45 రోజుల్లో బకాయిలు చెల్లించాలని నిర్ణయం, వారికి నితిన్ గడ్కరీ శుభవార్త
కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు మరో భారీ ఊరట. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పెద్ద పరిశ్రమలు దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర బాకీ పడ్డాయని చెప్పిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ... ఆ బకాయిల మొత్తాల్ని 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈలకు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎంఎస్ఎంఈల నగదు ఇరుక్కుపోయిందని, అవేమో ఆర్థిక సంస్థలకు బకాయిలు చెల్లించాల్సి న అవసరం ఉందన్నారు.
టాటా గ్రూప్ చరిత్రలో తొలిసారి కీలక నిర్ణయం, వారి వేతనాల్లో 20% కోత
మేం చెల్లిస్తున్నాం.. మీరూ చెల్లించండి
కేంద్రం ఎంఎస్ఎంఈలకు బకాయిలు చెల్లిస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నగదు చెల్లించాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు. ఎంఎస్ఎంఈలకు నగదు చెల్లించాలని రాష్ట్రాలు తమ శాఖలు, సంస్థలను ఆదేశించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలకు రుణాలు చెల్లించాలని గడ్కరీ పదేపదే కోరుతున్నారు. కరోనా కారణంగా ఎంఎస్ఎంఈలు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల రుణహామీ పథకాన్ని తీసుకు వచ్చింది.
ఎంఎస్ఎంఈల గ్రామీణ పరిశ్రమలు
ప్రభుత్వం ఎన్బీఎఫ్సీల కోసం తెచ్చిన పథకం రుణ లభ్యతలో కీలక పాత్ర పోషిస్తుందని గడ్కరీ చెప్పారు. రుణ పరపతి అందించడంలో కీలక పాత్ర పోషించేలా ఎన్బీఎఫ్సీలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ స్కీం రూపొందించినట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడాన్ని ప్రోత్సహించేందుకు అందులో గ్రామీణ పరిశ్రమలు అనే అనుబంధ విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
ఆర్థిక సంస్థల అన్వేషణ
ఎంఎస్ఎంఈలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కొత్త ఆర్థిక సంస్థలను అన్వేషిస్తోందని గడ్కరీ చెప్పారు. కరోనా వల్ల కలిగే ఆర్థిక నష్టాలను, ఆర్థిక అస్థిరతలను పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. క్లిష్ట సమయంలో అందరూ కలిసి పని చేయాలని, ఇండస్ట్రీ కూడా సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలని కోరారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి మాట్లాడుతూ.. ఇది ఎంఎస్ఎంఈలకు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సహకరిస్తుందన్నారు.