా మహమ్మారి కారణంగా ఆర్బీఐ గత శుక్రవారం కీలక ప్రకటనలు చేసింది. అదే విధంగా కొన్ని నిధులు కూడా ప్రకటించింది. రెండోసారి ఆర్బీఐ ప్రకటించిన నిర్దేశిత దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ (TLTRO) దేశంలోని MSMEలకు కలిసి రానుంది. ఈ చర్యల్లో భాగంగా ఆర్బీఐ.. బ్యాంకులకు రూ.50,000 కోట్లు TLTRO కింద సమకూరుస్తుంది. మరో రూ.50,000 కోట్లు నాబార్డ్, NHB వంటి రీఫైనాన్స్ సంస్థలకు సమకూరుస్తుంది.
కరోనా దెబ్బతో ఐటీ కంపెనీల సరికొత్త ప్రయోగం, రియల్ ఎస్టేట్కు దెబ్బ?
అలా నిధుల కొరత తీరుతుంది
ఈ రుణాల కాలపరిమితి మూడు సంవత్సరాలు. రెపో రేటుకే ఆర్బీఐ ఈ రుణాలు అందిస్తుంది. బ్యాంకులకు అందే రూ.50,000 కోట్ల TLTRO నిధుల్లో కనీసం సగం నిధులను పెద్దగా పరపతి రేటింగ్ లేని NBFC, IFI, HFCల రుణ పత్రాల్లో బ్యాంకులు మదుపు చేయాలి. లేదంటే ఆర్బీఐ మిగతా నిధులపై రివర్స్ రెపో రేటు కంటే 2 శాతం అధిక వడ్డీ రేటును వసూలు చేస్తుంది. దీంతో NBFCల నుంచి SMSEలకు రుణాలు పెరిగి నిధుల కొరత తీరే అవకాశముంటుంది.
MSMEలకు ఉపశమనం
2018లో ఐఎల్ఆండ్ఎఫ్ఎస్లో భారీ అవకతవకలు బయటపడ్డాక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్య లభ్యత తగ్గింది. ఆర్బీఐ తాజా ఉద్దీపనతో కాస్త ఉపశమనం లభించింది. రూ.1 లక్ష కోట్ల ఉద్దీపనకు ఆర్బీఐ మొగ్గు చూపినట్లుగా విశ్లేషకుల అంచనా. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో ఆర్బీఐ కొత్త TLTRO కింద రూ.50,000 కోట్లను వ్యవస్థలోకి జొప్పించింది. ఇందులో 50 శాతం మొత్తాన్ని NBFC, IFI, HFCలకు రుణాలుగా అందించడం తప్పనిసరి చేసింది. మరో రూ.50వేల కోట్లతో నాబార్డ్, సిడ్బీ, ఎన్హెచ్బీలకు ప్రయోజనం కలిగేలా రీఫైనాన్స్ విండోను ప్రారంభించింది.
స్వాగతిస్తున్న కంపెనీలు
ఆర్బీఐ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఎంఫిన్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్ ఫైనాన్స్ సంస్థలు పేర్కొన్నాయి. అయినప్పటికీ ఆర్థిక రంగం పుంజుకోవాలంటే మరిన్ని నిధులు కావాలని నిపుణుల అంచనా.